CM KCR Press Meet : ఓవైపు ధాన్యం సేకరణలో రైతులకు మొండి చేయి చూపించిన కేంద్ర ప్రభుత్వం మరోవైపు.. రైతుల ఉసురు పోసుకోవడానికి.. కొత్త కరెంట్ చట్టాన్ని తీసుకొస్తోందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
రైతుల ఉసురు పోసుకోవడానికి.. మధ్య తరగతి ప్రజలు ఉసురు పోసుకోవడానికి కొత్త కరెంట్ చట్టం తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా రైతుల మెడ మీద కత్తి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో బోరు కాడ మోటర్ పెట్టాలి.. అని చూస్తున్నారు.
కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ నుంచి నిన్ననే ఉత్తరం వచ్చింది. మన పవర్ మినిస్టర్కు ఉత్తరం వచ్చింది. విద్యుత్ సంస్కరణల మీద మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారితో మీటింగ్ అరేంజ్ చేయండి.. అని లెటర్ పంపించారు. సంస్కరణ అంటే ఏంటి.. ప్రతి బోరుకు మీటర్ పెట్టాలట. పెట్టకపోతే రాష్ట్రానికి వచ్చే అప్పులు కట్ చేస్తారట. రాష్ట్రం మెడ మీద కత్తి పెట్టి రాష్ట్రాల హక్కులు అధికారాలు హరించి.. మొత్తం పవర్ మీద పెత్తనం మొత్తం కేంద్రం తీసుకుంటదట. రేపు ఏమంటది.. కేంద్రం తీసుకొని. అన్ని రాష్ట్రాలకు సమానంగా ఇస్తాం. మీకు 24 గంటలు ఇవ్వం. 16 గంటలే వాడుకోవాలి అంటారు. ఇవేనా పవర్ రిఫార్మ్స్ అంటే. మేము ఎంతో కష్టపడి.. కిందా మీదా పడి నేడు 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటున్నాం. దాన్ని కూడా నాశనం చేస్తారా? బోరు కాడ మోటర్ పెట్టి ముక్కు పిండి వసూలు చేయాలని చెప్పడం లేదా? మీరు 24 గంటలు ఇవ్వకండి.. మేము ఇచ్చుకుంటున్నాం కదా.
ఈ దేశంలో రైతులు బాగుపడాలంటే ఈ ప్రభుత్వాన్ని పారద్రోలాల్సిందే. సామాన్య ప్రజలు, పేద ప్రజలు, రైతులకు రక్షణ రావాలంటే ఈ దుర్మార్గమైన బీజేపీ పరిపాలన పోవాలి ఈ దేశం నుంచి.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.