ఊహ తెలిసినప్పటి నుంచీ మనిషి ఆకాశాన్ని గమనిస్తూనే ఉన్నాడు. మబ్బుల రాకకు సంతోషపడుతూ, ఉరుముల సద్దుకు భయపడిపోతూ… అక్కడో కొత్త ప్రపంచం ఉందని నమ్ముతూ కొన్ని తరాలుగా బతికేస్తున్నాడు.ఆరుబయట అనంతమైన ఆకాశాన్ని చూస్తూ అబ్బురపడిన మనిషే.. తొలి ఖగోళవేత్త. తను చూసే నక్షత్రాలు ప్రతిరోజూ ఒకేచోట లేకపోవడం అతనిలో కొత్త ఆలోచనలు రేకెత్తించింది. కాలచక్రం గుట్టు విప్పేలా చేసింది.
చాంద్రమానం ఆధారంగా తిథులు ఏర్పడ్డాయి. రుతువులు స్పష్టమయ్యాయి. వ్యవసాయ కార్యకలాపాలు, నిర్మాణాలు ఎప్పుడు చేపట్టాలో ముందే నిర్ణయించుకోగలిగాడు. కానీ, అక్కడితో ఆగితే మనిషి ప్రత్యేకత ఏముంది?
ఎప్పుడెప్పుడు భూమి హద్దులను దాటేస్తానా, చందమామ మీద అడుగుపెడతానా అని ఎదురుచూశాడు. ఒక్కో లక్ష్యాన్నీ సాధిస్తూ వచ్చాడు. ఇప్పుడు మరో దశ మొదలైంది. అంతరిక్షం అందరికీ అందుబాటులోకి వస్తున్నది. టికెట్టు కొనుక్కొని, ఎవరైనా సరే అక్కడికెళ్లే సావకాశం చిక్కుతున్నది. ఎవరికి తెలుసు? ఏదో ఒకరోజు మనమూ అలా అంతరిక్ష మార్గాన షికారు చేసే అవకాశం వస్తుందేమో!
శిరీష బండ్ల తెలుగమ్మాయి. నాసాలో చేరాలనుకుంది. కుదరలేదు. అలాగని అంతరిక్షంలో వెళ్లాలన్న తన కలను వదులుకోలేదు. వర్జిన్ గెలాక్టిక్ అనే సంస్థ ద్వారా అంతరిక్ష యాత్ర చేసింది. ఈ ప్రయాణాన్ని స్పేస్ టూరిజంలో మరో అడుగుగా ఒప్పుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో స్పేస్ టూరిజంగురించి తెలుసుకోవాల్సిందే!
కె.ఎల్.సూర్య
1980లలో..
అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ. ఆ మాటకొస్తే ఇప్పటివరకు అంతరిక్షంలోకి వెళ్లిన వారిలో భారతీయ పౌరసత్వం ఉన్న ఏకైక వ్యక్తి ఆయనే. ‘సోయుజ్ టి-11’ అనే సోవియట్ వ్యోమనౌక ద్వారా రాకేష్ స్పేస్ స్టేషన్కు చేరుకొన్నాడు. అక్కడే వారం రోజులు గడిపాడు. అప్పట్లో రష్యా ‘ఇంటర్కాస్మోస్’ అనే కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగానే మిత్ర దేశాలకు కూడా అవకాశం ఇచ్చేది. 1978 నుంచి సోవియట్ చిన్న దేశాలుగా విడిపోయే వరకూ 18 దేశాల పౌరులను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. అలా మన దేశం నుంచి ఎంపికైన వారే రాకేష్. సోవియట్ వ్యోమగాములకు ఇచ్చేంత ప్రాధాన్యం వీరికి ఇవ్వక పోయినా, తగిన శిక్షణ మాత్రం అందేది. యాత్ర ముగిశాక రష్యా జాతీయ పురస్కారాన్ని కూడా ప్రకటించేవారు. తమ అంతరిక్ష సంస్థతో సంబంధం లేని వారిని తీసుకువెళ్లే ఈ పద్ధతిని అమెరికా ఇంకాస్త ముందుకు నడిపి విశ్వవిహారానికి మార్గం వేసింది. 1984లో చార్లెస్ వాకర్ అనే ప్రైవేటు ఉద్యోగిని స్పేస్ షటిల్లో పంపింది. ఈ పద్ధతి అందరికీ నచ్చడంతో ప్రజల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి, అందులోంచి ఒకరిని అంతరిక్షానికి తీసుకువెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టీచర్ ఇన్ స్పేస్, జర్నలిస్ట్ ఇన్ స్పేస్, ఆర్టిస్ట్ ఇన్ స్పేస్ అంటూ వేర్వేరు రంగాల వ్యక్తులను పంపడం ద్వారా ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాలనుకుంది. దురదృష్టం! టీచర్ ఇన్ స్పేస్లో భాగంగా పదివేల దరఖాస్తులను దాటుకుని ఎంపికైన క్రిస్టినా అనే ఉపాధ్యాయురాలు ప్రయాణిస్తున్న వ్యోమనౌక బయల్దేరిన 73 సెకన్లకే పేలిపోయింది. దాంతో, ఆ కార్యక్రమాలకు గండిపడింది.
