ప్రజా కవి, ప్రసిద్ధ వాగ్గేయకారుడు, శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్నతో పాటు యువకవి తగుళ్ల గోపాల్, దేవరాజ్ మహారాజ్ను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా అవార్డు గ్రహీతలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై అభినందనలు తెలియజేశారు.
సాహిత్యంలో వాళ్లు చేసిన కృషికి వాళ్లకు లభించిన గుర్తింపు తెలంగాణకే గర్వకారణం అని గవర్నర్ అన్నారు. ముఖ్యంగా గోరటి వెంకన్నను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. తన పాటలు, రచనల ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను దశదిశలా వ్యాపింపజేస్తున్నారని ఆమె ప్రశంసించారు. అలాగే.. కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని పొందిన దేవరాజు మహారాజు, సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన తగుళ్ల గోపాల్ సాహిత్యంలో చేసిన కృషికి ఆమె అభినందించారు.
గోరటి వెంకన్న రచించిన ‘వల్లంకి తాళం’ అనే కవితా సంపుటికి, తగుళ్ల గోపాల్ రాసిన ‘దండకడియం’ అనే కవితల పుస్తకానికి ఈ అవార్డులు దక్కాయి. దేవరాజు మహారాజు రాసిన ‘నేను అంటే ఎవరు’ అనే నాటకానికి ఈ అవార్డు లభించింది.