యాదగిరిగుట్ట, మే 26 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో స్వామివారికి నిత్యార్చనలు అత్యంత వైభవంగా సాగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రగమశాస్త్రం ప్రకారం జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సుదర్శన నారసింహ హోమం పాంచరాత్రగమశాస్త్ర రీతిలో సాగింది. ఉదయం ఆలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ సుదర్శన నారసింహ హవనం జరిపారు. వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి గజవాహన సేవ చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. భక్తులు స్వామివారి కల్యాణాన్ని వీక్షించారు.
ఆలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులకు పలు దఫాలుగా సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల తిరువీధిసేవ, దర్భార్ సేవలో, రాత్రి జరిగిన శయనోత్సవంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సాయంత్రం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమపవిత్రంగా నిర్వహించే సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. మత్తయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధిసేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలోని ఊయలతో శయనింపు చేయించారు. స్వామివారిని సుమారు 20వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.27,19,812 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న న్యాక్ బృందం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ గోపాల్రెడ్డి, రిజిస్ట్రార్ కృష్ణారావు, మణిపూర్ రాష్ర్టానికి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరెక్టర్ కృష్ణభాస్కర్, చండీఘడ్కు చెందిన పంజాబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నవదీప్ గోయల్, జమ్మూ కశ్మీర్ రాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్ ప్రొఫెసర్ కుర్షిద్ అహ్మద్ భట్తోపాటు పలువురు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.