ప్రముఖ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, తొలి అర్జున అవార్డ్ గ్రహీత పిచ్చయ్య ఇక లేరు. జమ్మలమడక పిచ్చయ్య బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో తొలి అర్జున అవార్డును అందుకున్నారు. పిచ్చయ్యది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దేశాయ్పేట. చిన్నతనం నుంచే ఆయనకు బాల్ బ్యాడ్మింటన్లో ఆసక్తి ఏర్పడటంతో.. దాన్ని నేర్చుకొని జాతీయ స్థాయిలో రాణించారు. దేశాన్ని ఈ ఆటలో రాణించి దేశానికి గొప్ప పేరు తీసుకొచ్చారు. అలాగే.. నేటి తరానికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు.
1918, డిసెంబర్ 21న కృష్ణా జిల్లాలోని కూచిపూడిలో పిచ్చయ్య జన్మించారు. తన తండ్రి పున్నయ్య మచిలీపట్నంలో స్థిరపడటంతో కొన్నేళ్లు పిచ్చయ్య విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది. కానీ.. 10వ తరగతిలో ఫెయిల్ అయ్యాక పిచ్చయ్య బాల్ బ్యాడ్మింటన్ ఆడటంపై ఆసక్తి పెంచుకున్నారు. ఎటువంటి శిక్షణ లేకుండానే ఆయన బాల్ బ్యాడ్మింటన్లో మాస్టర్ అయ్యారు. ముందు క్లబ్స్ కోసం ఆడిన పిచ్చయ్య ఆ తర్వాత రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఆడి ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు.
ఆయన మృతి పట్ల రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. బాల్ బ్యాడ్మింటన్లో రాష్ట్రం నుంచి చాలామంది రాష్ట్ర, జాతీయ క్రీడాకారులుగా రాణించడంలో అర్జున్ పిచ్చయ్య విశేష కృషి చేశారని కొనియాడారు. ఇటీవల డిసెంబర్ 21న తన 104వ పుట్టినరోజు చాలా ఉత్సాహంగా జరుపుకున్నారని మంత్రులు తెలిపారు. అర్జున పిచ్చయ్య అకాల మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు మంత్రులు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.