హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీనియల్ ఐఎఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశం సూచించారు. శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల సోసైటీ రీజినల్ కోఆర్డినేటర్ ఆఫీసర్ల సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని, పోషకాహార లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
రీజనల్ కోఆర్డినేటర్ ప్రతి నెలలో తప్పని సరిగా నాలుగు రోజులు పాఠశాలలో నైట్ హాల్ట్ చేయాలన్నారు. స్కూల్స్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని.. విద్యార్థుల సంక్షేమమే ప్రథమ ధ్యేయంగా పనిచేయాలన్నారు. విద్యాబోధనలోనూ, ఆహారం అందించడంలోనూ, మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని అధికారి హెచ్చరించారు. ప్రతి రీజనల్ కోఆర్డినేటర్ తప్పనిసరిగా తన పరిధిలోని స్కూళ్లను తరచుగా సందర్శించాలని ఆయన సూచించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్కు గురుకులాలు బాటలు వేయాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల సొసైటీ డిప్యూటీ సెక్రటరీలు ఇందిర, మంజుల, తిరుపతి, తెలంగాణలోని పది జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.