Gandhi Jayanti | కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మనిషి ఇతర జీవుల నుంచి వేరుపడ్డాడు. దానికి చాలా కారణాలే చెబుతారు. నిటారైన వెన్ను, మాట, విశాలమైన మెదడు, పొడవైన బొటనవేలు, నిప్పును అదుపు చేయగల శక్తి… ఇలాంటి అనేక ప్రత్యేకతలు అతడిని ముందుకు నడిపించాయి. నాగరికత పాఠాలు నేర్పించాయి. ఈ క్రమంలోనే రకరకాల అనుభవాలు తనను విభ్రాంతికి గురిచేశాయి. కనురెప్పల వెనుక ఏర్పడే కలల దగ్గర నుంచీ, అందనంత దూరాన ఉరిమే మబ్బుల వరకూ.. అంతా అయోమయంగా తోచింది. వాటికి తనవైన కారణాలు వెతుక్కున్నాడు. అతీతమైన శక్తి ఏదో ఈ సృష్టిని నడిపిస్తున్నదని నమ్మడం మొదలుపెట్టాడు. ఆ అంతర్యామిని పూజించసాగాడు. పరమాత్మ ఉనికికి సంబంధించి రకరకాల సిద్ధాంతాలు, రాద్ధాంతాలు మొదలయ్యాయి. సాకారుడా, నిరాకారుడా, సగుణుడా, నిర్గుణుడా.. ఎన్నో తర్జనభర్జనలు. ఎవరికివారు తమ వాదనే నిజమని బలంగా నమ్మసాగారు. ఎదుటివారిని చులకన చేయసాగారు. ఇక్కడే మొదలైంది.. గొడవ. మనిషి సహజంగానే స్వార్థపరుడు. తన స్వార్థానికి మతాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు. మత యుద్ధాలతో మొదలై మత రాజకీయాల వరకూ విస్తరించిందా దాడి. ఇలాంటి సంక్షోభ సమయాల్లో గాంధీజీ తప్పక గుర్తుకువస్తారు. మతంలోని ప్రతి పార్శం మీద ఆయన వెలిబుచ్చిన
అభిప్రాయాలు అమూల్యమైనవి, అన్వయించుకోదగినవి.
గాంధీ అంటే రామభక్తుడే గుర్తుకొస్తాడు. తన తుదిశ్వాసలోనూ ఆయన రాముడినే తలుచుకున్నాడని అంటారు. రామనామం పట్ల ఆయన నమ్మకం వెనుక పెద్ద కథే ఉంది. చిన్నతనంలో గాంధీకి భయం ఎక్కువగా ఉండేది. అలాంటి ఓ సందర్భంలో చీకటివేళ… పరదాల కదలికలకు సైతం భయపడుతున్న సమయంలో, ఇంట్లో పనిచేసే రంభ అనే మహిళ తనకు ధైర్యం చెప్పింది. ‘ఎందుకలా భయపడతావు! గుర్తుంచుకో. రాముడిని తల్చుకునేవాడిని భయం దరిచేరదు. రామనామం నిన్ను ఎప్పటికీ కాపాడుతుంది.’ అని ఊరడించింది. అనారోగ్యంతో మంచంపాలైన తండ్రి పక్కన కూర్చుని.. ఆయన కోసం రామాయణం చదువుతున్న సమయంలో గాంధీకి ఆ ఇతిహాసం పట్ల మక్కువ పెరిగింది. గాంధీజీ దృష్టిలో రాముడు మత పురుషుడు కాదు. మర్యాదా పురుషోత్తముడు. కష్టసుఖాలలో తోడుండే తారకమంత్రం. ‘నా రాముడు… నా ప్రార్థనల్లోని రాముడు… కేవలం దశరథ తనయుడో, అయోధ్యకు రాజో కాదు. తను జననమరణాలకు అతీతమైన శక్తి. ఆ రాముణ్నే నేను పూజిస్తాను. తన సాయం కోరతాను’ అంటారు గాంధీజీ. రామాయణం, అందులోనూ తులసీదాసు ‘రామచరిత మానస్’ అంటే తనకు మహా ఇష్టం. గాంధీజీ రామనామం గురించి ఉటంకించిన సందర్భాలు అనేకం. తన దృష్టిలో రాముడు కులమతాలకు అతీతంగా అందరివాడు. అలాగని రామజపంతో అద్భుతాలు జరుగుతాయని ఆయన అనుకోలేదు. ‘రామనామాన్ని జపిస్తే పోయిన ప్రాణం తిరిగిరాదు. కానీ అంతకంటే ఎక్కువ మేలే జరుగుతుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉండగలం’ అంటారు. కానీ, కొందరు ఆ పేరు చెప్పుకొని కల్లోలాలు సృష్టిస్తున్నారు.
