సీ॥ నిలిచె నే రాజధాని బయోరుహాసను
సజ్జపూల ననంత శయనమూర్తి
చెందెనేకటకంబునందు సంతత సర్వ
పరిపూర్తితో దత్త్విపాద్రి భూతి
పుట్టిరేపట్టణంబున దృణ దృమలతా
మూర్తులై తన్నిత్య ముక్తవరులు
ప్రవహించె నేవీట బరిఖావిభూతి న
వ్విరజా స్రవంతి కావేరి పేర
తే॥ వేద శృంగంబు నోంకార విగ్రహంబు
నైన శ్రీరంగ దివ్య విమాన రాజ
మెచట నివసించె నిల దాని నెన్నదరమె
పుణ్యనికరంబు శ్రీరంగ పురవరంబు
ఈ పద్యం సారంగు తమ్మయ రచించిన వైజయంతీ విలాసము అనే పద్య కావ్యం లోనిది. శ్రీరంగ క్షేత్రం విశిష్ఠత చెప్పే పద్యం ఇది. శ్రీరంగనాథుని నిలయమైన శ్రీరంగ పురాన్ని త్రిపాద్విభూతిగా భావిస్తున్నారు కవి. త్రిపాద్విభూతి అనే ప్రయోగం.. మహానారాయణ ఉపనిషత్తు లోని ‘భక్తియోగో నిరుపద్రవః భక్తియోగాన్ముక్తిః’ అనే ఉపనిషద్వాక్య సారంగా చెప్పవచ్చు. వస్తుజాలమంతా ఆకాశంలోనే ఉన్నా.. ఆకాశం వాటి స్పర్శ లేకుండా ఉంటుంది. అట్లే త్రిపాద్విభూతి మహా నారాయణుడు తానే దృశ్య కోటి అవుతూ, దానికి అతీతంగా ఉన్నాడు. ఇది ఎలాగంటే వామనుడిగా మొదటి రెండు అడుగులతో భూమిని, విశ్వాన్ని కొలిచి మూడో అడుగును ఎక్కడ ఉంచాడో అది త్రిపాద్విభూతి.
ఈ పద్యంలో తృణ, దృమ, లతా మూర్తులైన నిత్యముక్త వరులుగా.. ఆ పట్టణంలో పుట్టిన వారిని త్రిపాద్విభూతిగా వర్ణించారు కవి. దేవుడు, జీవుడు, ప్రకృతిల మధ్య సంబంధాన్ని చెబుతుంది విశిష్టాద్వైతం. తృణ, దృమ, లతలంటే ప్రకృతి. విరజానది ప్రవహిస్తున్నది అని కవి అన్నాడు కాబట్టి నిత్య ముక్త వరులది వైకుంఠం అనే నిత్య విభూతి. దీని నుంచి లీలా విభూతి పుడుతుంది. ఈ లీలా విభూతి తిరిగి నిత్య విభూతిలో కలవడమే మోక్షం. ఇదే త్రిపాద్విభూతి. ఇది పరమ పురుషుని పరమపదం.
ఇక్కడికి వచ్చిన ముక్తులు లక్ష్మీపతిత్వము, సృష్టి కర్తృత్వం తప్ప మిగిలిన లక్షణాలలో ఈశ్వర సమానులే. అక్కడ వేదాలకు కోటలా నిల్చిన (వేద శృంగము) ఓంకార రూపంలో ఉన్న దివ్య విమాన రాజం ఉంది. శృంగము అనడంలో మరో విచిత్రం కూడా ఉంది. ఈ ప్రాంతం కావేరీ నది కొమ్ముల రూపంలో విడిపోయిన స్థలం అని అంటారు. ఈ పద్యంలో కవి మరొక చమత్కారం చేశారు. జీవుల లీలా విభూతి పరమాత్ముని ఆధీనం అన్నట్లు… పాత్రల సృష్టి కవి ఆధీనం. కావ్యరచనలో కవి స్వతంత్రుడు. ఈ కావ్యంలో విప్రనారాయణ జననం సృష్టి. అతను వేశ్యా గృహానికి వెళ్లడం, చౌర్యనేరానికి గురవ్వడం లాంటివి లీలా విభూతి. ఈ విషయం కవి స్వయంగా నాలుగో ఆశ్వాసంలో చెప్పారు.
లీలావిభూతి సర్వం గుణత్రయాంకార సంభిన్నం. త్రిగుణాతీతులై ఫలాభి సంధిరహితకర్మచేత నిత్య విభూతిని చేరడానికి జీవులు అర్హులవుతారు. కర్మ వశులైన జీవులకు ఇలాంటి అవకాశం కల్గడమే లీలా విభూతి. ఈ పద్యం కథా ప్రారంభంలో మొదటి పద్యం కాబట్టి కావ్యంలో చెప్పదలుచుకున్న విషయం ఇందులో ప్రతిబింబిస్తుంది. నారాయణుని నిత్య విభూతితో ప్రారంభమైన కథ విప్రనారాయణుని లీలా విభూతి ముగిసి నిత్య విభూతిలో చేరడంతో ముగుస్తుంది.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