“మన సీతంబాయి పొలం అమ్మేద్దాం బాపూ!”.. పెద్దకొడుకు బయటినుంచి వస్తూనే అన్నాడు.. అందరికీ వినిపించేటట్టు! హైదరాబాద్లో ఉంటాడు.
హైటెక్సిటీలో ఉద్యోగం. ఆరోజే ఊర్లో దిగాడు. పొద్దుననగా బయటికి పోయి, చీకటిపడిన తర్వాత తిరిగొచ్చాడు. ఇంట్లో అడుగు పెడుతూనే ఇంతపెద్ద నిర్ణయం ప్రకటించాడు.
అరవై ఐదేళ్ల వయసు, మూడెకరాల పొలమూ ఉన్న సన్నకారు రైతు నారాయణ. భూమిని నమ్ముకున్న కష్టజీవి. ఊర్లో పెద్దమనిషి, మర్యాదస్తుడన్న పేరుంది. పొలం అమ్ముదామని పెద్ద
కొడుకు యాదగిరి అన్నప్పుడు.. ఇంట్లోవాళ్లంతా అక్కడే ఉన్నారు. నారాయణ భార్య శ్యామలమ్మ అప్పుడే వంట ముగించి, మల్లెసాలలో మొగు
రానికి ఆనుకొని కూర్చున్నది. ఊర్లో దోస్తులతో తిరుగుళ్లు ముగించి, అంతక్రితమే ఇల్లుచేరిన చిన్నకొడుకు తీరుబడిగా టీవీ చూస్తున్నాడు.
పాలు పిండేందుకు సర్వ పట్టుకొని వాకిట్లో కొచ్చిన నారాయణ.. బర్రె పొదుగులో చేయిపెట్టి చూసి, పాలు పిండటం మొదలుపెట్టాడు.
“బాపూ! నామాట ఇనవడ్డదానే? మన బాయిపొలం అమ్ముదామంటున్న”.. యాదగిరి ఈసారి ఇంకొంచెం గట్టిగా అన్నాడు.
నారాయణ విన్నాడు. కానీ, మాట్లాడలేదు. పాలు పిండుకొచ్చి భార్య చేతికిచ్చాడు. వెళ్లి పెద్ద దర్వాజ పక్కనున్న చెక్క కుర్చీలో కూర్చున్నాడు. నిజానికి కొడుకు మాట అతనికి మొదటిసారే వినిపించింది. కానీ, బదులు చెప్పలేదు.
“నువ్వింక వ్యవసాయం చెయ్యలేవు బాపూ! అందుకే బాయిపొలం అమ్మితే మంచిది” మళ్లీ చెప్పాడు కొడుకు.
“అదేందీ.. ఎవుసం జెయ్యలేనా? చేస్తనే ఉన్నగద. ఎందుకొచ్చిందా అనుమానం?” కొడుకు దిక్కు చూడకుండానే అన్నాడు. అతనికి లోపల కొంత కంగారుగానే ఉన్నది. బాయిపొలం అమ్ముకుంటే ఇంకేమన్న ఉన్నదా? తర్వాత ఏం తింటం? ఎట్ల బతుకుతం?
“చేస్తున్నవు నిజమే బాపూ! కానీ, ఏమన్న ఫలితం ఉంటున్నదా? పతేడూ నష్టపోవుడు. అప్పులు చేసుడు తప్ప!”.
నారాయణ మాట్లాడలేదు. బీడి పారేస్తూ లేచివెళ్లి తినడానికి కూర్చున్నాడు. శ్యామలమ్మ వడ్డిస్తున్నది. తింటూనే నెమ్మదిగా అన్నాడు..
“అట్లనుకుంటే ఎట్లరా పెద్దోడా! రైతు అనేటోడు ఎవుసం జెయ్యక ఇంకేం జేస్తడు? పెట్టు
బడుల కోసం, చేతి ఖర్సుల కోసం అప్పులు దునియ మీద ఎవ్వలు చేస్తలేరా? పంటలు పండినంక గింజలమ్మి మళ్లా తీరుస్తలేరా?”.
