సైబర్ దునియా విస్తృతి పెరిగే కొద్దీ.. విశృంఖలత్వమూ పెచ్చరిల్లుతున్నది. మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు ఫ్రాడ్స్టర్లు. మన బలహీనతలను వారి బలంగా మలుచుకుంటున్నారు. అత్యాశకు పోయే వారిని అమాంతం ముంచేస్తున్నారు. సందేశం రూపంలోనో, లింక్ ద్వారానో ఫోన్లో తలదూర్చి.. వినియోగదారుణ్ని ఏమార్చి పబ్బం గడుపుకొంటున్నారు. ఆన్లైన్ మోసాలకు గురైన బాధితులు మాత్రం.. జరిగింది చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక కుంగిపోతున్నారు. కంటికి కనిపించని ఆన్లైన్ శత్రువును మట్టికరిపించడం తేలికే. సైబర్ క్రైమ్ పోర్టల్లోకి ఎంటర్ అయితే చాలు.. ఈ మోసగాళ్ల భరతం ఇట్టే పట్టేయొచ్చు.
ఆన్లైన్ మోసాల్లో చాలావరకు ఆడపిల్లలను టార్గెట్ చేసేవే ఉంటున్నాయి. చిన్నపిల్లలు, ఒంటరి మహిళలు లక్ష్యంగా.. సైబర్ కీచకులు వలపు వల విసురుతున్నారు. అసభ్యకరమైన వీడియోలు పంపడమో, చూపించడమో చేస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. తెలిసీ తెలియక ఇలాంటి దుర్మార్గుల ఉచ్చులో చిక్కిన వాళ్లు.. పరువు పోతుందనే భయంతో మిన్నకుండిపోతున్నారు. ఈ నిర్లిప్తతే సైబర్ కేటుగాళ్లకు బలాన్నిస్తున్నది. ‘మనల్ని ఎవరేం చేస్తారులే’ అన్న ధైర్యాన్నిస్తున్నది. మీకు ఎదురైన చేదు అనుభవం మరెవరికీ ఎదురు కావొద్దంటే.. సైబర్ క్రైమ్ను సంప్రదించడమే పరిష్కారం. 1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఫోన్ సర్వీసు అందుబాటులో ఉంటుంది. https://www.cybercrime.gov.in వెబ్లింక్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు.
ఆన్లైన్ ఆర్థిక నేరాలను పరిష్కరించడానికి సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్సీఎఫ్ఆర్ఎమ్ఎస్) అందుబాటులో ఉంది. ఈ వ్యవస్థ ద్వారా సైబర్ నేరగాళ్లు లూటీ చేసిన సొమ్మును త్వరగా పొందే అవకాశాలూ కొంతవరకు ఉంటాయి. 1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేకపోయినా, జరగబోయే అనర్థాన్ని ఆపొచ్చు. పోలీసులు, బ్యాంకు అధికారుల మధ్య వారధిగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. డబ్బు అందుకున్న ఖాతాను స్తంభింపజేస్తారు అధికారులు. ఫోన్ నంబర్ ద్వారా నేరగాళ్లను ట్రాక్ చేసి బాధితులకు న్యాయం చేస్తారు. ఫిర్యాదు చేసే సమయంలో దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్లు ఇవి..
అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు
ఎండ్నౌ ఫౌండేషన్