పర్యాటకం ప్రారంభం!
1990లలో రష్యా విచ్ఛిన్నం తర్వాత అంతరిక్షంలోని తన స్పేస్ స్టేషన్లను నడపడం ఆ దేశానికి కష్టంగా తోచింది. వాటికయ్యే ఖర్చులో కొంతైనా రాబట్టుకునేందుకు స్పేస్ టూరిజానికి శ్రీకారం చుట్టింది. ఈ విషయం తెలుసుకున్న డెనిస్ టిటో అనే అమెరికన్, తనను అంతరిక్షంలోకి తీసుకెళ్తే 20 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధపడ్డాడు. అలా డబ్బు చెల్లించి అంతరిక్షంలోకి వెళ్లిన తొలి యాత్రికునిగా, డెనిస్ చరిత్రలో నిలిచిపోయాడు. ఇక అక్కడినుంచీ టికెట్ కొనుక్కుని అంతరిక్షంలోకి వెళ్లే అలవాటు బాగానే పుంజుకుంది. మార్క్ షటిల్వర్త్, గ్రెగరీ ఆస్లన్ లాంటి వాళ్లు కోట్లు కుమ్మరించి ఆకాశవీధుల్లో విహరించారు. 2006లో అనౌషే అన్సారీ అనే ఇరానియన్ ధనికురాలు అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళా పర్యాటకురాలిగా చరిత్రలో నిలిచింది. ఇలా అడపాదడపా వ్యోమగాములు కానివారు కూడా అంతరిక్షంలోకి వెళ్లివస్తూనే ఉన్నారు. అయితే, ఇక్కడ రెండు విషయాలను గుర్తించాలి.
స్పేస్ టూరిజంలో పర్యాటకులను సబ్-ఆర్బిటల్ దశకు మాత్రమే తీసుకువెళ్లేందుకు మొగ్గు చూపేవారు. ఈ దశలో రాకెట్ నిదానంగా ఎగిసి తిరిగి వచ్చేస్తుంది. ఇందుకు భిన్నంగా ఆర్బిటల్ దశకు చేరుకునే రాకెట్లు భూమి చుట్టూ తిరిగే వేగాన్ని అందుకుంటాయి.
చాలా సందర్భాలలో నాసా (అమెరికా), రాస్కోస్మోస్ (రష్యా) లాంటి ప్రభుత్వ అంతరిక్ష సంస్థలే పర్యాటకులను తీసుకువెళ్లేవి.
ఈ రెండు పరిమితులూ ఇప్పుడు చెరిగిపోతున్నాయి. చిన్నపాటి దూరాలనే కాకుండా చంద్రుడి వరకూ పర్యాటకులను చేర్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ పోటీ నుంచి ప్రభుత్వ సంస్థలు తప్పుకున్నాయి. ప్రైవేటు కంపెనీలే దర్జాగా రాజ్యమేలుతున్నాయి.
