సూర్యాపేట ఫిబ్రవరి 17 : మన ఊరు మన బడి కార్యక్రమానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి రూ.7,289 కోట్లు బడ్జెట్ అంచనా రూపొందించిందన్నారు. మొదటి దఫాలో భాగంగా ఎంపిక చేసిన 329 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకోసం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. ఎంపికైన పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ప్రహరీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్తోపాటు అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలన్నారు. మొదటి దఫాలో 9,123 పాఠశాలల్లో 35 శాతం ప్రకారం ప్రభుత్వం రూ.3,497.62 కోట్లను బడ్జెట్ అంచనా వేసిందని తెలిపారు.
ప్రతి పాఠశాలలో అవసరమైన 12 కీలక అంశాలను పాటిస్తూ మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. గుర్తించిన పాఠశాలల్లో రెండు బ్యాంకు అకౌంట్లు తెరవాలని సూచించారు. ఎస్ఎంసీ తీర్మానం చేపట్టి చర్యలు తీసుకోవడంతోపాటు దాతల నుంచి విరాళాలు సేకరించిన అనంతరం వారి పేర్లను పాఠశాలకు, తరగతి గదులకు పెట్టాలని చెప్పారు. పనుల మంజూరు అధికారం జిల్లా కలెక్టర్కు ఉంటుందని, చేపట్టే పనులు ఎస్ఎంసీకే ఉంటుందని, సకాలంలో పనులు పూర్తి చేయకుంటే మరోఏజెన్సీకి ఇస్తారని తెలిపారు. పాత భవనాలను నిబంధనల మేరకు తొలగించాలని చెప్పారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్ రావు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ మోహన్ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, డీఈఓ అశోక్, జడ్పీ సీఈఓ సురేశ్ కుమార్, పీడీ సుందరి కిరణ్ కుమార్ పాల్గొన్నారు.