తండ్రి తను చెప్పేది సీరియస్గా తీసుకోవడం లేదని.. యాదగిరి స్వరంలో తీవ్రత పెంచాడు.
“మనూరు ఇప్పుడు మునుపటి పల్లె కాదు. రేపోమాపో కార్పొరేషన్ల చేరిపోతది. ఎక్కడెక్కడోళ్లో మానూరు సుట్టు జాగలు కొనుక్కొని ఇండ్లు కట్టుకుంటున్నరు. ఎన్నో వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ అంతా ఈ సుట్టుపక్కలనే జరుగుతది. పైగా మన పొలం హైవేకు దగ్గరున్నది. మంచి డిమాండ్ వస్తది. అమ్మితే మస్తు ధర పలుకుతది”.
నారాయణ వృద్ధదేహం చెక్కకుర్చీలో ఇబ్బందిగా కదిలింది. కొడుకు వైపు దిగులుగానూ, తనకు ఇష్టం లేనట్టుగానూ చూశాడు.
“ఇంత జల్దిన అంత అవసరం ఏమొచ్చింది? ఎక్కువ ధరొస్తే మాత్రం పొలం అమ్ముకుంటమా?” అన్నాడు.
“ఇప్పుడు పరిస్థితులు అట్లున్నయి గనుకే.. అమ్ముదామంటున్న. ఊర్ల చాలామంది ఇప్పటికే భూములు అమ్మి పట్నం పోయిండ్రు. నువ్వేమో ఇంకా ఆ జాగను పట్టుకొని వేలాడుతున్నవు”.
“నీకెందుకురా బాధ? కష్టం జేసేది నేనుగద!” తండ్రికి కోపమొచ్చింది.
“అవును.. నువ్వే! కానీ, ఎంత కష్టం చేసినా దండుగే అంటున్న. నీ బతుకు మొత్తం మట్టిలోనే గడిపినవు. చెమటలు ధారపోసినవు. కానీ, ఏం సాధించినవు? చేసిచేసి నీ రెక్కలు పోయినయి. పెయ్యి అలిసిపోయింది. నీకిప్పుడు విశ్రాంతి అవసరం! సీతంబాయి పొలం అమ్మితేనే మన కష్టాలు తీరుతయి”.
“ఎవుసం జేసే రైతు అలిసిపోవుడు ఏందిరా? చిత్రంగ మాట్లాడుతవు. నాకెందుకు విశ్రాంతి? మట్టిల పుట్టి మట్టిల పెరిగినోణ్ని. మట్టిల కలిసిపోయెదాక.. ఈ మట్టినే నమ్ముకొని బతుకుత! తాతల నుంచి వచ్చిన భూమి. మన బతుకులన్నీ దానితోనే ముడివడి ఉండె. అయినా నీకిప్పుడు పైసల అవసరం ఏమొచ్చింది? నౌకరి జేస్తున్నవు గద. పొలం అమ్ముతనంట వెందుకు?”.
“నాకు పైసల అవసరమొచ్చి కాదు బాపూ! ఈ అప్పుల ఊబి నుంచి నువ్వు ఎట్ల బయటపడుతవని? సేద్యం కోసం నువ్వు చేసిన బాకీలు, పొలం మీద తెచ్చిన అప్పులు, వాటికి వడ్డీలు కలుపుకొని కొండల్లెక్క పెరిగినయి. అవన్నీ ఎట్ల తీరుస్తవు?”.
“అందుకని భూమాతను అమ్ముకుంటార్ర?” నారాయణలో కోపమూ, దానివెంబడే నిస్సహాయతా పోటీ పడినయి.
“కాపుదనం చేసే రైతుకు మట్టితో ఉన్న బంధం ఏంటిదో నీకు తెలుసార..? పొలం అమ్ముకోవడం అంటే పెయ్యిల మాంసం ముక్క కోసిపారేసుకున్నట్టు..” చెపుతుంటే నారాయణ గొంతు జీరబోయింది. ముఖంలో బాధ కమ్ముకున్నది.
