ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీ జిల్లాలోని లకారా గ్రామం. ఆ ఊరి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అమిత్ వర్మ బోధనలో కొత్త కోణం చూపించాడు. అతను ఓ ఇంటి ముందు పిల్లలకు పాఠాలు చెబుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనికి ఓ నేపథ్యం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను పేరుకే బడిలో వేస్తారు. వాళ్లను ఇంటి పనికో, పొలం పనులకో, ఇతర అవసరాలకో పరిమితం చేస్తారు. అమిత్ వర్మ క్లాసులోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు రోజుల తరబడి బడికి రాకపోవడాన్ని అమిత్ గమనించాడు. మొదట్లో విద్యార్థులను పంపి బడికి తీసుకురమ్మని చెప్పాడు. కానీ, పిల్లల తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. వాళ్లు వేరే ఊళ్లో పని చేస్తున్నారని చెప్పారు.
అమిత్ స్వయంగా వెళ్లినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆయనకు చాలా బాధగా అనిపించింది. గాంధేయ మార్గంలో పరిష్కారం ఆలోచించాడు. ఏకంగా 33 మంది పిల్లలతో నాలుగో తరగతి మొత్తాన్నీ ఆ ఇద్దరు పిల్లల ఇండ్ల ముందుకు తరలించాడు. అక్కడే పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఇది పరిసర ప్రజలను ఆకర్షించింది. ఒకరు… ఇద్దరు… ముగ్గురు… ఇలా పెద్దగుంపు పోగైంది. పిల్లలు ఇంటికి ఆర్థికంగా అండగా ఉండాలి కాబట్టి, తల్లిదండ్రులు బడికి పంపించడం లేదు. ఇలా బడిని ఏకంగా ఇంటిముందుకే తీసుకురావడం బాగాలేదని ఆ గుంపులో కొంతమంది అభిప్రాయపడ్డారు.
ఇంకొంతమంది అమిత్ను చూసి నవ్వుకున్నారు. అయినా అతను పాఠాలు చెప్పడం ఆపలేదు. కొంతకాలానికి ఆ పిల్లల తల్లిదండ్రులలో మార్పు వచ్చింది. అమిత్ను కలిశారు. క్షమాపణలు చెప్పారు. తమ పిల్లలను బడికి పంపిస్తామని మాటిచ్చారు. ‘మెరుగైన సమాజం ఏర్పడాలంటే ఒకటే మార్గం. పిల్లలు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవ్వాలి’ అనేది అమిత్ విశ్వాసం. అంతేకాదు, జీవితాలను మార్చగల శక్తి ఒక్క విద్యకే ఉంది.