మనిషి ప్రాణం నీటిలోనే పురుడు పోసుకుంటుంది. పిడికెడు బూడిదయ్యాకా నీటిలోనే ముగుస్తుంది. అణువు నుంచి అస్థి దాకా.. నిరంతరం మన ప్రాణాధారమైన నీటిని ప్రాణప్రదంగా చూసుకుంటున్నామా? దానికి తగినంత గౌరవం ఇస్తున్నామా? ఒక్క గంట నీళ్లు లేకపోతే తలకిందులైపోయే మనం ఒక్క చుక్క నీటినన్నా ఉద్దేశపూర్వకంగా కాపాడుతున్నామా? ఇవన్నీ తప్పక ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది. వ్యక్తిగానే కాదు దేశంగానూ, ఒక ప్రపంచంగానూ.. నీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. నీరు ఉంటేనే శాంతి, లేకపోతే యుద్ధం.. అనేంత తీవ్ర పరిస్థితి. ఈ ఏడాది నీటి దినోత్సవం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ‘వాటర్ ఫర్ పీస్’ పిలుపునిచ్చిన సందర్భంగా.. జల సంక్షోభాన్ని రుచి చూసిన, జయించిన కొన్ని దేశాల కథలు.. సుజల సాధనను సఫలం చేసే పాఠాలు.
‘మన తాతలు నదుల్లో నీళ్లను చూశారు. వాటినే ఆనందంగా తాగారు. మన నాన్నలు బావుల్లో చేదుకుని చల్లటి నీటిని ఆస్వాదించారు. ఈ తరం నల్లా నీళ్లను రుచి చూసింది. ఇప్పటి పిల్లలు.. నీళ్లను బాటిళ్లలోనే చూస్తున్నారు. ఇక.. రాబోయేతరం పరిస్థితి ఏమిటి?.. వాళ్లు నీళ్లను క్యాప్సూళ్లలో పట్టుకుంటారా?’ అంటూ ఇటీవల వైరల్ అవుతున్న ఓ వీడియో చూసిన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేయడమే కాదు.. భవిష్యత్ తరాల విషయంలో భయాన్నీ కలుగజేస్తున్నది. అవును..
ఉద్ధృతంగా ప్రవహించే నదీ జలాలను అరచేతుల్లో పట్టుకుని అమాంతంగా తాగినా ఆరోగ్యంగా ఉన్న నాటి తరం వాళ్లతో మనల్ని పోల్చుకోలేం. బాటిల్ నీరు తప్ప, బయటివి తాగితే అనారోగ్యం పాలయ్యే నేటి తరానికి ముందు తరాలు ఎలా ఉంటాయో ఊహించడం నిజంగానే వెన్నులో వణుకు పుట్టించే విషయం. ఆ ముందు తరం ఎంతో దూరంలో లేదు. మహా అయితే మన మనవళ్లు, మనవరాళ్లు, మునిమనవరాళ్లు. ‘ఆ రోజుల్లో ఒక్కొక్కరు అరగంట స్నానం చేసేవారట. మా కారైతే స్వచ్ఛమైన నీళ్లతో కడిగేవారట’ అంటూ మా పూర్వీకులు మహారాజులు అన్నంత గొప్పగా చెప్పుకొనే రోజులు వాళ్లకు రావని ఎవరు చెప్పగలరు. ముందుతరం సంగతేల… నేటికే అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న దేశాలు మన కండ్లముందే ఉన్నాయి. తమకంటూ ఒక్క పెద్దనది కూడా లేకున్నా అభివృద్ధిలో ఆకాశాన్ని అంటుతున్న రాజ్యాలూ ఈ భూమి మీద ఉన్నాయి. సమన్వయంతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చిన్నదేశాల పెద్ద ప్రయత్నాలూ.. వెతికితే ఇక్కడే కనిపిస్తాయి. ఏదైనా మనం చూసే కోణమే తేడా. నీటి చుక్కను భూతద్దంలో పెట్టుకున్నంత పెద్దది చేసుకునే మానవ ప్రయత్నం.. దోసిట నీళ్లను ఎడారిలో విసిరేసే మూర్ఖత్వం రెండూ ఇక్కడివే. మన కథ ఏం కానుందో మునుముందు తెలియాలి.