మూడు ముక్కలాట
గత జూలై 11న, రిచర్డ్ బ్రాన్సన్కు చెందిన వి.ఎస్.ఎస్ యునిటీ అనే విమానం అంతరిక్షాన్ని ముద్దాడి, స్పేస్ టూరిజానికి తెరతీసింది. నిజానికి రిచర్డ్ మనసులో జులై 11న ప్రయాణం చేయాలని లేదు. నిదానంగా, వచ్చే వేసవిలో వెళ్లాలన్నది తన ఉద్దేశం. కానీ, ఎప్పుడైతే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ జూలై 20న తను అంతరిక్షంలోకి వెళ్తున్నట్టు ప్రకటించాడో.. ఆ క్షణమే తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు రిచర్డ్. ఈ సందర్భంగా, రిచర్డ్కు శుభాకాంక్షలు చెబుతూనే, తమ ప్రయాణం మరింత మెరుగ్గా ఎందుకు ఉంటుందో ఊదరగొట్టేశాడు బెజోస్. వీళ్లిద్దరితోపాటు ఎలన్ మస్క్ కూడా స్పేస్ టూరిజంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాడు. మొత్తానికి ప్రైవేటు బస్సుల పోటీని తలపించేలా ఈ ముగ్గురి సంస్థలూ అంతరిక్ష పర్యటనల మీద పైచేయి సాధించేందుకు సిద్ధ
పడుతున్నాయి.
వర్జిన్ గెలాక్టిక్
ప్రముఖ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్ స్థాపించిన సంస్థ ఇది. బ్రాన్సన్ నెలకొల్పిన వర్జిన్ గ్రూప్ కింద నాలుగు వందల కంపెనీలు ఉన్నాయని అంచనా! సంగీతం నుంచి విమానాల వరకూ రిచర్డ్ అడుగు
పెట్టని వ్యాపారం లేదు. ఈ వ్యాపార సామ్రాజ్యం అంత తేలికగా రూపొందిందీ కాదు. చిన్నతనంలో డిస్లెక్సియా (ఓ మోస్తరు మందబుద్ధి) అనే మానసిక సమస్యతో చదువులో రాణించలేకపోయాడు. ‘నువ్వు జైలుకన్నా వెళ్తావు, లేకపోతే అపర కుబేరుడివైనా అవుతావు’ అని హెడ్మాస్టర్ తేల్చి చెప్పాడు. చదువు తర్వాత ఏదో ఒక వ్యాపారాన్ని ప్రారంభించే ప్రయత్నంలో చాలా వైఫల్యాలే ఎదుర్కొన్నాడు రిచర్డ్. క్రిస్మస్ చెట్ల నుంచి చిలుకల వరకూ ఏవో ఒకటి అమ్మే ప్రయత్నం చేశాడు. చివరికి ఓ పత్రిక స్థాపనతో నిలదొక్కుకున్నాడు. పదిహేడేండ్ల క్రితం ఆయన స్థాపించిన సంస్థే.. వర్జిన్ గెలాక్టిక్. ఎన్నో అడ్డంకులను దాటి ఓ కొలిక్కి వచ్చిందీ సంస్థ. తన సంస్థకు చెందిన వ్యోమనౌకలో ప్రయాణించి, సొంత రాకెట్లో అంతరిక్షానికి వెళ్లిన తొలి వ్యక్తిగా, 70 ఏండ్ల వయసులో ఆకాశాన్ని తాకిన రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. వర్జిన్ గెలాక్టిక్లో ప్రయాణించేందుకు ఇప్పటికే 600 పైగా ఔత్సాహికులు రిజర్వేషన్ చేసుకున్నారు. టికెట్ ఖరీదు 2.5 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా! రిచర్డ్ పూర్వీకులు, బ్రిటిష్ పాలన సమయంలో మన దేశానికి వచ్చారు. భారతీయులతో వీరికి వివాహ సంబంధాలు కూడా ఉన్నాయి. అందుకే, రిచర్డ్ జన్యువులలో ఆసియన్ల పోలికలు కనిపించాయట. కాబట్టి, ‘మనోడే’ అని గర్వపడదాం.
