బంగారు కొండలు, చిట్టి కాసులు.. ఇంట్లో ఉన్నారంటే అందరి దృష్టీ వాళ్లమీదే. బట్టలు మొదలు బొమ్మల వరకు అన్నీ ప్రత్యేకమే. అంత విలువైన వాళ్ల కోసం అంతే అమూల్యమైన వస్తువుల్ని తయారు చేస్తున్నాయి జువెలరీ సంస్థలు. పాల సీసాలు, పౌడర్ డబ్బాలు, గిలక్కాయలు.. ఇలా పసిపిల్లల కోసం వాడే ప్రతి వస్తువూ అచ్చమైన వెండితో రూపు దిద్దుకుంటున్నది.
చిన్నారికి పాలు పట్టే వెండి ఉగ్గు గిన్నెను అమ్మమ్మో, నానమ్మో మురిపెంగా తీసుకొస్తారు. అన్నప్రాసన నాడు పాలబువ్వ పెట్టేప్పుడూ రజత పాత్రదే కీలకపాత్ర. బంగారాలు ఎన్ని ఉన్నా పాపాయికి అవసరమైన వస్తువుల్లో వెండిదే సింగారం. చిన్నారులకు ఉగ్గు పెట్టేప్పుడు వెండి ప్లేట్లు, గ్లాసులు కూడా చాలా మంది వాడతారు. ఆ ప్రీతిని అర్థం చేసుకున్న జువెలరీ సంస్థలు పాపాయికి రోజువారీ వాడే వస్తువులన్నింటినీ వెండితోనే చూడచక్కగా తీర్చిదిద్దుతున్నాయి.
ఎన్నెన్నో..
ఇటీవల అయోధ్య రామమందిరంలో కొలువుదీరిన బాల రాముడి దగ్గర వెండి గిలక్కాయ, బొంగరం, గుర్రం, ఏనుగులాంటి బొమ్మల్ని ఉంచిన సంగతి తెలిసిందే. రాకుమారుడు కాబట్టి వెండి బొమ్మలే చేయించారు మరి! అయితే, రామచంద్రుడి కోసమే కాదు, మన బాలచంద్రులు ఆడుకునేందుకూ వెండి గిలక్కాయలు తయారు అవుతున్నాయి. మువ్వలు వేలాడేవీ, బొమ్మలున్నవీ.. ఇలా రకరకాలు వీటిలో ఉంటున్నాయి. పసిబిడ్డకు పాలుపట్టే సీసాలూ వెండిలోనే వెలుగులీనుతున్నాయి. ఏడెనిమిది నెలలు నిండిన పిల్లలు మంచినీళ్లు తాగేందుకు వాడుతున్న సిప్పర్లనూ వెండితోనే రూపొందిస్తున్నారు. చందమామను చూపిస్తూ చల్లబువ్వ తినిపించేందుకు వాడే ప్లేట్లు, గ్లాసులు, కప్పుల మీదా పిల్లలను ఆకట్టుకునే విధంగా చోటా భీమ్, మిక్కీ మౌస్, బార్బీలాంటి బొమ్మల్ని రంగురంగుల్లో ఎనామిల్తో అచ్చేస్తున్నారు. బిడ్డ కోసం వాడే పౌడర్ డబ్బా, పఫ్లకూ రజత కాంతుల్ని అద్దుతున్నారు. ఒకటనేమిటి మన బంగారు కొండలకు బహుమతులుగా అందించడానికి వెండికానుకలెన్నో ముస్తాబవుతున్నాయి.
మీకూ నచ్చాయా?!