“భూమి తల్లి, మట్టి బంధం.. కథలు చెప్పకు బాపూ!” యాదగిరి విసుక్కున్నాడు.
“భూమి గురించి నీకేం తెలుసురా? భూమి అంటే ఒక్క జాగ మాత్రమేనా? దాంతో ఇంకెన్ని ముడివడి ఉంటయి? నీకు కొత్తగ ప్రయివేట్ కొలువచ్చింది. ఎంతకాలం ఉంటదో, ఎప్పుడు ఏమైతదో తెల్వది. కానీ, నా ఉద్యోగం అట్ల కాదు. తాతల నుంచి నమ్ముకున్నది. మన ఇల్లును నడుపుకొచ్చింది.. మన బతుకులు బాగుజేసింది ఇదే! ఇప్పుడీ పొలం అమ్ముకుంటే రేపేదన్న అయితే రోడ్ల మీద బిచ్చమెత్తుకోవాలె”.
“అంతకన్న గొప్పగున్నదా మన బతుకు? భూమి ఉండి ఏం జేస్తున్నది? నువ్వు చెప్పే బిచ్చగాళ్లకు ఏ రంధీ లేదు. ఉన్నకాడికి తింటరు, కంటినిండా నిద్రపోతరు. నీకు ఒక్క దినమన్నా ప్రశాంతమున్నదా?” విసురుగా అన్నాడు కొడుకు. ఇంత జరుగుతుంటే నారాయణ భార్య, చిన్నకొడుకు వింటూ కూర్చున్నరు. చిన్నోడికి అన్నయ్య ఆలోచన బాగా నచ్చింది.
‘నిజంగనే పొలం అమ్మితే బాగుంటది. అప్పుడు అందరి చేతుల్ల డబ్బులుంటయి’ అతని పరిధిలో అంతవరకే ఆలోచించి సంతోషించాడు. ‘పల్లెటూరొదిలి ఎప్పుడు సిటీలో వాలిపోదామా!’ అనే ఉబలాటం పెరిగిపోయింది.
“బాపూ! అన్నయ్య చెపుతున్నది నిజమే! నువ్వు మునుపటి లెక్క నాగలి దున్నలేవు. కాయకష్టం చెయ్యలేవు. బరువు పనులు ఇంక నీతోని కావు. అందుకని పొలం అమ్ముడే మంచిది” అన్నాడు.
చిన్నకొడుకు మాటతో నారాయణకు చిర్రెత్తుకొచ్చింది. ఎన్నడూ బాయి ముఖం సూడనోడు, కాలికి బురద అంటించుకోనోడు, ఎవుసం గురించి తోకా తొండెం తెలువని పోరడు సుత తనకు సుద్దులు చెపుతుండు.. ముప్పిరిగొన్న ఆవేశంతో కొద్దిసేపు మాట్లాడలేకపోయాడు. నిస్సహాయతతో గుండె మండుతున్నది. ఇంట్లో అందరూ ఒక్కటై ఏవో కారణాలు చెపుతుంటే తనేం జెయ్యగలడు? వీళ్లకు ఉన్నట్టుండి తను చేతకానోని తీరుగ కనిపిస్తున్నడు.
పొలం అమ్ముదామని ఎంత చెప్పినా ఒప్పుకోని తండ్రి ధోరణి.. యాదగిరికి విసుగు తెప్పించింది. ఎంతసేపూ అదే పాతకాలం
ఆలోచన. వ్యవసాయం మీద మక్కువతో వాస్తవం ఆలోచించడం లేదు. రైతుకు భూమే సర్వస్వం కావొచ్చు. కానీ, అది పాతమాట. సంవత్సరాల చరిత్ర ఉన్న తమ సీతంబాయి పొలం ఇప్పుడు సేద్యానికి అనుకూలం కాదు. ఉన్న మూడెకరాలకే సరైన దిక్కులేదు. అది చాలదన్నట్టు ఆశకు పోయి మరింత పొలం కౌలుకు తీసుకోవడం. అందుకోసం మరిన్ని పెట్టుబడులు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు.. తలకుమించిన అప్పులు. చివరికి చేతులు కాల్చుకోవడం.
“మన బాయిల నీళ్లు లేకపోయినా భూమి హైవేకు దగ్గర్లో ఉన్నది గనుక మంచి డిమాండ్
వస్తది. ఎక్కువ ధర పలుకుతది. నామాట విను బాపూ! వ్యవసాయం జేసి ఏం సాధించినవు చెప్పు? అదే పాడుబడ్డ పాతబాయి. లక్షలు పోసి తవ్వించినా నీళ్లురాని బోరుబావులు. నిండా అప్పులు. కట్టకుంటే ఇచ్చినోళ్లు ఇజ్జత్ దీస్తరు. దానికంటే మనమే పొలం అమ్మేసి ఎవన్ది వానికి పారేస్తే పాయే!” తండ్రి మెదడును ఆసాంతం కడిగేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు యాదగిరి.
“పెద్దోని మాట నాకు బాగనే అనిపిస్తంది. నువ్వు కూడ కొద్దిగ ఆలోచన జెయ్యి. నీకిప్పుడు మునుపటిలెక్క చాతనైత లేదు. పాణం బాగుంటలేదు. ఇంక నువ్వు ఎవుసం జెయ్యలేవు. పనిలో నీకు తోడుండేటోళ్లు కూడ ఎవ్వరు లేరు. నీకేదన్న అయితే ఎట్ల? ఇప్పటికే పొలం గెట్టు మీంచి పడి నడుం ఇరగ్గొట్టుకుంటివి. మీదినుంచి మోకాళ్ల నొప్పులు. పెద్దోడు జెప్పినట్టు సీతంబాయి పొలం అమ్మితే మన బాధలన్నీ పోతయి” శ్యామలమ్మ భర్తకు సర్దిచెప్పింది.
“ఇంతమందిమి చెపుతుంటే ఇనవేంది బాపూ! బతుకంత పనిచేసి చేసి దీర్ఘరోగి లెక్క అయినవు. నువ్వెంత కష్టపడ్డా పొలంపైన ఎంత మమకారం ఉన్నా దండుగ. ఇప్పుడున్న బాకీలు వ్యవసాయం మీద ఎన్నటికీ తీర్చలేవు. నువ్వు చూస్తుండు.. మన భూమి కొనేటందుకు పెద్ద
పెద్దోళ్లు ఎగబడుతరు. అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ నేను చేస్తా. నువు నిమ్మలంగా ఉండు”.. ఇదే చివరి నిర్ణయం అన్నట్టు పెద్దకొడుకు స్పష్టం చేశాడు.
నారాయణ ఉరిశిక్ష పడ్డ ముద్దాయిలా నిర్వేదంగా కొడుకు దిక్కు చూశాడు. కూర్చున్న కుర్చీలో కుంచించుకుపోయి అసహనంగా కదిలాడు. ఇంట్లో అంతా ఒక్కటై ఎదురుతిరిగిన తర్వాత తను ఒక్కడు ఏం చెయ్యగలడు?
“మీ అందరు చెప్పినయి బాగనే విన్న. మొత్తానికి అందరూ కల్సి నన్ను చేతకానోని కింద జమ కట్టిన్రు. ‘ఎవుసం బేకార్’ అని చెపుతున్నరు. మీ ఆలోచన అదే అయితే అట్లనే కానియ్యిండి. మీ ఇష్టమున్నట్టు చేసుకోండి” అని కుర్చీలోంచి నీరసంగా లేచాడు. బరువెక్కిన మనసుతో వాకిట్లోకి వెళ్లిపోయాడు.
v v v
నారాయణ రాత్రంతా కలత నిద్రపోయాడు. కళ్లు మూస్తేచాలు సీతంబాయి పొలం కదలాడింది. ఆ రోజు పొద్దున లేవగానే చాయ కూడా తాగకుండా బాయికాడికి బయలుదేరాడు. సీతంబాయి అంటే ఆ ఊర్లోనే నెంబర్వన్ బాయి. నారాయణ చిన్నతనంలో చూశాడు. దానికింద ఇరవై ఎకరాల పొలం ఉండేది. అతని తాత ఎంతోకాలం శ్రమించి మెట్టభూమిని అచ్చుకట్టి పంటపొలం కింద మార్చాడు. అప్పుడు బాయిలో పుష్కలంగా నీళ్లు. పైన చెరువులు నిండి అలుగులు పారి వాగు జీవనదిలా ప్రవహించేది. సీతంబాయికి ఏనాడూ నీళ్ల కరువుండేది కాదు. తాత పోయాక తండ్రి నిర్లక్ష్యం, కష్టపడి పనిచేసే తత్వం లేకపోవడం వల్ల ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం.. తాగుడు కోసం పొలం కొంత కొంత అమ్ముతూ వచ్చాడు. బడికెళ్లడం మానుకొని చిన్ననాడే సేద్యానికి మళ్లిన నారాయణ, తన కళ్లముందే భూమి కరిగిపోవడం చూశాడు. చివరికి మూడు ఎకరాలు మిగిలింది. అదైనా గుండెజబ్బుతో తండ్రి హఠాత్తుగా పోయాడు గనుక మిగిలింది.
మూడెకరాల పొలంతో, మూడుముళ్లు వేసిన శ్యామలమ్మతో బతుకు బండిని లాక్కొచ్చాడు నారాయణ. చిన్నతనంలో తాతగారి వెంబడే తిరుగుతూ వ్యవసాయ పనులు నేర్చుకోవడం, తండ్రి నిర్లక్ష్యంతో కుంటుపడిన సేద్యాన్ని భుజాలపైన వేసుకోవడం.. అట్లా సీతంబాయి అతనిలో ఒక భాగమైంది. చివరికి అదే అతని ప్రపంచమైంది. ఏ వినోదాలూ, వెసులుబాట్లూ అతడెరుగడు. భూమితోనే బంధం, అదే ఆనందం. అతని మూడొంతుల జీవన జ్ఞాపకాలు ఆ పొలంతోనే ముడిపడి ఉన్నయి.
అయితే సీతంబాయి ప్రాభవమంతా గతం. ఇప్పుడది చుక్కకూడా లేని బాయి బొంద. వర్షాలు లేక, చెరువులు ఉనికినే కోల్పోయి, వాగులు కనుమరుగైన పరిస్థితుల్లో.. సీతంబాయి ఎండిపోయి చెలిమెలేని గొయ్యిగా మిగిలింది.
నారాయణ బాయిగడ్డ మీద నిలబడి చుట్టూ చూశాడు. ఎంతో ఆరాటంగా పొలమంతా కలియతిరిగాడు. ఎక్కడా పచ్చదనం లేదు. మరోపక్క కొండచిలువ నోరు తెరుచుకొని మింగడాని కొస్తున్నట్టు పట్టణం వైపు నుంచి కబళిస్తున్న పెద్దపెద్ద కట్టడాలు. విత్తనాలు మొలకెత్తే భూమిలోంచి మొలుచుకొస్తున్న వందలాది ఇండ్లు.. భవంతులు. ఎకరాలకొద్దీ భూమి ప్లాట్లు కొట్టి ముమ్మరంగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం. లాభాపేక్షతో భూములు కొన్నవాళ్లు తమ జాగల చుట్టూ దయ్యాల మాదిరి పాతిన సరిహద్దు రాళ్లు.
‘రేపు సీతంబాయిని కొనుక్కునే పెద్దమనిషి ఈ పొలంలో ఎవుసం చేస్తడా? లేక జేసీబీలతో భూమి మొత్తం చదును చేసి ప్లాట్లు గొట్టి అమ్ముకుంటడా?’ కత్తితో తన దేహాన్ని పరపరా కోసి ముక్కల కింద కొట్టినట్టు నారాయణ విలవిల్లాడి పోయాడు. వందల ఏండ్ల అతని కుటుంబ చరిత్రను కడుపులో దాచుకున్న సీతంబాయి ఇకపై కనిపించదు. ఆనవాళ్లు కూడా ఉండవు.
