యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. లోపలికి ప్రవేశించగానే.. తెల్లని రాతిపై ఎర్రటి అక్షరాల ‘లోగో’ స్వాగతం పలుకుతుంది. మరో రెండు అడుగులు వేయగానే.. పుస్తకం చదువుతూ కనిపించే యువతి శిల్పం.. లక్ష్యాన్ని, ప్రశాంతతను గుర్తుచేస్తుంది. క్యాంపస్నే క్యాన్వాస్గా మార్చుకుని తీర్చిదిద్దిన కళాఖండాలు.. విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి ధీరజ్ కుమార్ ప్రతిభను చాటుతున్నాయి.
కళాకారుల ఆలోచనలకు రెక్కలొస్తే.. అద్భుతాలు ఆవిష్కారం అవుతాయన్న మాటకు గచ్చిబౌలిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కొలువైన శిల్పాలే నిదర్శనం. స్టెయిన్లెస్ స్టీల్, రాయి ముడిసరుకుగా రూపొందించిన ఆ ప్రతిమలు యూనివర్సిటీకే కొత్త అందాన్ని తెస్తున్నాయి. మదిలో మెదిలిన ఆలోచనలకు రూపం పోస్తూ ఈ అపూరూప కళాఖండాలను తీర్చిదిద్దాడు ధీరజ్ కుమార్. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్కు చెందిన 27 ఏండ్ల ధీరజ్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ చేశాడు. తర్వాత, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాడు. శిల్పకళే జీవితంగా సాధనచేస్తూ వర్సిటీ ఆవరణలో అద్భుతమైన ప్రతిమలను రూపొందిస్తున్నాడు. కొత్త విద్యార్థులలో స్ఫూర్తినీ నింపుతున్నాడు.
40 అడుగుల ఎత్తులో
విశ్వవిద్యాలయ ఆవరణలో.. 40 అడుగుల ఎత్తు కొండపై ఏర్పాటు చేసిన ‘ఫ్రీ మ్యాన్’ శిల్పం.. యూనివర్సిటీకే ప్రత్యేక ఆకర్షణ. క్యాంపస్లోని విద్యార్థుల సృజనాత్మక స్వేచ్ఛకు ఈ స్టెయిన్లెస్ స్టీల్ శిల్పం అద్దం పడుతున్నది. ఆ రెక్కలు.. స్వేచ్ఛకు ప్రతీకలు. విద్యార్థులు తమ స్వేచ్ఛను లక్ష్యాల సాధన దిశగా వినియోగించుకొని, తమకంటూ ఓ ప్రత్యేకతను చాటాలన్నదే శిల్ప సందేశమని ధీరజ్ చెబుతున్నాడు.
కళకే అంకితం
చాలామంది ‘పార్ట్టైమ్’ కళాకారులుగా కొనసాగుతుండటాన్ని ధీరజ్ గమనించాడు. కానీ, తాను మాత్రం జీవితాన్ని కళకే అంకితం చేస్తున్నట్టు ప్రకటించాడు. తన మదిలో మెదలిన రూపాలకు జీవం పోస్తూ ముందుకు సాగుతున్నాడు. పోలీస్ అకాడమీలోనూ ఓ రాతి శిల్పానికి ప్రాణం పోశాడు. ఇనుము, ఉక్కు, కలపతో అద్భుతమైన శిల్పాలు రూపొందించగలడు ధీరజ్. ‘రాతి శిల్పాలైతే ఎప్పటికీ నిలిచిపోతాయి’ అంటున్నాడు ఈ యువ శిల్పి.
ఒక్కో శిల్పం.. ఒక్కో అర్థం
ధీరజ్కు శిలలూ శిల్పాలంటే ఇష్టం. అందుకే, చిత్రకళలో పీహెచ్డీ చేశాడు. ఎక్కడ శిలలు కనిపించినా వాలిపోతాడు. వాటికి ఆకృతినిస్తాడు. కాబట్టే, క్యాంపస్లోని శిలలను కూడా అద్భుతమైన కళాఖండాలుగా తీర్చిదిద్ది, ఆ ప్రాంతాన్నంతా కళాత్మకంగా మార్చేశాడు. తొలి ప్రయత్నంగా 15 అడుగుల పీఎస్ఎల్వీ రాకెట్ నమూనాను తీర్చిదిద్దాడు. ఆ తర్వాత, యూనివర్సిటీ లోగోతో రాతి కళాఖండాన్ని ఏర్పాటుచేసి ప్రధాన ద్వారం, సౌత్ క్యాంపస్ వద్ద ప్రదర్శనకు పెట్టారు. స్టెయిన్లెస్ స్టీల్తో మూడు శిల్పాలను రూపొందించాడు. ప్రధాన ద్వారం వద్ద ఉన్న యువతి శిల్పాన్ని స్వేచ్ఛకు ప్రతీకగా మలిచాడు. క్యాంపస్ రోడ్డు పక్కన పుస్తకం చదువుతున్న యువతి శిల్పం ఏకాగ్రతకు చిహ్నంగా నిలుస్తున్నది.
-కమ్మెట మహేష్ గౌడ్