‘నేను ఒకసారి మైసూరుకు వెళ్లాను. అక్కడి గ్రామస్తులను- మీ రాజు ఎవరు? అని అడిగితే, ఎవరో దేవుడు మమ్మల్ని పాలిస్తున్నాడు అంటూ బదులిచ్చారు. తమ దేశాన్నేలే రాజు గురించే వాళ్లకు తెలియకపోతే, సృష్టిని నడిపించే శక్తి గురించి మనకేం తెలుస్తుంది?’ అంటారు గాంధీ. దైవమే కాదు, దాన్ని ఆరాధించే మతం కూడా ముఖ్యమేనని అంటారు గాంధీ! ‘మనిషి మతం లేకుండా ఉండలేడు. ఏదో ఒక కారణం వల్లనో, అలవాటుగానో, మూఢనమ్మకంతోనో మనిషి మతం సాయంతో దైవంతో అనుబంధాన్ని కొనసాగిస్తాడు’ అంటారు. ఆయన దృష్టిలో మతంలో అనైతికతకు చోటు లేదు. ‘దేవుడి పేరు చెప్పుకొని దుర్మార్గంగా ప్రవర్తించడం కపటత్వమే. మతం ఎప్పటికీ మానవత్వాన్ని కాలరాయదు. మనం విలువలను కోల్పోయిన రోజు, మన మతాన్ని కూడా కోల్పోతాం’ అంటూ స్పష్టంగా చెప్పేశారు.
ఇంగ్లండుకు వెళ్లినప్పుడు గాంధీజీ… అక్కడివారితో తాను భగవద్గీత చదవలేదని చెప్పాల్సి వచ్చినందుకు సిగ్గుపడ్డారు. ఎలాగైనా గీత మీద పట్టు సాధించాలని అనుకున్నారు. అప్పటినుంచీ గీతావాణి ఆయనకు తోడుగా మారింది. ‘భగవద్గీతలోని యుద్ధరంగాన్ని, సమర నినాదాన్నీ జనం ఇంకోలా అర్థం చేసుకుని ఉండవచ్చు. నేను మాత్రం పర్యవసానం ఎలా ఉన్నా యుద్ధం చేసి తీరాలి అనే విషయాన్ని గీత నుంచే నేర్చుకున్నా’ అని చెబుతారు గాంధీ. ఆయన అందులోని నిష్కామకర్మను, స్థితప్రజ్ఞతను ఆచరించే ప్రయత్నం చేశారు. ‘సంశయాలు వెన్నంటినప్పుడు, నిరాశ అలుముకున్నప్పుడు, కనుచూపు మేర వెలుగురేఖ కానరానప్పుడు… నేను గీతను ఆశ్రయిస్తాను. అందులో ఏదో ఒక శ్లోకం నాకు జవాబుగా మారుతుంది. ఎడతెగని దుఃఖంలో చిరునవ్వును అందిస్తుంది.’ అంటారు. ఆయన దృష్టిలో కురుక్షేత్ర యుద్ధం భౌతికమైనది కాదు. మంచికీ చెడుకీ మధ్య జరిగే సంఘర్షణకు సూచన. యుద్ధం ఎంతటి శోకానికి దారితీస్తుందో చాటే హెచ్చరిక. భగవద్గీతను అంతలా ప్రేమించి, అనుసరించారు కాబట్టే… స్వాతంత్య్ర సంగ్రామంలో.. ఊపిరి సలపని సమయంలో కూడా గీత శ్లోకాలను గుజరాతీలోకి అనువదించారు. ఆ పుస్తకం పేరు- అనాసక్త యోగ.
గీతను తన జీవితానికి మార్గదర్శిగా భావించిన గాంధీ ఇతర మతగ్రంథాలను ద్వేషించలేదు సరికదా… వాటిలో ఉన్న ప్రతి మంచి విషయాన్నీ ఆకళింపు చేసుకున్నారు. బైబిల్ మీద తనకు మంచి పట్టు ఉంది. అలాగే బైబిల్ ఆధారంగా టాల్స్టాయ్ రాసిన ‘దేవుని రాజ్యం నీలోనే ఉంది’ పుస్తకాన్ని చాలా అభిమానించేవారు. బుద్ధుడి జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఎడ్విన్ ఆర్నాల్డ్ రాసిన ‘ద లైట్ ఆఫ్ ఆసియా’ పుస్తకం కూడా ఆయన్ని చాలా ప్రభావితం చేసింది.
