బొడ్రాయిబజార్: ప్రజా ఉద్యమాలకు ఆయుధం పాట అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఐఎంఏ ఫంక్షన్హాల్లో ప్రజనాట్య మండలి రాష్ట్ర రెండో మహాసభలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజా ఉద్యమాలకు కేంద్రమైన సూర్యాపేటలో ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలు నిర్వహించడం శుభ సూచకమన్నారు.
ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో రాష్ట్ర మహాసభలు జరుపుకోవడం అంటే నాటి పోరాటాలను నెమరువేసుకోవడ మేనన్నారు. దేశంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్నఈ సందర్భంలో ప్రజా నాట్యమండలి రాష్ట్ర మహాసభ లు జరుపుకోవడంతో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నదన్నారు. కళాకారులు లేని పోరాటం లేదన్నారు. నాటి వీర తె లంగాణ సాయుధ పోరాటం నుంచి నేడు ప్రత్యేక తెలంగాణ పోరాటం వరకు పాట నిర్వహించిన పాత్ర గొప్పదన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో బండి యాదగిరి రాసిన బండెనక బండి కట్టి అనేక పాట నాటి తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపు నిచ్చిందన్నారు. చదువురాని మట్టి మనుషులు పాడే పాటలు ప్రజా జీవితంలో అనేక మార్పులకు కారణమయ్యాయన్నారు. కవులు, కళాకారులు లేకుండా ఏ ఉద్యమం ఏ పోరాటం విజయం సాధించలేదన్నారు. ప్రజా నాట్య మండలి కాసుల కోసం కాదని కల ప్రజల కోసం ప్రగతి కోసం పని చేస్తుందన్నారు. దేశంలో బీజేపీ పాలన వచ్చాక కవులు, కళాకారులకు రచయితలకు రక్షణ కరువైందన్నారు.
ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నాయన్నారు. పాలక ప్రభుత్వాలను ప్రశ్నించే గొంతు అయిన కళాకారులు ప్రజా ఉద్యమాలకు ఊతమిస్తూ ప్రజా సమస్యలే ఊపిరిగా అనేక పాటలు, నాటికలు రూపొందిస్తూ ప్రజలకు చైతన్యాన్ని అందించేది ఒక్క ప్రజా నాట్య మండలి మాత్రమే అన్నారు. ఈ మహాసభల ప్రారంభ సూచికగా పీఎన్ఎం జెండాను సీనియర్ కళాకారులు అబ్బగాని భిక్షం ఆవిష్కరించారు.