న్యూఢిల్లీ: ఇండియా నుంచి ప్రయాణికుల విమానాలను నిషేధించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆ దేశ మాజీ క్రికెటర్, ఐపీఎల్ కామెంటేటర్ మైకేల్ స్లేటర్. సోమవారం ట్విటర్ ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. నిజంగా ఆస్ట్రేలియన్ల భద్రత గురించి ప్రభుత్వం ఆలోచిస్తే మమ్మల్ని ఇంటికి రావడానికి అనుమతిస్తారు. ఇది చాలా అవమానకరం. మీ చేతులకు రక్తం అంటింది పీఎం. మాతో ఇలా వ్యవహరించడానికి మీకెంత ధైర్యం. మీ క్వారంటైన్ వ్యవస్థను ఎందుకు మెరుగుపరచుకోవడం లేదు. ఐపీఎల్లో పని చేయడానికి నాకు ప్రభుత్వ అనుమతి ఉంది. కానీ ఇప్పుడదే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అని స్లేటర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.
ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మే 15 వరకూ ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో ఐపీఎల్లో ఉన్న ఆస్ట్రేలియా ప్లేయర్స్తోపాటు కొన్ని వేల మంది ఆస్ట్రేలియా పౌరులు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్లో 14 మంది ప్లేయర్స్తోపాటు మరికొందరు కామెంటేటర్లు కూడా ఐపీఎల్లో ఉన్నారు. ఇప్పటికే ముగ్గురు ఆసీస్ ప్లేయర్స్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే.