సమస్యలోనే పరిష్కారం ఉంటుంది. సంక్షోభంలోనే గొప్ప అవకాశం కనిపిస్తుంది. మనం చేయాల్సిందల్లా.. ఆశావాదంతో అడుగు ముందుకు వేయడమే. మేం చేస్తున్నది అదే. కిరాణా దుకాణాలను, చిల్లర వ్యాపారాలను బతికించడమే మా లక్ష్యం.
– ‘చోటూ’ వంశీ
ఇది స్టార్టప్ల శకం. మార్కెట్ను ఈ కామర్స్ ఏలేస్తున్నది. ఆన్లైన్ షాపింగ్ ఆఫర్లకు కస్టమర్ అయస్కాంతంలా అతుక్కుపోతున్నాడు. దీంతో తరాలనాటి కిరాణా దుకాణాలు పాతబడిపోతున్నాయి, మూతబడిపోతున్నాయి. అద్దెలు చెల్లించలేక,కరెంటు బిల్లులు కట్టుకోలేక షట్టర్లు దించేస్తున్నాయి. ఈ సంక్షోభ సమయంలో సంప్రదాయ వ్యాపారాలను కాపాడేందుకువచ్చింది.. చోటూ. క్యూఆర్ కోడ్ సాంకేతికత దీని ప్రత్యేకత. చోటూ ఆవిష్కర్తలలో ఒకరైన వంశీ తెలంగాణ బిడ్డే.
రాచరికంలో.. యుద్ధంలో ఓడిపోయిన రాజు కొన్నాళ్లకు కొత్త శక్తితో, సరికొత్త వ్యూహాలతో ప్రత్యర్థిపై దాడి చేసి రాజ్యాన్ని తిరిగి గెలుచుకుంటాడు. విజేత అనిపించుకుంటాడు. చరిత్ర పునరావృతం కావడం అంటే ఇదే. దశాబ్దం క్రితం.. ఇ-కామర్స్ సైట్స్ రూపంలో చిల్లర వ్యాపారంలో అడుగుపెట్టిన కార్పొరేట్లు కిరాణా దుకాణాలను కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఆ అనుభవాలను ఓ పాఠంలా అధ్యయనం చేసి.. సాంకేతిక అస్త్రశస్ర్తాలు సమకూర్చి.. దుకాణ యజమానులను మళ్లీ యుద్ధానికి సిద్ధం చేసింది.. స్టార్టప్ ‘చోటూ’. అంతేనా, మార్కెట్ను కొల్లగొడుతున్న మాల్స్ను కట్టడి చేసి, చిరు వ్యాపారులకు దందాలో చోటు కల్పించే ప్రయత్నం ఆరంభించింది. మీ కిరాణా కొట్టు బస్తీలో ఓ మూలన ఉండొచ్చు. ఏ చెట్టు నీడలోనో మీ బంధువు పండ్ల దుకాణం నడుపుతూ ఉండొచ్చు. అయినా సరే, నిరభ్యంతరంగా ఆన్లైన్లో సరుకులు అమ్ముకోవచ్చు. సాధారణంగా, ఆన్లైన్ వ్యాపారం చేయాలంటే ఇంటర్నెట్లో ఒక డొమైన్ సృష్టించుకోవాలి. దానికంటూ ఒక కంప్యూటర్ కొనాలి. ఉత్పత్తుల వివరాలు, ఫొటోలు అప్లోడ్ చేయాలి. అంత సమయం, పెట్టుబడి.. రెండూ ఉండవు చిరు వ్యాపారులకు. కాబట్టే, ఆ బాధ్యత చోటూ తీసుకుంటున్నది.
‘ఆన్లైన్ బిజినెస్ అంత తేలికా?’ అని ఆశ్చర్యపోకండి. చోటూలో నమోదు మరీ కష్టమేం కాదు. చిరు వ్యాపారులు తమ దుకాణంలో విక్రయించే సరుకుల జాబితాతో చోటూలో కేటలాగ్ సిద్ధం చేసుకోవచ్చు. సబ్బులు, షాంపూలు, కాస్మొటిక్స్, పర్సనల్ కేర్, ఫ్యాన్సీ వస్తువులు, పండ్లు, స్వీట్స్.. ఇలా 22 రకాల ప్రొడక్ట్స్ పరిధిలో కేటలాగ్ తయారు చేసుకోవచ్చు. నిజానికి ఇదో పెద్ద ప్రక్రియే. ఒక్క టూత్ పేస్ట్లోనే నాలుగైదు బ్రాండ్స్ ఉంటాయి. ఒక్కో బ్రాండ్లో అనేక సైజులు, ధరలు. ఇన్నిన్ని ఫొటోలు తీయడం సాధ్యమేనా? ఏం ఫర్వాలేదు. ఆ భారమంతా చోటూ తీసుకుంటుంది. చోటూ వెబ్సైట్లోని విస్తారమైన జాబితాలోంచి.. తమ దగ్గర అందుబాటులో ఉన్నవాటిని ఎంపిక చేసుకుంటే చాలు. మలి దశలో.. దుకాణం యజమానులు తమ క్యూఆర్ కోడ్ను కస్టమర్లకు, ఇరుగుపొరుగు ప్రజలకు చేరవేయాలి. ఇక నుంచీ ఎవరైనా సరుకులు కొనాలంటే.. రామస్వామి దుకాణానికో, వెంకటయ్య కొట్టుకో వెళ్లాల్సిన పన్లేదు. తమ దగ్గరున్న సదరు దుకాణం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. మనం ఎంపిక చేసుకున్న వస్తువుల చిట్టాతో దుకాణదారుడికి ఆర్డర్ వెళ్లిపోతుంది. బిల్ ఫైనల్ చేయగానే కస్టమర్కు సమాచారం అందుతుంది. నిమిషాల వ్యవధిలోనే డెలివరీ బాయ్ తలుపుతడతాడు. ఈ కామర్స్ దిగ్గజాలకు దీటుగా చిరు వ్యాపారులకు టెక్నాలజీని చేరువ చేసింది చోటూ. ఈ సేవలు అందించినందుకు నెలనెలా కొంతమొత్తాన్ని సర్వీస్ చార్జ్ కింద చెల్లించుకుంటే చాలు.
సొంతలాభం కొంత మానుకుని గట్టిమేలు తలపెట్టారు వంశీ పంజాల, వై. రవి! వంశీది కరీంనగర్. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ చదివాడు. రవిది వైజాగ్. ఐఐటీ ఢిల్లీలో బీటెక్ చేశాడు. ఇద్దరూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, బెంగళూరులో ఎంబీయే చదివారు. అక్కడి పరిచయం స్నేహంగా మారింది. ఆ మిత్రులు ఇప్పుడు పెద్ద పెద్ద ఐడియాలతో చిరు వ్యాపారుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆపరేషన్ పేరే ‘చోటూ’. ఆన్లైన్లో చాలారకాల ఈ కామర్స్ పోర్టల్స్ ఉన్నాయి. గుండు పిన్ను నుంచి భారీ యంత్రం వరకు విక్రయిస్తున్నారు. ఉప్పు, పప్పు మాత్రమే కాదు ఔషధాలు కూడా క్షణాల్లో అందుతున్నాయి. కాకపోతే.. ఆ డిస్కౌంట్లు, ఆఫర్లు తట్టుకోలేక చిన్న వ్యాపారాలు చితికి పోతున్నాయి. సిబ్బంది జీతాలు, దుకాణం అద్దెలు, కరెంటు బిల్లులు చెల్లించలేక చేతులెత్తేస్తున్నారు. క్రమంగా పోటీ నుంచి తప్పుకొంటున్నారు. టెక్నాలజీ కారణంగా కుదేలైన చిల్లర వర్తకుల్ని, అదే టెక్నాలజీ అండతో బతికిస్తామని చెబుతున్నారు చోటూ ఆవిష్కర్తలు. ‘చిరు వ్యాపారుల్ని, స్థానిక వ్యాపారాల్ని ప్రోత్సహించండి’ అని పిలుపునిస్తున్నారు రవి, వంశీ. దేశంలో కోటీ ముప్పై లక్షల కిరాణా దుకాణాలు ఉన్నాయి. పేటీఎం, ఫోన్ పే వాడే వ్యాపారులు 3.5 కోట్ల మంది ఉన్నారు. వీళ్లందరినీ తమ ప్లాట్ఫామ్ మీదికి తీసుకురావాలన్నది చోటూ లక్ష్యమని వివరిస్తారు వంశీ.