మూడు దేశాలు.. ముచ్చటైన ఒప్పందం ఆఫ్రికా దేశాలంటే కరవు, నీటి కొరతే గుర్తొస్తుంది. కానీ, నమీబియా ఎడారి పక్కన ఉండే బోట్స్వానా దేశంలో మాత్రం ఎక్కడ చూసినా తేట నీరు పారుతూ కనిపిస్తుంది. జలచరాలు హిప్పోపొటామస్లకు ఇది స్వర్గధామం అనేంతగా ఇక్కడ నీటి ఊట ఊరుతుంటుంది. అదేదో ప్రకృతి ప్రసాదం అనుకుంటే పొరపాటే. ఒక ఎడారి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఈ కథ అచ్చంగా మానవ ప్రయత్న విజయం. నీటి సమర్థ నిర్వహణకు అసలైన తార్కాణం.
ఈ కథ తెలియాలంటే అక్కడి ఒకవాంగో నది గురించి తెలుసుకోవాలి. ఇది అంగోలా దేశంలో పుడుతుంది. అంగోలా నుంచి నమీబియా దేశం గుండా బోట్స్వానా దేశానికి ప్రవహిస్తుంది. అయితే ఇది అక్కడి కలహరి ఎడారిలోకి మళ్లి అక్కడే ఆవిరైపోతుంది. నిజానికి నదులు సముద్రంలో కలవాలి. కానీ ఇక్కడి వాతావరణం కారణంగా.. ఎడారిలో అంతమవుతుంది. ఈ నది పుట్టే అంగోలా దేశంలో వర్షపాతం బాగానే ఉంటుంది. కానీ నమీబియా, బోట్స్వానాల్లో పరిస్థితి అలా కాదు. దీంతో కరవు, నీటి ఎద్దడి ఈ దేశాల్ని ఇబ్బంది పెడుతుండేవి. నీటి విషయమై దేశాల మధ్య ఘర్షణలు జరుగుతుండేవి. ఇది 1994కు ముందు పరిస్థితి. ఆ ఏడాది ఐక్యరాజ్య సమితి సలహాతో మూడు దేశాలు పర్మినెంట్ ఒకవాంగో రివర్ బేసిన్ వాటర్ కమిషన్ను ఏర్పాటు చేసుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉండే నదుల్ని అనుసంధానం చేస్తూ మూడు దేశాలు నీటిని సద్వినియోగం చేసుకోవడం మీద చర్చించుకున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి దాకా నీటి నిర్వహణ, వినియోగం, కాలుష్యాల నుంచి నదిని కాపాడుకోవడంలాంటి విషయాల మీద ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉమ్మడిగా ముందుకు పోతున్నాయి. మూడు దేశాల్లో ఉన్న నదులు, నీటి పాయల్ని అనుసంధానం చేసుకుంటూ సుమారు పదహారు వందల కిలోమీటర్ల దూరం సాగుతుంది ఈ ప్రవాహం. కలహరి ఎడారిలోని ప్రపంచంలోనే అతి పెద్ద సహజ ఒయాసిస్సుల్లో ఒకటైన ఒకవాంగో డెల్టా ఈ నది చివరి మజిలీ.
సింగపూర్ ఎలా బతుకుతున్నది..
సింగపూర్ ఓ ద్వీపదేశం. కొండలు లేవు. పెద్ద నదులు, సరస్సులు, హిమానీనదాల్లాంటి సహజ నీటి వనరులు లేనేలేవు. కానీ ప్రపంచంలోనే శుభ్రమైన తాగునీరు అందించే దేశాల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది. అది ఎలా సాధ్యమైంది అన్నది సింగపూర్ నీటి వనరులు – నిర్వహణ గురించి చదివితే తెలుస్తుంది. సింగపూర్ తమ నీటి వనరుల్ని నాలుగు విధాలుగా సమకూర్చుకుంటున్నది. వాటినే వాళ్లు నాలుగు నేషనల్ ట్యాప్స్గా పిలుస్తున్నారు. అందులో మొదటిది వాన నీరు. చుట్టూ నీరు ఉండే ఈ దేశంలో వర్షపాతం ఎక్కువే. కానీ అది భూగర్భ జలాలను పెంచేంతగా ఇంకడానికి అక్కడ తగినంత నేల లేదు. అందుకే కాలువలు, రిజర్వాయర్ల ద్వారా వాన నీటిని ఒడిసిపడతారు. దాన్ని బాగు చేసి వాడుకుంటారు. మరొకటి దిగుమతి చేసుకునే నీళ్లు. పక్కనే ఉన్న మలేషియా దేశం నుంచి నదీ జలాల్ని వీళ్లు దిగుమతి చేసుకుంటారు. ఇంపోర్టెడ్ బట్టలు, దుస్తుల్లా.. సింగపూర్కు ఇంపోర్టెడ్ వాటర్ అన్నది రెండో ట్యాప్. ఇక