స్పేస్ ఎక్స్
అపర కుబేరులలో ఒకడైన ఎలన్ మస్క్ స్థాపించిన సంస్థ ఇది. ఓ మనిషి తల్చుకుంటే కటికనేల నుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదగగలడని చెప్పడానికి మస్క్ జీవితమే ఉదాహరణ. దక్షిణాఫ్రికాలో పుట్టాడు మస్క్. తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోయారు. తండ్రితోపాటు ఉండాలని ప్రయత్నించిన మస్క్కు ప్రేమ స్థానంలో నరకం దక్కింది. బలహీనంగా కనిపించే మస్క్ను సాటి పిల్లలు పీడించి సంబరపడేవారు. అదే తనలో కసిని రగిలించి ఉంటుంది. ఎలాగైనా ఎదగాలని అమెరికాకు వలస వెళ్లాడు. కష్టనష్టాలను ఎదుర్కొంటూనే కంప్యూటర్స్, సైన్స్ మీద పట్టు సాధించాడు. ఇంటర్నెట్, ఆన్లైన్ బ్యాంకింగ్ సంస్థలు స్థాపించి అపారమైన లాభాలు గడించాడు. ఎంత సాధించినా తన చిన్నప్పటి కల అంతరిక్షయానం గురించి మాత్రం మర్చిపోలేదు. 2002లో ‘స్పేస్ ఎక్స్’ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థకు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. తను రూపొందించిన ‘ఫాల్కన్’ అనే అంతరిక్ష వాహనం నాసాను సైతం ఆకర్షించింది. మస్క్ ఆలోచనలు భూమి అంచుల దగ్గరే ఆగిపోలేదు. ఏకంగా చంద్రుడి మీదికి టూరిస్టులను తీసుకువెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. కుజగ్రహం మీద కాలనీ నిర్మించేందుకు సిద్ధపడుతున్నాడు.
జెఫ్ బెజోస్
రిచర్డ్ తర్వాత సొంత వాహనంలో అంతరిక్షానికి వెళ్లిన వ్యక్తిగా రికార్డుల్లో నిలిచాడు జెఫ్. అమెజాన్ వ్యవస్థాపకుడిగా ఆయన గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. 15 లక్షల కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలోనే ధనవంతుడిగా నిలిచిన జెఫ్ జీవితం కూడా ఒడుదొడుకుల మధ్యే సాగింది. తల్లికి 17 ఏండ్లు ఉండగానే జెఫ్ పుట్టాడు. ఆ పిల్లవాడిని ఎత్తుకొనే ఆమె బడికి వెళ్లేది. ఇంత కష్టపడినా ఆమె వివాహ బంధం నిలువలేదు. భర్త నుంచి విడిపోయి రెండో వివాహం చేసుకుంది. జెఫ్ చదువు కూడా చాలా చోట్ల సాగింది. కానీ, చేరిన ప్రతి ఉద్యోగంలోనూ రాణించాడు. ముప్పై ఏండ్ల వయసులోనే ఓ బహుళజాతి కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్నాడు. కానీ, జెఫ్ అక్కడితో తృప్తి పడలేదు. తన గ్యారేజీలో అమెజాన్ పేరుతో ఓ ఆన్లైన్ బుక్స్టోర్ను ప్రారంభించాడు. ఆ తర్వాత చరిత్ర తెలిసిందే. జెఫ్కు మొదటి నుంచీ అంతరిక్షం పట్ల ఆసక్తి ఉండేది. కేవలం అలా ఆకాశంలో తిరిగిరావడం కాదు, మనిషి ఇతర గ్రహాల మీద కూడా నివాసాలు ఏర్పరుచుకోవాలని కలగన్నాడు. అందుకే 20 ఏండ్ల క్రితం ‘బ్లూ ఆరిజిన్’ సంస్థను స్థాపించాడు. తన లక్ష్యాలను చాటేందుకు, గత జూలై 20న తన సొంత వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లివచ్చాడు. ఈ ప్రయాణంలో తన సోదరుడు మార్క్ బెజోస్తో పాటు వాలీ ఫంక్ అనే 82 ఏండ్ల మహిళ, అలివర్ డేమన్ అనే 18 ఏండ్ల కుర్రాడు కూడా ప్రయాణించారు. ఇప్పటివరకు అంతరిక్షంలోకి వెళ్లిన అతిపెద్ద వయస్కుడిగా వాలీ ఫంక్, అతిపిన్న వయస్కుడిగా అలివర్ డేమన్ కూడా రికార్డులు సృష్టించారు
స్పేస్ అడ్వెంచర్స్
ఈ రంగంలో మొదటి నుంచీ నిలకడగా విజయాలు సాధిస్తున్న సంస్థ ‘స్పేస్ అడ్వెంచర్స్’. 1998లో స్థాపించిన ఈ సంస్థ సొంతంగా రాకెట్లనేమీ రూపొందించదు. కానీ, ఔత్సాహికులకు, అంతరిక్ష సంస్థలకు మధ్య సమన్వయ
కర్తగా వ్యవహరిస్తుంది. టికెట్టు కొనుక్కొని అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యక్తి డెనిస్ టిటో సహా ఇప్పటివరకూ ఏడుగురిని ఆకాశంలోకి పంపిందీ సంస్థ. మున్ముందు కూడా చాలామందిని అంతరిక్ష యానానికి సిద్ధం చేస్తున్నది. అంత ఖర్చు భరించలేనివారి కోసం నేల మీదే వ్యోమనౌక యాత్ర, భారరహిత స్థితి తదితర అనుభవాలను కలిగిస్తున్నది.