గాంధీ దేవుడిని నమ్మారు. మతాన్నీ నమ్మారు. హిందూమతం పట్ల విశ్వాసంగానూ ఉన్నారు. మరి ఆయన ఇతర మతాలను ఎందుకు ద్వేషించలేదు? అనే సందేహం రావడం సహజం. ఒక మతాన్ని అనుసరించడం అంటే మరో మతాన్ని వ్యతిరేకించడమే అనే భావనలో ఉన్న ఈ సందర్భంలో… మత వైరుధ్యాల గురించి గాంధీ అభిప్రాయాలు చాలా ఉన్నతంగా కనిపిస్తాయి. ‘సిద్ధాంతపరంగా చూస్తే… పరమాత్మ ఒక్కడే కాబట్టి, మతం కూడా ఒక్కటే ఉండాలి. కానీ ఏ ఇద్దరు వ్యక్తులకూ దేవుడి గురించి ఒకే అభిప్రాయం ఉండదు. కాబట్టి భిన్నమైన ఆలోచనలు, వాతావరణ పరిస్థితులను బట్టి వేర్వేరు మతాలు ఉండి తీరతాయి’ అంటారు. తన హిందూమతాన్ని ఆయన పరమత సహనానికే వినియోగించుకున్నారు. ‘ఓ హిందువుగా ప్రతి మతమూ విశిష్టమైనదని గుర్తించగలను. అదే సమయంలో ప్రతి మతమూ అసంపూర్ణమే. ఎందుకంటే… దాన్ని అమలుపరిచేది లోపాలకు అతీతం కాని మనుషులు కాబట్టి!’ అంటారు. అన్ని మతాలూ ఒక్కటే అని చెప్పడానికి గాంధీ ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఉపమానాలు వాడారు. ‘ఒకటే లక్ష్యాన్ని చేరుకోవడానికి వాడే వేర్వేరు దారులు మతాలు. గమ్యం ఒకటే అయినప్పుడు, ఎవరు ఏ దారిని ఎంచుకుంటే ఏమైంది?’ అని ప్రశ్నిస్తారు. ‘ఏడుగురు గుడ్డివాళ్లు ఏనుగును తడుముతూ వేర్వేరుగా వర్ణించినట్టు, మతం ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపించడంలో తప్పులేదు’ అని తేటతెల్లం చేస్తారు. ఎరవాడలో చేసిన ఓ ప్రసంగంలో ‘ఒకటే వృక్షం నుంచి వెలువడిన శాఖలు’గా మతాలను వర్ణిస్తారు. మతం పేరుతో చెలరేగిన హింసకు కారణం వాతావరణమే కానీ, ఆ మతగ్రంథాలు కావనేది గాంధీజీ నిశ్చితాభిప్రాయం.
చివరగా గాంధీజీ… ‘సుదీర్ఘమైన అధ్యయనం, అనుభవాల తర్వాత నాకు కలిగిన అభిప్రాయం ఏమిటంటే… మతాలన్నీ సత్యమే; ప్రతి మతంలోనూ ఎంతో కొంత లోపం ఉంది; మనుషులంతా నా బంధువులని ఎలా విశ్వసిస్తానో, అన్ని మతాలూ నాకు హిందూమతం అంత దగ్గరైనవే అనీ భావిస్తాను.’ అంటారు. అందుకే పరమత సహనానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. మత ఘర్షణలు చెలరేగినప్పుడల్లా, మొత్తం దేశం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నప్పుడు కూడా ఆయన సామరస్యం కోసమే పాటుపడ్డారు. ‘పరమత సహనం అనే మాటే నాకు నచ్చదు. ఎందుకంటే ఆ మాటలోనే ఇతర మతాలు మనకంటే తక్కువ అనే భావన స్ఫురిస్తుంది. అంతే తప్ప మరోమాట నాకు గుర్తుకురావడం లేదు’ అని వాపోతారు.