మూడోది న్యూవాటర్. మురుగు నీటిని శుద్ధి చేసి వాడటం. మైక్రో ఫిల్టరేషన్, రివర్స్ ఆస్మాసిస్, అతినీల లోహిత కిరణాలను ఉపయోగించి నీటిని శుభ్రంగా శుద్ధి చేస్తారు. న్యూవాటర్ బ్రాండ్ పేరుతో అక్కడ ఈ నీళ్లను తాగునీరుగా ఉపయోగిస్తున్నారు. మరొకటి డీశాలినేషన్. నాలుగో ట్యాప్గా పిలిచే ఈ వ్యవస్థలో సముద్ర జలాలను ఉప్పు లేని తాగునీరుగా మార్చి సరఫరా చేస్తారు. తక్కువ ఖర్చులో నీటి శుద్ధి, సరఫరా, నిర్వహణ విషయంలో సింగపూర్ వాటర్ ఏజెన్సీ అయిన పబ్లిక్ యుటిలిటీస్ బోర్డు సమర్థంగా పనిచేస్తున్నది. సమీకృత నీటి నిర్వహణ (ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్)లో ఈ దేశపు నీటి వ్యవస్థ ప్రపంచ వ్యాప్తంగా పేరుగన్నది. అంతేకాదు, నేటి ప్రపంచానికి హైడ్రోహబ్గానూ తాము అవతరిస్తున్నట్టు ఆ దేశం చెబుతున్నది.
అయితే, నాలుగు రకాలుగా దేశ నీటి అవసరాలను సమకూర్చుకోవడమే కాదు. తమ పౌరులకు నీటి సద్వినియోగాన్నీ ఎప్పటికప్పుడు నూరి పోస్తున్నది ఆ దేశం. పాఠశాల దశ నుంచే ఈ అవగాహన ఏర్పరుస్తున్నది. ప్రీ స్కూల్ స్థాయిలోనే నీరు ఎంత అమూల్యమైనదో బోధిస్తారు. ప్రాథమిక పాఠశాలకు వచ్చేసరికి సింగపూర్ ఎలా నీళ్లను సమకూర్చుకుంటున్నదో, దాన్ని ఏయే అవసరాలకు వినియోగిస్తున్నదో, అందుకు ఎంత ఖర్చు, శ్రమ చేస్తున్నదో
వివరిస్తారు. మూడో దశలో వాతావరణ మార్పులు నీటి మీద ప్రభావం, తీర రక్షణ, వరదల నిర్వహణలాంటి కొంచెం లోతైన విషయాలను వివరిస్తారు. ఇక తర్వాతి స్థాయి విద్యార్థులను నీటి సంరక్షణకు ఆలోచనలు ఇవ్వమని అడుగుతారు. ఆ దిశగా ప్రొటోటైప్లు తయారు చేసేలా, స్టార్టప్లు పెట్టేలా ప్రోత్సహిస్తారు. మొత్తంగా ఒక చదువు పూర్తయ్యేలోపు నీటి సంరక్షణ పట్ల అక్కడి పౌరులకు అవగాహన ఉంటుంది.
పిల్లలకే కాదు, కమ్యూనిటీలు, ఆఫీసులు, ఎన్జీవోలు.. ఇలా నీటి ఏజెన్సీ అన్ని స్థాయుల వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేస్తుంది. నీటి పొదుపునకు సంబంధించిన అవగాహన కల్పిస్తూ చిట్కాలనూ చెబుతుంది. ఉదాహరణకు కూరగాయలు సింకులో కాకుండా గిన్నెలో నీళ్లు పోసి కడగండి, ఆ నీటిని మొక్కలకు పోయండి. బట్టలు ఉతికిన నీళ్లను టాయిలెట్ కోసం వినియోగించండి. సబ్బు రుద్దుకునేప్పుడు షవర్ ఆఫ్ చేయండి.. ఇలా అన్నమాట. పబ్లిక్ యుటిలిటీస్ బోర్డుగా పిలిచే ఈ ఏజెన్సీ 1971 నుంచి నీటి సంరక్షణ కోసం పనిచేస్తున్నది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఈ సంస్థ నిర్వహిస్తున్న వివిధ క్యాంపెయిన్లు అక్కడి నీటి వినియోగాన్ని క్రమబద్ధీకరించేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 1976లో గృహావసరాల తలసరి నీటి వినియోగం దాదాపు 263 లీటర్లు ఉండేది. 2010 నాటికి 154 లీటర్లకు, 2019 నాటికి 141 లీటర్లకు తగ్గింది. కొవిడ్ కారణంగా జనం ఇండ్ల నుంచి పనిచేయడంతో 2022లో 149 లీటర్లకు పెరిగింది. అయితే 2030 నాటికి దాన్ని 130 లీటర్లుగా చేయాలన్నది ఈ నీటి ఏజెన్సీ లక్ష్యం. సమర్థవంతమైన నీటి వినియోగానికి ఇంతకుమించిన ఉదాహరణ ఇంకేం ఉంటుంది. జల సంక్షోభానికి సింగపూర్ సిసలైన పరిష్కారం చూపింది.
