ఏ పనైనా ఆచితూచి.. ఎంత చెయ్యాలో అంతే చెయ్యాలి. తొందరపడి దర్పాన్ని ప్రదర్శిస్తే.. ఎలాంటి ఉపయోగమూ ఉండదని సున్నితంగా హెచ్చరిస్తారు జానపదులు. ఇలాంటి అర్థాన్ని ఇచ్చే సామెత ‘ఊరికి చేసిన ఉపకారం.. శవానికి చేసిన సింగారం ఒక్కటే’. ఊరికోసం ఎంత మేలు చేసినా అది లెక్కలోకి రాదు. శవాన్ని ఎంత అందంగా అలంకరించినా ఉపయోగం ఉండదు. ఎలాంటి హోదా, అధికారం లేకపోయినా కొందరు ఊరికి చాలా ఉపకారం చేస్తుంటారు. అయినా వారి కష్టానికి ఎలాంటి గుర్తింపూ ఉండదు. ఇక మనిషి బతికున్నప్పుడు సరిగ్గా చూసుకోని బిడ్డలు.. చనిపోయాక మాత్రం అయినవారి శవాలను నలుగురి మెప్పుకోసం అందంగా అలంకరిస్తుంటారు. మనిషి బతికి నప్పుడు లేని అలంకరణ చనిపోయాక మాత్రం ఎందుకు? ఎవరికి ఉపయోగం? అందుకే తల్లి దండ్రులు కళ్లముందు ఉన్నప్పుడే కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
ఏ పనైనా చెయ్యాలని అనుకున్నప్పుడు.. తగిన సంసిద్ధత ఉండాల్సిందే. కాబట్టే, ‘కడిగిన మొకం తయారుగుంటే.. కనవడ్డదల్లా నోట్లె ఎయ్యొచ్చు’ అంటారు పెద్దలు. మనం సిద్ధంగా లేకపోతే.. ఆ అవకాశం మరొకర్ని వరిస్తుంది. ఆ ప్రయత్నంలో క్రమశిక్షణ కూడా అవసరం. ఇక ఉదయాన్నే లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, ముఖం కడుక్కొని తయారుగా ఉంటే.. అవకాశం రాగానే ఆకలి తీర్చుకోవచ్చు. ఎవ్వరూ పాచినోటితో తినరు. ఒకవేళ తిన్నా.. ఒంటబట్టదు. అనారోగ్యకరం కూడా! ముఖం కడుక్కొని ఉంటే మాత్రం.. ఒకచోట కాకపోతే మరోచోట తినొచ్చు. సంసిద్ధంగా ఉంటేనే ఏ పనైనా చేయగలం. కొన్ని ప్రాంతాల్లో ‘కడిగిన మొకం తయారుగుంటే.. కలిగి ఉందల్లా నోట్లె ఎయ్యొచ్చు’ అనీ, మరికొన్ని చోట్ల ‘కడిగిన మొకం తయారుగుంటే.. కాలికి తగిలిందల్లా నోట్లె ఎయ్యొచ్చు’ అనీ అంటారు.
ఎంతటి కష్టాన్ని అయినా ఒక్కమాటలో వర్ణించడం జానపదులకే చెల్లింది. అలాంటివాటిలో.. నేటికీ గ్రామీణుల నోళ్లలో నానే పదబంధం.. ‘ముండ్ల మీదున్నట్లుంది!’. అయిష్టమైన పనిని బలవంతంగా భుజాన వేసుకొని పూర్తి చెయ్యాల్సి వచ్చినప్పుడు, నచ్చని పనిని ఎలా ముగించాలో తెలియని సందర్భంలో ‘ముండ్ల మీదున్నట్లుంది’ అనే పదబంధాన్ని ఉపయోగిస్తుంటారు. అంటే అంపశయ్యపై ఉండటం. చెప్పులు లేకుండా ముండ్లపై నడవడం ఎంత కష్టమో, అనుభవించిన వారికే తెలుస్తుంది. ఒక్క ముల్లు గుచ్చుకుంటేనే విలవిల్లాడిపోతుంటారు. అలాంటిది ముండ్లమీద ప్రయాణమంటే.. ఎంతో ఓపిక ఉండాలి. పైగా తుదివరకూ కొనసాగించాలంటే మాటలు కాదు. అలాంటి అయిష్టమైన, కష్టంగా ఉన్న పనిని చేస్తున్నప్పుడు ‘ఎట్లుంది నీ యవ్వారం’ అంటే.. ‘ముండ్ల మీదున్నట్లు ఉంది. ఏమి చెప్పమంటవ్?’ అని మనసులో బాధను వెళ్లగక్కుతుంటారు. మనసుకు బాధ కలిగించే పనులు చెయ్యాల్సి వచ్చినప్పుడు కూడా ఇదే పదబంధాన్ని ప్రయోగిస్తారు.
బీరిపోవుడు = ఆశ్చర్యపోవడం (ఏంద్రా! అట్లా బీరిపోయి చూస్తున్నవ్.. మన మల్లిగాడే పట్నంలో బాగా సంపాయించి, ఇట్ల సూటుబూటు ఏసుకొని అచ్చిండు)
మస్కెపేగు = మసిగుడ్డ (మస్కెపేగు మాసికపేగు అందుకో.. నీళ్ల సర్వ దించి, నాయినకు నీళ్లు తోడి రావాలె. ఇప్పటికే శాన ఆలస్యమైంది)
దొంగవాన = రాత్రంతా బాగా కురిసి, తెల్లారి కనిపించని వాన. (రాత్రంతా దంచికొట్టింది.. తెల్లారంగనే మాయమైందేందీ దొంగవాన)
గగ్గోడు = గజ్జల్లో వాపు (మొన్న తగిలిన దెబ్బలకు గగ్గోడు అయింది. నొప్పికి తట్టుకోలేకపోతాండు)
శిమాంట = శుభము అని/ శుభదినమని/ మంచిరోజని (శిమాంట శుభమా అంట, లగ్గానికి పోతుంటే.. ఈ తుమ్ములేందిరా అయ్యా.. ఇది కుదిరే లగ్గమేనా?)