గాంధీ ధార్మిక బోధల కంటే విచక్షణకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ‘భగవద్గీత సహా… ఏ పవిత్ర గ్రంథాన్ని చదివేటప్పుడు అయినా, అది నా విచక్షణకు అడ్డుపడనీయను. ధార్మికమైన గ్రంథాలను వెలువరించడంలో, వ్యాఖ్యానించడంలో మనుషుల పాత్ర ఉంటుంది కాబట్టి వాటిలో వడపోతలు ఉంటాయి’ అని హెచ్చరిస్తారు. మతగ్రంథాలను చెడుపనులకు సాకుగా చెప్పడం కూడా ఆయనకు నచ్చదు. ‘పాపం చేసినవాడు తన పాపాన్ని సమర్థించుకునేందుకు రామ్చరిత మానస్ను ఉపయోగించుకోవచ్చు. అంతమాత్రాన ఆ గ్రంథాన్ని చదివేవాళ్లు కేవలం పాపాలనే నేర్చుకుంటారని చెప్పేందుకు వీలులేదు. ‘సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతా’ అనే న్యాయాన్ని బట్టి అన్ని గ్రంథాలలో దోషాలు ఉంటాయి. కాబట్టి హంసలాగా దోషాలనే నీటిని త్యజించి సుగుణాలనే పాలను గ్రహించాలి.’ అని తేల్చి చెబుతారు. మతం మీద గాంధీ అభిప్రాయాలు, సత్యాన్వేషణ దిశగా సాగించిన ప్రయాణం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే.
మతం మనసుకు సంబంధించినది. మానవత్వాన్ని పెంచేది. అలవాట్లనే పరిమితులకు అతీతమైంది. అందుకే ‘హిందూమతం ఆహారానికి సంబంధించిందే కాదు. దానికంటే ఎన్నో రెట్లు ముఖ్యమైన ఆచరణ విధానం. సత్యం, అహింసను నిత్యజీవితంలో అమలుపరచడం’ అంటారు.
‘నా జీవిత విధానమే హిందూ మతానికి నేను చేయగలిగిన వ్యాఖ్య. మరో విధంగా ఈ పని చేయగలనని నేననుకోలేను.’
అమెరికా నుంచి వచ్చిన ఒక ప్రొఫెసర్ గాంధీని హిందూమత సారాంశాన్ని చెప్పమని అడిగారు. దానికి ‘మనుషులు మాత్రమే కాకుండా, జీవరాశులన్నీ కూడా ఒకే అంశ నుంచి జన్మించాయి అని నమ్మడం హిందూమతపు ప్రధాన విలువ. ఈ సమస్త జీవులన్నీ కూడా మోక్షానికి అర్హులే అని ఒప్పుకోవడం దాని ప్రత్యేకత’ అని బదులిచ్చారు.
‘హిందూమతం తమ నమ్మకాన్ని అనుసరించి భగవంతుడిని ఉపాసించమని చెబుతుంది. అందుకనే ఇతర మతాలతో దానికి ద్వేషం లేదు. హిందూధర్మం యుగయుగాల పరిణతికి ప్రతిఫలం. హిందువుల నాగరికత చాలా ప్రాచీనమైంది. అందులో అహింస అంతర్గతం. హిందూమతం సజీవమైన మతం. ఆ నిత్య ప్రవాహంలో జడత్వానికి చోటు లేదు.’
రీతులు వేరుగా ఉండవచ్చు. కానీ ఏ మతంలో అయినా భగవంతుడిని ఆరాధించేందుకు ప్రార్థన ఓ కీలక సాధనం. గాంధీకి ప్రార్థన అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఒకసారి డాక్టర్ ఫాబ్రి అనే వ్యక్తితో ‘ప్రార్థనతో విధిని మార్చేయలేకపోవచ్చు. కానీ మనలో ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పవచ్చు. ఉన్నత లక్ష్యం కోసం పోరాడుతున్నప్పుడు, అందుకు తగిన శక్తి మనకు ప్రార్థనలో లభిస్తుంది. మన అహంకారాన్ని వీడి, ఆ పరమాత్మను వినయంతో వేడుకున్నప్పుడు.. ప్రార్థనలో సరైన మార్గం కనిపిస్తుంది’ అంటారు.
‘రఘుపతి రాఘవ రాజారామ్’ను ఉప్పు సత్యాగ్రహంలో విస్తృతంగా ఆలపించారు.సర్వమత సహనం కోసం గాంధీ స్వయంగా ‘ఈశ్వర్ అల్లా తేరే నామ్’ అనే పదాలు కలిపారనిచెబుతారు. ‘వైష్ణవ జన తో’ అనే కీర్తన అయితే సాబర్మతీ ఆశ్రమంలో నిత్యం వినిపిస్తూనే ఉండేది.