కాంక్రీట్ సాగు జరిగే ఇక్కడి భూమికి నీటిస్పర్శ తెలియదు. చినుకుపడితే ఆస్వాదించే మట్టినేల కనిపించదు. నాగేటి చాళ్లకు బదులు సిమెంటు దారులు, పంట మొక్కలకు బదులు కాంక్రీటు కట్టడాలు లేస్తాయి. చినుకు పడాలి. నాగళ్లు దున్నాలి. విత్తనాలు వెయ్యాలి. మొక్కలు మొలవాలి. పంటలు పండాలి. ఇవేవీ ఉండవు. ఇకముందు ఇక్కడ అడుగడుగునా మనుషులు మొలుచుకొస్తారు. జనారణ్యం విస్తరిస్తుంది.
‘మన కొంపను ఒక్కసారి చూడు బాపూ.. కట్టి వందేళ్లయినా అయ్యుంటది. కనీసం గట్టిగా మరమ్మతు కూడా చేయించలేక పోయినవు. కొత్తగా ఇంకో ఇల్లు ఎన్నటికీ కట్టలేం. ఇదెప్పుడు కూలిపోతుందో తెలియదు. పైగా దీనిమీదా అప్పు తెచ్చినవు’.. వీపుమీద గుద్దినట్టు పెద్దకొడుకు అన్న మాటలు కంపముండ్ల లాగా గుచ్చుతూనే ఉన్న యి. నారాయణ మనసు వికలమైంది. బాయిగడ్డ దిగి ఇంటివైపు నడిచాడు.
‘ఇంక నువ్వు ఎవుసం చెయ్యలేవు. నీకు చేతకాదు. పెద్దోడు చెప్పినట్టు అమ్మేద్దాం’.. గంట కొట్టినట్టు చెప్పింది.
ఎంత చిత్రం..? ఇంతకాలం తర్వాత హఠాత్తుగా తను రైతు కాకుండా పోతున్నాడు. ఇంట్లో అంతా తనను చేతకానివాణ్ని చేయడం నారాయణకు బాధగా ఉన్నది. ఒకసారెప్పుడో ఒడ్డుమీద నుంచి కాలుజారి పడ్డాడు. దానివల్ల ఎప్పుడన్నా వెన్నులో కొంచెం నొప్పి వస్తుంటది. అట్లాగే ఎప్పటినుంచో మోకాలి నొప్పులు. అవేం కొత్తవి కాదు. తన పనులకు ఎన్నడూ అడ్డుకాలేదు.
‘ఇన్నేళ్లు వ్యవసాయం చేసి ఏం సాధించినవు? తొండలు గుడ్లు పెట్టే భూమిలో ఏం పండిస్తవు? కష్టం చెయ్యడం, అప్పులు చెయ్యడం తప్ప ఏం మిగిలింది?’.. కొడుకు మాటలు ఈటెల్లా గుచ్చుతున్నాయి. ఇంట్లో ముగ్గురూ ఒక్కమాట మీదున్నరు. తానొక్కడు ఏం చేయగలడు? తను వద్దన్నా ఆగేటట్టు లేరు.
“ఇన్నేండ్లుగా ఎవుసం మీద కాకుంటే వీళ్లు ఎట్ల బతికిన్రు?”.. నారాయణ పైకే గొణుక్కున్నాడు.
v v v
నాలుగు రోజులుగా తండ్రి ముభావంగా ఉండటం యాదగిరి గమనించాడు. తండ్రిని అనునయించే ప్రయత్నం చేశాడు. “రంధి పడకు బాపూ..! మన పొలానికి మంచి ధరొస్తది. మన కష్టాలన్నీ తీరిపోతయి. నువ్వే ఆలోచన పెట్టుకోక హాయిగా ఉండు”.. భరోసా మాటలు పలికాడు.
నారాయణ సమాధానం ఇవ్వలేదు. జీవంలేని నవ్వు నవ్వి ఊరుకున్నాడు. తండ్రి ఆవేదన యాదగిరికి తెలియంది కాదు. సేద్యాన్ని పూర్తిగా నమ్ముకున్న ఒక రైతు మనోభావాలు తన భూమి చుట్టే అల్లుకొని ఉంటయి. భూమి అంటే రైతుకు వృత్తి. భూమి అంటే రైతుకు ఉనికి. రైతు మట్టిని ఆశ్రయించి బతికే జీవి. మట్టి వదిలి రాడు. అందుకే ఎన్నిసార్లు ఎదురుదెబ్బలు తిన్నా.. రైతు రైతుగానే కొనసాగుతున్నాడు. పెట్టుబడులకు అప్పులమీద అప్పులు చేస్తూ ముందుకు పోతున్నాడు. రుణాలు తన స్థాయి మించిపోతున్నా ఎప్పటికైనా తీరుస్తాననే నమ్మకం తనకంటే భూమ్మీదే ఎక్కువ ఉంచ డం. క్రమంగా ఆస్తులు తరుగుతూ, బతుకులు ప్రశ్నార్థకమవుతున్నా సాగుబాట వీడకపోవడం.
ఇటువంటి పరిస్థితుల్లో పొలం అమ్మాలనే తన నిర్ణయం సరైనదేనని యాదగిరి భావించాడు. పొలం అమ్మడం కేవలం ఒక లావాదేవీ కాదు. వాస్తవానికి అది తండ్రి గుర్తింపును చెరపడమే. ఆయన దశాబ్దాల శ్రమను ఎగతాళి చెయ్యడమే. కానీ తప్పదు. మారిన కాల పరిస్థితులు, వ్యవసాయం చుట్టూ అల్లుకున్న చిక్కుముడులు గత్యంతరం లేకుండా చేస్తున్నయి. అప్పులు తీరిపోతే తండ్రి మళ్లా మామూలు మనిషి అవుతాడని అనుకున్నాడు. పొలం విక్రయంలో యాదగిరి నవీన పద్ధతుల్లో ముందుకెళ్లాడు. ఏదో ఒక ధరకు తెగనమ్మడం కాకుండా.. తన ఆధ్వర్యంలోనే వేలంపాట జరిపి ఎక్కువమందిని ఆకర్షించాలని భావించాడు. డబ్బు ఖర్చయినా వెనుకాడకుండా ఇందుకోసం ముమ్మరంగా ప్రచారం చేశాడు. చుట్టు పక్కల ఊళ్లలోనే కాకుండా ఇతర జిల్లాల్లో రియల్ ఎస్టేట్ సర్కిళ్లలోకి ఈ విషయం తెలిసేలా చేశాడు.
ఎగుమామిడి అయోధ్యారెడ్డిది సిద్దిపేట జిల్లా మిట్టపల్లి. హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. రాజనీతి శాస్త్రంలో ఎం.ఏ చేశారు. 1982లో పాత్రికేయ రంగంలోకి ప్రవేశించారు. కాలేజీ రోజుల్లోనే రచనా రంగంలోకి అడుగుపెట్టారు. తొలికథ ‘మృత్యువులో వ్యత్యాసం’. 1974లో గులాబీ మాస
పత్రికలో ప్రచురితమైంది. ఇప్పటివరకు 70కి పైగా కథలు, రెండు నవలలు రాశారు. 30 విదేశీ కథలు, ఒక విదేశీ నవలను తెలుగులోకి అనువదించారు. ‘సమకాలీన రాజకీయాలు-తెలుగు సాహిత్యం’ సిద్ధాంత వ్యాసగ్రంథం, ‘ఆహార యాత్ర’ (కథా సంపుటి), ప్రసిద్ధ ఆఫ్రికన్ రచయిత గుగి వా థియాంగో రాసిన ‘వీప్ నాట్ ఛైల్డ్’ నవలకు అనువాదం ‘ఏడవకు బిడ్డా’, ‘అక్కన్నపేట రైల్వేస్టేషన్’ (కథా సంపుటి) వెలువరించారు. నాగిరెడ్డి చక్రపాణి, సాహితీ గౌతమి, పాకాల యశోదారెడ్డి, మాడభూషి పురస్కారాలు అందుకున్నారు.
-ఏ.ఎం.అయోధ్యారెడ్డి, 93999 62117