శాంతి కోసం…
ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా మార్చి 22వ తేదీన ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుతుంది. అందులో భాగంగా ఈ ఏడాది ‘వాటర్ ఫర్ పీస్’… అంటే ‘శాంతి కోసం నీరు’ అన్న థీమ్ను తీసుకొచ్చింది. ప్రపంచ దేశాలు శాంతి సుభిక్షాలతో ఉండాలంటే నీటి లభ్యత బాగుండాలన్న ఉద్దేశాన్ని చెబుతున్నది. నీరు శాంతిని నెలకొల్పగలదు. చిచ్చునూ రేపగలదు. నీటి కొరత, కలుషిత జలాలు, ప్రజలందరికీ సమానమైన నీటి లభ్యత లేకపోవడం లాంటివి వర్గాల మధ్య, దేశాల మధ్య ఘర్షణలకు దారి తీస్తాయి. ప్రపంచంలోని 153 దేశాలు నదులు, కాలువలు, సరస్సుల్లాంటి జల వనరుల్ని సరిహద్దులలో పంచుకుంటున్నాయి. ఇలా రెండు దేశాల మధ్య పారే నీటితో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 300 కోట్ల జనాభా ఆధారపడుతున్నారు. అయితే, ఇందులో కేవలం 24 దేశాలు మాత్రమే పరస్పర సహకార ఒప్పందాలు కలిగి ఉన్నాయి. మానవహక్కుల రక్షణకు, సుస్థిరాభివృద్ధికీ నీరు ఉత్ప్రేరకంలా పనిచేస్తుందనీ… వాతావరణ మార్పులు, పెరుగుతున్న జనాభా నేపథ్యంలో, మనకున్న అత్యంత అమూల్యమైన జల సంపదను… ఉమ్మడిగా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ ఐరాస పిలుపునిస్తున్నది.
నీళ్లులేని నగరం.. నేర్పింది పాఠం!
మనిషి ప్రకృతిలో భాగం. దానితో కలిసి, దాని మీద పడి మనం బతకాల్సిందే. కానీ ప్రకృతిని పాడు చేసి, దానికి విరుద్ధంగా పనిచేసి చిట్టచివరికి ప్రకృతితో కొట్లాడి బతకాల్సిన పరిస్థితి దాపురించింది ఒక నగరానికి. ఎంతలా అంటే తాము బతకాలంటే, తమ గొంతుక తడవాలంటే.. అక్కడ ఉన్న చెట్లు నీళ్లు తాగకూడదు. వాటిని కొట్టేయాల్సిందే! అని ప్రభుత్వాలు కంకణం కట్టుకుని అమలు చేసిన దుర్భర పరిస్థితిని మనం చూడొచ్చు. అవి పీల్చుకునే నీళ్లతో మేం రెండునెలలు బతుకుతాం..
