కోదాడ రూరల్ : తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమి చైర్మన్గా కోదాడ ప్రాంత వాసి జూలూరు గౌరిశంకర్ను నియమిస్తు శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడినాయి. ఈ ప్రాంత వాసికి సాహిత్య అకాడమి చైర్మన్ రావడంతో కోదాడ పరిసర ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో బి.సి కమిషన్ సభ్యులుగా పనిచేసి, ఇప్పుడు సాహిత్య అకాడమి చైర్మన్ కావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోదాడ ప్రాంతం నడిగూడెం గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు జూలూరి చిన బసవయ్య, సక్కుబాయమ్మలకు ఐదుగురు సంతానం. అందులో ఒక కుమార్తె, అందరికంటే పెద్దవాడు గౌరిశంకర్. ప్రాథమిక విద్యా 6 నుంచి 9వ తరగతి వరకు నడిగూడెం, 10వ తరగతి అనంతగిరిలో పూర్తి చేశారు.
ఇంటర్, డిగ్రీ కోదాడ కెఆర్ఆర్ కళాశాలలో, శ్రీకృష్ణదేవారాయల విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. అనంతరం కళాశాల అధ్యపకులుగా, జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించారు. నల్లగొండ, పల్నాడు ఏరియా, విజయవాడ సీనియర్ జర్నలిస్టుగా, హైద్రాబాద్లో సుధీర్గ కాలం ఎడ్యూకేషన్ రిపోర్టర్గా పనిచేశారు. ప్రవృత్తిగా కవిత్వం, వ్యాసాలు రాయడం, సాహిత్య సభలు, సమావేశాలు నిర్వహిస్తు తాను నెలకొల్పిన సృహ సాహితి సంస్థ ద్వారా సామాజిక సృహగల పుస్తకాలు ముద్రించారు. మలిదశ ఉద్యమంలో తొలి వనచ దీర్ఘకవిత ‘‘నా తెలంగాణ’’ కావ్యన్ని రచించి ఉద్యమంలో పాలు పంచుకున్నారు. పొక్కిలి రచనతో తెలంగాణ పొక్కిలి చేసి అంతర్జతీయంగా ఎన్ఆర్ఐ తెలంగాణ వాదులను ఏకం చేసేందుకు ఈ రచన ఎంతగానో ఉపయోగపడినది.
2001లో ‘‘వెంటాడే కలాలు – వెనుకబడిన కులాలు’’ అన్న తొలి బిసి కవితా సంకలనానికి సంపాదకత్వం వహించారు. తెలంగాణ సాధన కోసం ఈ ప్రాంత రచయితలను ఏకం చేసేందుకు తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటు చేశారు. 2006 విశాఖపట్నం గాజువాకలో జరిగిన తెలుగు సాహిత్య సదస్సులో పాల్గొని ఆంధ్రా కవులారా మీరెటువైపు అని గొంతెత్తి ప్రశ్నించి అలజడిని సృష్టించారు. ఆంధ్ర ప్రాంతంలో పలు ప్రధాన నగరాలలో జరిగిన సాహిత్య సదస్సులలో పాల్గొని ఆంధ్రావారి చేత జైతెలంగాణ అనింపిచారు. తెలంగాణ సాధన కోసం నిర్మించిన జైబోలో తెలంగాణ సినిమాలో అధ్యపకుడిగా నటించారు. 2009 డిసెంబర్ 9వ తేదిన ఉస్మానియా విద్యార్థులకు సంఘీభావం కార్యక్రమంలో అరెస్టు అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం హైద్రాబాద్ బుక్ ఫేయిర్ అధ్యక్షులుగా, 2018 బి.సి కమిషన్ సభ్యులుగా పని చేశారు.