భగవంతుడిని చేరుకునేందుకు భాగవతంలో నవవిధ భక్తి ప్రస్తావన వస్తుంది. వీటిలోని శ్రవణం, కీర్తనం, స్మరణం అనే తొలి మూడు మార్గాలనూ గాంధీజీ జీవితాంతం అవలంబిస్తూనే వచ్చారు. గాంధీజీకి భజనలు అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. వాటిని మానసిక ప్రశాంతత కోసం మాత్రమే ఆయన వినియోగించ లేదు. మనసులను కలిపే, మనుషులను ముందుకు నడిపే థెరపీలా వాడారు. తులసీదాసు రచనగా పేర్కొనే ‘రఘుపతి రాఘవ రాజారామ్’ను ఉప్పు సత్యాగ్రహంలో విస్తృతంగా ఆలపించారు. సర్వమత సహనం కోసం ఈ కీర్తనలో గాంధీ స్వయంగా ‘ఈశ్వర్ అల్లా తేరే నామ్’ అనే పదాలు కలిపారని చెబుతారు. గుజరాతీ కవి నర్సింహ మెహతా రాసిన ‘వైష్ణవ జన తో’ అనే కీర్తన అయితే సాబర్మతీ ఆశ్రమంలో నిత్యం వినిపిస్తూనే ఉండేది. గాంధీకి ఇష్టమైన మరో భజన ‘హరి తుమ హరో’. ఎమ్మెస్ సుబ్బులక్ష్మిని ప్రాధేయపడి మరీ దానిని పాడించుకున్నారు. ‘ఓ హరీ! ద్రౌపది, ప్రహ్లాదుడు, గజేంద్రులను వారి కష్టాల నుంచి రక్షించినట్టే మా దుఃఖాన్ని కూడా హరించమని’ వేడుకుంటుందీ మీరాబాయి భజన.
వర్ణాశ్రమ ధర్మం గురించి గాంధీకి స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. అస్పృశ్యత ఇంకా సజీవంగా ఉన్న సమయంలోనే ఆయన… దాన్ని తీవ్రంగా నిరసించారు. మలాన్ని ఎత్తడం సహా.. ఏ పనీ ఎవరిదీ కాదని తన ఆశ్రమ విధానాలతో నిరూపించారు. ‘ఆధునిక జీవన విధానంలో కులాన్ని నేను నమ్మను. అది మన అభివృద్ధిని కుంటుపరుస్తుంది. ఓ మనిషి తాను ఇతరుల కంటే గొప్పవాడినని భావించడం అంటే అటు దేవుడికీ, ఇటు మనిషికీ వ్యతిరేకంగా పాపం చేయడమే. కాబట్టి కులం ఆధారంగా స్థాయిని నిర్ణయించడం దుర్మార్గమే!’ అంటారు.
‘నేను ఎరవాడ జైల్లో మొదటిసారి ఈ మంత్రాన్ని చదివినప్పుడు, అంతగొప్పగా అనిపించలేదు. కానీ అందులోని భావం స్ఫురించాక అర్థమయ్యింది ఏమిటంటే, ఒకవేళ మన ఉపనిషత్తులతో సహా పవిత్ర గ్రంథాలన్నీ ఒక్కసారిగా మాయమైపోయినా.. ఈ ఒక్క మంత్రంతో హిందూమతం నిలబడగలదు. అదే ఈశావాస్య ఉపనిషత్తులోని మొదటి మంత్రమైన ‘ఈశావాస్యమిదం సర్వం’. దీన్ని నేను మూడు భాగాలుగా చూస్తాను.. ఈ జగత్తు అంతా దైవానిదే; అందులో నువ్వు దక్కించుకునేది ఆయన అనుగ్రహంగా భావించి అనుభవించు; ఇతరుల సంపద కోసం ఆశించకు! ఇందులో భగవంతుని సర్వవ్యాపకత్వం ఉంది, కష్టపడాలనే సూచన ఉంది, ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహంగా భావించే వినయం ఉంది, అన్నిటికీ మించి పరుల సొమ్ముకు ఆశపడకూడదనే హెచ్చరికా ఉంది. ఆర్థికవేత్తలు, తత్వవేత్తలు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు… అందరికీ ఆమోదయోగ్యంగా కనిపించే సూత్రం ఇది’ – ఈశావాస్య ఉపనిషత్తులోని మంత్రం గురించి పలుమార్లు గాంధీ చేసిన ప్రసంగాల సారాంశం.
“కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ ముద్రణ ఎప్పుడు మొదలైంది? బోసి నవ్వుల గాంధీ బొమ్మ ఎక్కడిది?”