అంటూ సంప్రదాయేతర చెట్లను నరికింది కేప్టౌన్ అనే ఓ నగరం. సౌతాఫ్రికా మూడు రాజధానుల్లో ఒకటి కేప్టౌన్. సుమారు అరకోటి జనాభా ఉన్న ఈ నగరం గడచిన కొన్నేండ్లుగా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నది. కొన్నాళ్ల క్రితం రోజుకు యాభై లీటర్ల నీటిని మాత్రమే వాడుకోవాలంటూ పౌరులకు పిలుపునిచ్చింది. అలా ప్రభుత్వం నీరు అందించే కుళాయిల దగ్గర మిలిటరీ బలగాలను, పోలీసుల్ని కాపలా ఉంచింది. అక్కడి పౌరులకు రోజూ స్నానం చేయడం ఓ లగ్జరీ. ట్యాప్ నీళ్లతో కారు కడగడం నేరం. కావాలనుకున్నప్పుడల్లా బట్టలు ఉతకడం ఓ కల. కొత్తగా లాన్లు పెంచాలంటే పర్మిషన్లు కావాలి. తమ పౌరుల మీద ఇన్ని ఆంక్షలు అమలు చేసినా సరే నీటి కొరత ఆ దేశాన్ని పీడిస్తూనే ఉంది. ఇంతలా నీటి కొరత వేధిస్తుడటంతో.. ఆ దేశ అధికారులు ఒక ఆలోచన చేశారు. అక్కడి కొండలు, లోయల్లో పెరుగుతున్న పైన్, బ్లాక్ వాటిల్, గమ్ చెట్లు అత్యధికంగా భూగర్భజలాలను పీలుస్తున్నాయని పరిశోధించారు. కాబట్టి వాటిని కొట్టేయడం ద్వారా ఆరేండ్లలో ఏడాదికి రెండు నెలలకు సరిపడా నీటిని మిగుల్చుకోవచ్చని తేల్చారు. గత అయిదేండ్లుగా ఆ పని కొనసాగిస్తున్నారు. గాలి వాటంగా గింజలు పడే ఈ చెట్లు త్వరగా పెరుగుతుండటంతో మంట పెట్టి కాల్చుతున్నారు కూడా. వీటిని ఇలాగే తొలగించగలిగితే వచ్చే 30 ఏండ్లలో ఒక సంవత్సరంలో నగరానికి నాలుగు నెలలకు సరిపడా నీటిని పొదుపు చేసినట్టేనని చెబుతున్నారు. ఆ చెట్లు స్థానికమైనవి కావన్నమాట వాస్తవమే అయి ఉండొచ్చు. కానీ, చెట్లు తాగే నీటి శాతాన్ని లెక్కించి వాటిని కొట్టేసే ప్రయత్నం చేయాల్సి రావడం మాత్రం తప్పకుండా కరవుకు తార్కాణమే.
విదేశాల సంగతి కాదు. ఇటీవల మన పక్క రాష్ట్రం కర్ణాటక కూడా ఎండకాలం మొదట్లోనే తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నది. దీంతో నీటిని వృథా చేసిన వాళ్లకు 5000 రూపాయల జరిమానా విధిస్తామని బెంగళూరు నీటి నిర్వహణ మండలి ప్రకటించింది. అంతేకాదు ఎవరైనా నీటిని వృథా చేస్తున్నట్టు గమనిస్తే తమకు తెలపాలని ఒక కాల్సెంటర్నూ ఏర్పాటు చేసింది. కార్లు కడిగేందుకు, గార్డెన్లు, స్విమ్మింగ్పూళ్లు, ఫౌంటెయిన్లకు మంచినీటిని వాడితే ఊరుకోబోమని కూడా హెచ్చరించింది. గతంలో చెన్నై కూడా ఇలాంటి నీటి ఎద్దడినే ఎదుర్కొంది. మన పక్కన ఉన్న మహారాష్ట్ర సంగతి చెప్పనే అక్కర్లేదు. లాతూర్కు నీళ్లు సరఫరా చేసేందుకు ఏకంగా రైలు నడిపిన సంగతి భారతదేశమే మర్చిపోలేదు. మిగతా దేశాలకు భిన్నంగా మన దగ్గర నదులున్నాయి. అడవులూ ఉన్నాయి. ఎండకాలం దాటితే ఈ కరవు తీరిపోవచ్చు. కానీ వానకాలాలు కలకాలం ఒకేలా ఉండవు. మన నీటి అవసరాలు మాత్రం అలాగే ఉంటాయి. మరి వాటిని తీర్చుకోవాలంటే ఒక్కో బొట్టూ ఒడిసిపట్టాల్సిందే. మన కోసమే కాదు, మన ముందు తరాల కోసమూ నీటి చుక్కను బంగారు ముక్కంత అపురూపంగా చూసుకోవాల్సిందే. జలమే జయం.. అన్నమాట మనసారా అంగీకరించాల్సిందే!
మంచినీళ్లలా ఖర్చు..
-లక్ష్మీ హరిత ఇంద్రగంటి