నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ రైతులు, దళితుల వ్యతిరేక పార్టీ అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukhender Reddy )అన్నారు. గురువారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధి కోసం వ్యవసాయానికి రైతు బంధు పథకం అమలు చేస్తుంటే వారి అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డ, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణిక్యం ఠాక్రే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ నేతలకు వ్యవసాయం అంటే ఏంటో, రైతుల కష్టాలు ఏమిటో అస్సలు తెలియదన్నారు. ఇక దళితుల అభ్యున్నతి కోసం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని దళిత బంధు పథకాన్ని కూడా నిలుపుదల చేయాలని కాంగ్రెస్ నేతలు పిర్యాదు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతులు, దళితుల వ్యతిరేక పార్టీ అని స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు.
రైతులకు ఇచ్చే 24 గంటల కరెంట్, మిషన్ భగీరథ నీళ్లని కూడా ఆపేయాలని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేస్తారని ఆయన హెచ్చరించారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే శ్రీ రామారక్ష అని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చే బూటకపు హామీలను నమ్మి ఆ పార్టీకి ఓట్లు వేస్తే రాష్ట్రం అధోగతిపాలు అవుతుందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు తగిన బుద్ధి చెప్పాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రజలకు సూచించారు.