బొడ్రాయిబజార్: ఆరోగ్యమే మహాభాగ్యమని అలాంటి మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన కోసం మనం కార్యక్ర మాన్ని చేపట్టిందని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. ఆదివారం పట్టణంలోని 4వ వార్డు దుబ్బతండా, భజన తండాలతో పాటు 9వ వార్డులో ప్రతి ఆదివారం 10గంటలకు 10నిమిషాలు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు ప్రబల కుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన కోసం మనం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు.
పట్టణంలోని ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల పాటు తమ ఇండ్లు, చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో నీరు నిలిచి దోమలు వృద్ధి చెంది అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. మన ఇంటిని మనం శుభ్రం చేసుకుంటే మన వార్డు కూడా శుభ్రమవుతుందని వార్డు శుభ్రమైతే పట్టణమంతా శుభ్రమవుతుందన్నారు. ఇప్పటికే మున్సిపల్ సిబ్బంది మురికి నీటి గుంటల్లో ఆయిల్బాల్స్ విసరడం, మెప్మా సిబ్బందికి ఇంటింటికీ స్టిక్కర్లు అంటించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలంతా ప్రతి ఆదివారం తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రం చేసుకొని ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరారు. అంటువ్యాధులు ప్రబలే కాలం కావడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో 4వవార్డు కౌన్సిలర్ జాటోతు లక్ష్మి మకట్లాల్, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, మెప్మా జిల్లా అధికారి రమేశ్నాయక్, టీఎంసీ శ్వేత, రిసోర్స్ పర్సన్లు, పారిశుధ్య జవాన్లు, కార్మికులు, మహిళా పొదుపు సంఘాల సభ్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.