అంతా మంచికేనా!
‘చందమామ రావే’ అని పాడుకున్నంత తేలికగా అంతరిక్షం వరకూ వెళ్లి, అక్కడి నుంచి కాస్త దగ్గర నుంచీ జాబిల్లినీ, కాస్త దూరం నుంచీ నేలనీ చూసి సంబరపడే రోజులు వచ్చేశాయి. ఈ అనుభూతి డబ్బున్నవారికే సొంతమైనా, మున్ముందు సామాన్యులకూ చేరువకావచ్చు. కానీ, ఈ అభివృద్ధితోపాటు దుష్పలితాలు కూడా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
ప్రాణనష్టం
రాకెట్లో మనిషి ప్రయాణం అంటే, ప్రాణం గాల్లో దీపమే! ఒక్క 2020లోనే ఈ తరహా ప్రమాదాల్లో చనిపోయినవారి సంఖ్య 30కి పైమాటే. ప్రయాణాలు ఎక్కువయ్యేకొద్దీ ఈ సంఖ్య పెరిగిపోతుందన్నది ఓ వాదన. ఆ శకలాలు జనావాసాల మీద పడినా అపారమైన నష్టం ఖాయమే. ఎప్పుడో ఒకసారి ఉపగ్రహాలు దారితప్పుతున్నాయంటేనే బిక్కుబిక్కుమంటూ గడుపుతాం.
అలాంటిది నిరంతరం ‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతాను’ అని ఎవరు టాటా చెప్పినా భయపడాల్సిందే.
ఆరోగ్య సమస్యలు
భూమి నుంచి ఒక్కో అడుగూ పైకి వెళ్లేకొద్దీ పీడనం పెరిగిపోతూ ఉంటుంది. అలాంటిది కిలోమీటర్ల కొద్దీ పైపైకి ప్రయాణిస్తే చెప్పేదేముంది? మన చుట్టూ ఉండే వాతావరణం మనల్ని మసిచేయడానికి ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. వ్యోమనౌకలు అంతటి ఒత్తిడిని తట్టుకున్నా, లోపల ఉండే వ్యోమగాముల శరీరం అనేక పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కఠినమైన వ్యాయామం, కఠోర శిక్షణ, శరీర వ్యవస్థ మీద అవగాహన.. అన్నీ ఉన్నవారు సైతం చాలా ఇబ్బందులకు లోనవుతుంటారు. ఇంద్రియాలు సరిగా పనిచేయవు. ఎముకలు బరువును కోల్పోతాయి. గుండె పనితీరు నెమ్మదిస్తుంది. పీడకలలతో నిద్ర పట్టదు. ఇక భూమ్మీదకు తిరిగి వచ్చిన తర్వాత కూడా కిడ్నీలో రాళ్ల నుంచి క్యాన్సర్ వరకూ రకరకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నామమాత్రపు శిక్షణ ఇచ్చి పర్యాటకులను పంపితే, వాళ్ల ఆరోగ్యానికి హామీ ఏమిటన్నది సూటి ప్రశ్న. ఇది అంతరిక్ష వ్యాపారంలోని అనైతిక కోణం కూడా!
