సూర్యాపేటటౌన్, మే 21 : ఇష్టపడి చదివితే విజయం తప్పక వరిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో గుంటకండ్ల సావిత్రమ్మ మెమోరియల్ ట్రస్టు(ఎస్.ఫౌండేషన్)ఆధ్వర్యంలో టెట్ పేపర్-1, పేపర్-2 ఉచిత కోచింగ్ శిక్షణ పొందుతున్న 184 మంది అభ్యర్థులకు శనివారం రాత్రి స్టడీ మెటీరియల్ అందజేసి మాట్లాడారు. నా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఎస్.ఫౌండేషన్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫౌండేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలతోపాటు పేద విద్యార్థులకు ఫీజుల చెల్లింపు, పుస్తకాలు అందిస్తున్నట్లు తెలిపారు. మొదటగా పాఠశాలల్లో 40 వేల పుస్తకాలు, కళాశాలల్లో లక్ష పుస్తకాలు పంపిణీ చేయడంతోపాటు ఎస్.ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడల్లో గ్రామీణ యువకులను ప్రోత్సహించడం, జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్లు విడుదలవుతున్న సందర్భంలో అధిక ఫీజులు చెల్లించి కోచింగ్ తీసుకోలేని వారి సౌకర్యార్థం ఎస్.ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.ఎస్.ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేసిన స్టడీ మెటీరియల్ను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, ఎస్.ఫౌండేషన్ సీఈఓ మాదంశెట్టి వీరయ్య, ముదిరెడ్డి అనిల్రెడ్డి, దేశగాని శ్రీనివాస్, కొమ్ము ప్రవీణ్ పాల్గొన్నారు.