సూర్యాపేట, ఏప్రిల్ 20 : కొవిడ్ పట్ల ప్రజల్లో అపోహలు సృష్టించి భయాందోళనకు గురిచేస్తున్నారని, కానీ ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కరోనా వ్యాధి సెకండ్ వేవ్పై విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన బారిన పడిన వారికి ఆక్సిజన్, దవాఖానల్లో బెడ్లు సరిపడా ఉన్నాయని, వారికి మెరుగైన వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.
కరోనా బారిన పడిన వారితోపాటు ప్రజల్లో మనోధైర్యాన్ని నింపే బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే సామర్థ్యం ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలన్నింటినీ ప్రభుత్వం స్వాధీనపర్చుకుందని చెప్పారు. ఆయా దవాఖానల్లో ఖాళీల వివరాలు తెలిపేందుకు డ్యాష్ బోర్డులను ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. మే 1 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఉధృతం చేయనున్నట్లు వెల్లడించారు. రోజుకు 10లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వగల సామర్థ్యం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు ఉన్నదని తెలిపారు. ప్రజలను కాపాడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. కరోనా కట్టడి కోసమే రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని కోరారు.
ఎవరూ ఆందోళన చెందవద్దు : మంత్రి జగదీశ్రెడ్డి
ఉమ్మడి జిల్లాలోని దవాఖానల్లో ఖాళీ బెడ్స్ చాలా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు తెలిపే విధంగా డ్యాష్బోర్డు ఏర్పాటు చేస్తామని, సంబంధిత మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారని గుర్తుచేశారు. డ్యాష్ బోర్డు ద్వారా ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఉమ్మడి జిల్లా దవాఖానల్లో ఇప్పటి వరకు కేవలం ఐదు శాతం మాత్రమే బెడ్స్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేయొద్దన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి ఏరియా దవాఖానతోపాటు ఆలేరు, రామన్నపేట, చౌటుప్పల్ దవాఖానల్లో 210బెడ్స్ ఉండగా కొవిడ్ పేషంట్ల కోసం 50బెడ్స్ కేటాయించారన్నారు. బీబీనగర్ ఎయిమ్స్లోని 80బెడ్లు సైతం కొవిడ్ పేషంట్లకు కేటాయించామన్నారు. వీటిలో 60 బెడ్లకు ఆక్సిజన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రైవేటు దవాఖానలను సైతం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అవరమైతే అదనపు సిబ్బందిని నియమిస్తామన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ, సూర్యాపేట కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు, డీఎంహెచ్ఓలు, మెడికల్ కళాశాలలు, ఏరియా దవాఖానల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభం..
ఆరోగ్య రంగంలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని, అందుకు సీఎం కేసీఆర్ కృషి కారణమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో రూ.7కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 50పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన సహచర మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్నిరంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. గతంలో వెనుకబడి ఉన్న ఉమ్మడి జిల్లా రూపురేఖలను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నాయకత్వంలో కోట్లాది రూపాయల నిధులతో మార్చారన్నారు. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాకు రెండు మెడికల్ కళాశాలలు సాధించిన ఘనత కూడా మంత్రికే దక్కిందన్నారు.
మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మాట్లాడుతూ తల్లులు ఆరోగ్యంగా ఉన్నపుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, అప్పుడే ఆ సమాజం అభివృద్ధిలోకి వస్తుందని పేర్కొన్నారు. పూర్తి వసతులతో మాతా శిశు ఆరోగ్య కేంద్రం వారం రోజుల్లో అందుబాటులోకి రానున్నదని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్రావు, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, స్థానిక మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శారదాదేవి, డీఎంహెచ్ఓ కోటాచలం, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.