హుజూర్నగర్రూరల్, ఫిబ్రవరి 18 : మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని తాసీల్దార్ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 47 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన అందజేసి మాట్లాడారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక ఇబ్బంది లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. ఆడబిడ్డల పెండ్లీలకు ప్రభుత్వం ఆర్థ్ధిక సాయం అందించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఎక్కడా అవినీతి లేకుండా లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థ ఉండేదని గుర్తు చేశారు. నియోజకవర్గంలో రూ.7 కోట్లతో మిని ట్యాంక్ బండ్, రూ 2.5 కోట్లతో పార్కు, రూ.6 కోట్లతో బైపాస్ రోడ్డు పనులు, రూ.7 కోట్లతో సమీకృత వెజ్, నాన్ వెజిటేరియన్ మార్కెట్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరో 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనారవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర్రావు, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, ఎంపీటీసీ విజయలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్లు శౌరెడ్డి, శ్రీనివాస్, సర్పంచులు శిరీషాకొండారెడ్డి, రమ్యానాగరాజు, సలీమా, జయమ్మ, సౌజన్య, కౌన్సిలర్లు ఫణికుమారి, గురువయ్య, నాగేశ్వర్రావు, ఉపేంద్ర, సౌజన్య, రాంగోపి, లబ్ధిదారులు పాల్గొన్నారు.