పర్యావరణ‘రణం’
ఓ రాకెట్ను మండించాలంటే మాటలా? ట్యాంకుల కొద్దీ ఇంధనం కావాలి. పర్యావరణం మీద ఆ ప్రభావం ఉంటుంది కదా. Advancing Earth and Space Science అనే సంస్థ లెక్కల ప్రకారం.. ఒక రాకెట్, విమానం కంటే 150 రెట్ల అధిక కర్బనాన్ని విడుదల చేస్తుంది. పైగా ఆ ఇంధనం మండటం వల్ల వచ్చే క్లోరిన్ ఓజోన్ పొరకు నష్టం చేస్తుంది. ఇది కచ్చితంగా గ్లోబల్ వార్మింగ్కు దారితీస్తుందని, ధ్రువప్రాంతాల దగ్గర ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తుందనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వనరులు వృథా
ఐక్యరాజ్యసమితి ఆహార విభాగపు డైరెక్టర్ ఆ మధ్య ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్లను ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేశారు. ‘ఆరు బిలియన్ డాలర్లను కనుక మనం పోగేయగలిగితే ఈ ఏడాది నాలుగు కోట్ల మంది పిల్లలను ఆకలి చావు నుంచి తప్పించవచ్చు’ అని సారాంశం. కొవిడ్ వల్ల కోట్ల మంది కటిక పేదరికంలోకి జారిపోయారు. ఉపాధి, ఆరోగ్యం, పోషకాహారం లాంటి ప్రాథమిక అవసరాలు కూడా మృగ్యమైపోయాయి. అలాంటి సందర్భంలో ధనవంతుల ఈ ప్రయాణాలు ఓ పరిహాసమే అనే మాట వినిపిస్తుంది.
కర్మాన్ లైన్
రిచర్డ్ బ్రాన్సన్ ప్రయాణించిన వర్జిన్ గెలాక్టిక్ నౌక 86 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లింది. అది ‘కర్మాన్ లైన్’ను దాటలేదు కాబట్టి, వాళ్లు అంతరిక్షంలోకి వెళ్లనట్లే లెక్క. అలా అలా కాస్త ఎత్తుకు వెళ్లి వచ్చేసారంతే! అంటూ ఎన్నో ఆరోపణలు వినిపించాయి. ఇంతకీ ఏమిటీ కర్మాన్ గీత? మనం ఆకాశంలోకి వెళ్లేకొద్దీ పీడనం పెరిగిపోతూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఓ స్థాయికి వెళ్లిన తర్వాత ఇక ముందుకు వెళ్లడానికి అసాధారణమైన శక్తి అవసరం అవుతుంది. అది ఫలానా చోటే అన్న మైలురాయి ఏదీ లేదు. కొందరు 80 కిలోమీటర్లుగా పేర్కొంటారు, మరికొందరు 118 కిలోమీటర్ల ఎత్తుగా చెప్తారు. కానీ, కర్మాన్ అనే శాస్త్రవేత్త మధ్యేమార్గంగా 100 కిలోమీటర్ల దగ్గర ఈ పరిమితిని సూచించడంతో చాలామంది దాన్నే ప్రామాణికంగా భావిస్తున్నారు. అది దాటితే ఇక అంతరిక్షంలోకి ప్రవేశించినట్టే అంటారు. కర్మాన్ గీతకు మరో ప్రత్యేకత ఉంది. ఒక దేశపు సార్వభౌమత్వం ఆ గీత వరకే ఉంటుందన్నది ఓ వాదన. కర్మాన్ గీతను దాటాక ఇక అంతరిక్షం అందరిదీ! నాసా 80 కిలోమీటర్ల లెక్కనే బలపరుస్తోంది కాబట్టి, రిచర్డ్ అంతరిక్షంలోకి వెళ్లినట్టే అని కొందరి వాదన. అంతర్జాతీయంగా కర్మాన్ గీతకే ప్రాధాన్యం ఉంది కాబట్టి, తను వెళ్లలేదన్నది మరికొందరి ఖండన!
