గాంధీజీ ఆలోచనలు, ఆశయాల గురించి 27 మంది ప్రసిద్ధ వ్యక్తుల మనోగతానికి అక్షర రూపం ‘గాంధీయే మార్గం’ రెండో భాగం. ఇటీవలే వెలువడిన ఈ పుస్తకంలో సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, రామచంద్ర గుహ, విద్వాన్ విశ్వం, మాజీ ప్రధాని పీవీ వంటి వివిధ రంగాల ప్రముఖులు గాంధీకి సంబంధించిన ఎన్నో విషయాలను మన ముందుకు తెచ్చారు. ప్రభుత్వం ‘ధర్మ కర్తృత్వ మండలి’గా ఉండాలన్నది బాపూజీ భావన. ఆ సూచనలను, అభిప్రాయాలను గౌరవించినట్లయితే దేశం ఇవాళ ఇన్ని రుగ్మతలతో అల్లాడుతూ ఉండేది కాదు. తను మరణించిన 1948 జనవరి 30 ఉదయం గాంధీజీ ‘అక్కరలేనివీ, ప్రమాదకరమైనవి’ అంటూ ఏడు అంశాలు రాసి మనవడి చేతికి ఇచ్చారు. అవి: 1. పని చేయకుండా లభించే ధనం 2. అంతరాత్మ అంగీకరించని విలాస జీవితం 3. వ్యక్తిత్వాన్ని రూపుదిద్దని జ్ఞానం 4. నీతి లేని వ్యాపారం 5. మానవత్వాన్ని పట్టించుకోని శాస్త్రవిజ్ఞానం 6. త్యాగం లేని మతం 7. విలువలు లేని రాజకీయం. బాపూజీ ఏవైతే వద్దనీ.. ఏవైతే ప్రమాదకరమని అన్నారో వాటి చుట్టూనే నేడు మన సమాజం, రాజకీయం, ప్రజలు, నేతలు పరిభ్రమిస్తున్నారన్న ఎరుక చదువరులకు కలుగుతుంది. పారిశుద్ధ్యం, కుటీర పరిశ్రమలు, న్యాయస్థానాలు, ఆసుపత్రుల బాధ్యత మొదలైన అంశాలపై మహాత్ముడి ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉండేవో రచయితలు ఆసక్తికరంగా మనకు అందించారు. గాంధీయే మార్గం-2 ఎంతో విలువైన పుస్తకం.
గాంధీయేమార్గం – 2
సంపాదకులు:
నాగసూరి వేణుగోపాల్
పేజీలు: 190;
వెల రూ: 200/-
ప్రతులకు: నాగసూరి అకాడమీ ఆఫ్ మీడియా అండ్ సైన్స్
ఫోన్: 94407 32392
-కార్తీక్ నండూరి