సూర్యాపేట అర్బన్, డిసెంబర్ 12:పాల వినియోగం.. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో రాష్ట్రంలో ఇప్పటికీ దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తుంది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తూ పలు పథకాల ద్వారా తెలంగాణ పాడి రైతులను ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులకు ప్రభుత్వం పాడి పశువులను పంపిణీ చేసింది. వాటికి బీమా చేయించి పాడి రైతులకు ధీమా కల్పించింది.
విజయ డెయిరీ, నార్మాక్స్ సహకారంతో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 1,490 పశువులను సబ్సిడీపై అందించింది. పశువుల పంపిణీకి ప్రభుత్వం ఒక్కో యూనిట్కు రూ.80 వేలు కేటాయించింది. ఇందులో రవాణా, దాణా, ఇన్సూరెన్స్ వంటి ఖర్చులు పోగా మిగిలిన 70 వేల రూపాయలతో పాడి పశువులను అందించింది. పశువులను కొనుగోలు చేసిన తేదీ నుంచి బీమా వర్తించే విధంగా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందమే రైతులకు వరంగా మారింది. అందించిన పశువుల్లో 61 పశువులు వివిధ కారణాలతో మృతి చెందాయి. ఇన్సూరెన్స్ ఉండటంతో ఇప్పటికే 51 మంది రైతులకు తిరిగి కొత్త వాటిని అందించారు. మిగిలిన 10 మంది రైతులకు కూడా త్వరలో అందించనున్నారు.
51 మంది రైతులకు తిరిగి పంపిణీ..
కరెంట్ షాక్, వ్యాధులు, ప్రమాదాలు, విషపూరిత గడ్డి స్వీకరించడం వంటి సంఘటనలు జరిగినప్పుడు రైతు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం బీమా కల్పించింది. బీమాలో భాగంగా ఒక్కో పశువుకు రూ.70 వేలు చెల్లిస్తారు. 61 పశువులు చనిపోగా ఇందులో 51 పశువుల కోసం బీమా సంస్థ సుమారు 35 లక్షల 70 వేల రూపాయలు కేటాయించడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు కొత్త వాటిని కొనుగోలు చేసి తిరిగి పాడి రైతులకు అందించారు. పెన్పహాడ్-2, ఆత్మకూరు-5, సూర్యాపేట-3, తుంగతుర్తి-9, తిరుమలగిరి-3, నాగారం-2, జాజిరెడ్డిగూడెం-3, నూతనకల్-1, మోతె-9, కోదాడ-9, చిలుకూరు-3, నేరేడుచర్లలో ఇద్దరికి అందజేశారు.
ప్రభుత్వ ముందు చూపుతో భరోసా..
పాడి పశువుల పంపిణీ సమయంలోనే ప్రభుత్వం అలోచించి ప్రతి పశువుకు తప్పనిసరిగా బీమా చేయించి లబ్ధిదారులకు అందించడంతో పాడి రైతులకు
భరోసా ఏర్పడింది. ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించి పాడి రైతులు నష్టపోకుండా అండగా నిలిచింది. లబ్ధిదారుల ఇష్టానుసారమే ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి కొనుగోలు చేసుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
మిగిలిన వారికి త్వరలోఅందజేస్తాం
ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 61 పశువులు మరణించాయి. వాటికి బీమా చేయడంతో ఇప్పటికే 51 మంది పాడి రైతులకు రూ. 35 లక్షలా 70 వేల విలువ గల పశువులను అందించాం. మిగిలిన 10 మందికి బీమా సొమ్ము రాగానే వారి ఇష్ట ప్రకారం కొత్తవాటిని కొనుగోలు చేసి అందజేస్తాం. అందుకే ప్రతి రైతు తమ బర్రెలు, పశువులకు బీమా తప్పకుండా చేయించుకోవాలి. బీమాతో పాడి రైతులకు భరోసా ఉంటుంది.