అన్సారీ ఎక్స్ ప్రైజ్
1919లో ఆర్టెగ్ ప్రైజ్ అనే ఓ బహుమతిని ప్రకటించారు. న్యూయార్క్ నుంచి పారిస్ వరకు ఆగకుండా విమానం తోలగలిగేవారి కోసం ఈ పోటీ పెట్టారు. ఆర్టెగ్ ప్రైజ్ విమానయానం పట్ల ప్రజల్లో మంచి అవగాహన కల్పించింది. అలాగే, అంతరిక్షయానాన్ని ప్రోత్సహించేందుకు 1996లో అన్సారీ ప్రైజ్ను ప్రకటించారు. రెండు వారాల వ్యవధిలో రెండుసార్లు వంద కిలోమీటర్ల ఎత్తును అందుకుని రావాలన్నదే నిబంధన. ప్రైవేటు సంస్థల కోసం రూపొందించిన ఈ పోటీలో ‘స్పేస్షిప్ వన్’ అనే కంపెనీ నెగ్గింది. ఊహించినట్టుగానే ఈ పోటీ అంతరిక్షయానం పట్ల సామాన్యపౌరులలో ఆసక్తి కలిగించడంతో వైద్యం, సాంకేతికత, పర్యావరణం లాంటి రంగాల్లో మరిన్ని బహుమతులను ప్రకటించింది అన్సారీ
ఫౌండేషన్.
కమర్షియల్ ఆస్ట్రొనాట్!
వ్యోమనౌకలను నడపడం, వాటిలో బాధ్యతలు నిర్వహించడం అంత తేలిక కాదు. అందుకే క్రమంగా ఈ విభాగానికి డిమాండ్ పెరుగుతున్నది. భవిష్యత్తులో ఎలాగైనా అంతరిక్షంలోకి వెళ్లాలనుకునేవారికి ప్రయాణానికి, పరిస్థితులకు తగిన శిక్షణ అందించే సంస్థలు చాలానే వస్తున్నాయి. అమెరికాలో అయితే ఇలా శిక్షణ పొంది, అనుమతి ప్రకారం అంతరిక్షయానం చేసినవారికి ‘ఆస్ట్రోనాట్ వింగ్స్’ అనే గుర్తింపు పతకాన్ని అందిస్తారు. శిరీష బండ్ల కూడా ఈ వింగ్స్ను అందుకున్నారు.
మన పరిస్థితి?
స్పేస్ టూరిజం గురించి ఇంత హడావుడి జరుగుతుంటే, మనం ఎక్కడ ఉన్నాం? అన్న ప్రశ్న ఉదయించక మానదు. అమెరికాలో విమానయాన అనుమతి పొందిన సంస్థలు అంతరిక్షంలోకి వెళ్లే అనుమతి ఉంది. మన భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో కూడా గతేడాదే అంతరిక్షంలో ప్రైవేటు సంస్థలకు కొంతమేర అనుమతి ఇచ్చింది. దాన్ని అందిపుచ్చుకునేందుకు చాలా స్టార్టప్స్ ఏర్పడినా, ఆశించిన వేగం కనిపించడం లేదు. స్పేస్ టూరిజం అభివృద్ధి జరగాలంటే దిగ్గజ సంస్థలు ముందుకు రావాల్సిందే! లాభాలను పట్టించుకోకుండా వ్యక్తిగత అభీష్టంతోనో, మొండితనంతోనో ముందుకు వెళ్లే వ్యాపారవేత్తల ప్రోత్సాహమూ ఉండాలి. ఇదంతా సాధ్యమా అన్నదే సంశయం. కేరళకు చెందిన సంతోష్ జార్జ్ (2007లోనే) అంతరిక్షంలోకి వెళ్లేందుకు వర్జిన్ గెలాక్టిక్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. స్పేస్ టూరిజంలో పరోక్షంగా అయినా భారతీయుల ఉనికి కనిపిస్తున్నది. ఆయా సంస్థలలో వాళ్లు ప్రతిష్ఠాత్మక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ‘సంజల్ గవాండె’ బెజోస్ వ్యోమనౌక నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.
వాదాలను, వివాదాలను పక్కన పెడితే, అల్లంత దూరం నుంచీ తారలను చూస్తూ గడిపిన మనిషి, వాటిని అందుకునే స్థాయికి చేరుకోవడం సంతోషించాల్సిన సందర్భమే. స్పేస్ టూరిజంతో అంతరిక్షం ఇకపై అందరిదీ అని చాటిన ఘనత కూడా గర్వించదగ్గదే. ఎవరికి తెలుసు! ఓ రెండు తరాలు గడిచే సరికి అరుంధతి నక్షత్రం కనిపిస్తోందా? అని అడిగే పురోహితుని ప్రశ్నకు జవాబుగా.. అక్కడి వరకూ వెళ్లి వచ్చే జంటలూ ఉంటాయేమో!