Ramaayanam | ఇప్పుడంటే ఇంటింటికి, గల్లీ గల్లీకి వినాయక విగ్రహాలు పెడుతున్నారు. నవరాత్రులు చేస్తున్నారు కానీ, నలభై ఏండ్ల కింద ఇలా ఉండేది కాదు. మా ఊళ్లో సామూహిక వినాయక చవితి జరిపినట్లు నా జ్ఞాపకాల్లో లేదు. ఎవరింట్లో వాళ్లు జరుపుకొనేవారు. ప్రస్తుతం డబ్బుఎక్కువైందో, భక్తి ఎక్కువైందో.. తెలియడం లేదుకానీ, చవితిని ఆర్భాటంగా చేస్తున్నారు.
మాఇంట్లో ఏటా సంప్రదాయంగా నవరాత్రులు జరిపేవారు. గణపతిని.. దేవుని గదిలో కాకుండా, చతుశ్శాల భవంతిలో ఒక మనసాల్లో గద్దెపీట మీద ఉంచి పూజ చేసేవారు. తెల్లవారుతుండగానే మా పొలం పనులు చూసే రామయ్యగానీ, వాళ్ల కొడుకు యాదగిరి గానీ వచ్చి పాలవెల్లి కట్టేవారు. పెద్ద గద్దె పీట నాలుగు కాళ్లకూ కర్రలు కట్టి, పైన పందిరిలాగా వేసేవారు. జామ, ఉసిరి, దానిమ్మ, నిమ్మ, రేగు కొమ్మలు తెచ్చి వేలాడదీసేవారు.
మొదట్లో మేము వార పత్రికల ప్రత్యేక సంచికలు పట్టుకుని గొప్పగా.. “పత్రి తెచ్చిపెట్టాలె యాదగిరీ!” అనేవాళ్లం. అతను ఎప్పటిలాగే నెత్తి గోక్కొని.. “పత్రి అంటె ఏంటిది? ఆఁ.. గా దీపంల వత్తులు బెడ్తరు.. గా పత్తా?” అనేవాడు. ఇంతలో నాన్న కలుగజేసుకుని.. “గట్ల జెప్తె వానికి ఎట్ల తెలుస్తది?
యాదగిరీ! నువ్వు పొయ్యి మన పెరట్ల ఉన్న చెట్ల ఆకులన్నీ కొంచెం కొంచెం తీస్కరాపో! ఒక్క జిల్లేడు, ఉమ్మెత్త బైటికి పొయ్యి తే!”.. అని సమస్యను పరిష్కరించేవాడు. రెండు మూడేళ్లు అయ్యేసరికి ఏయే ఆకులు తేవాలో తెల్సుకుని, ఎక్స్పర్ట్ అయ్యాడు యాదగిరి. అతనే ఇంటి పెరట్లో ఉన్న చెట్ల ఆకులన్నీ తెంపుకొచ్చేవాడు. మేమూ కొన్నిటిని తెంపేవాళ్లం. అట్లా ఆకులూ, పువ్వులూ తెంపుకొని రావడం మాకెంతో సరదాగా ఉండేది. పెద్దవాళ్ల ప్రమేయం లేకుండా.. మనమే పెత్తనం చేస్తూ జరుపుకొనే పండుగ కాబట్టి ఇష్టంగా అనిపించేది. తొందరగా తలంట్లు పోసుకుని, మంచి బట్టలు వేసుకుని సిద్ధంగా ఉండేవాళ్లం. ప్రతి పండక్కూ ఇంతలా బట్టలు కొనడం అప్పట్లో లేదు. ఎవరికైనా సరే.. బతుకమ్మ, దసరాలకు ఒక జత బట్టలు కొనేవారు. ఏ పండక్కి అయినా అవే వేసుకోవాలి.
అవుసలి వెంకట్రాములు ఓ ఏడూ, సత్యనారాయణ ఓ ఏడూ మట్టి వినాయకుణ్నీ, ఎలుకనూ తెచ్చేవారు. వాళ్లకు డబ్బులతోపాటు బియ్యం, ఎండు మిరపకాయలూ, పప్పులు, కూరగాయలూ ఇచ్చేవాళ్లు. ఓ పక్క వంట చేస్తూనే పూజకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసేది అమ్మ. నాన్న కూడా సాయం చేసేవాడు. వత్తులూ, పువ్వుల డిపార్టుమెంట్.. నాయనమ్మ చూసుకునేది. మా చిన్నప్పుడు పూజ చేయించడానికి ఇంటికి అయ్యగారు వచ్చేవారు. దేవుడి పీట దగ్గర పుస్తకాలూ, పెన్నులూ పెట్టడం సరదాగా ఉండేది. యథాశక్తి పూజ చేసి, పిండి వంటలన్నీ ఆరగింపు చేశాక.. ఆ వ్రత కథ మేమే చదివేవాళ్లం. పదో రోజున.. మా ఇంటి బావిలోనే విగ్రహాన్ని నిమజ్జనం చేసేవాళ్లం.
కొన్నాళ్లకు అన్ని ఊళ్లలో మాదిరిగానే.. సామూహికంగా వినాయకుణ్ని పెట్టడం అనే అలవాటు మా ఊళ్లోకి కూడా ప్రవేశించింది. ఊరి మధ్యలో పెద్ద ఆవరణ ఉన్న శివాలయంలో వినాయకుణ్ని ఉంచి, తొమ్మిది రోజులూ పూజలు చేసి నిమజ్జనం చేసేవారు. మరికొన్నాళ్లకు చిన్నపిల్లలకు రకరకాల పోటీలు పెట్టి బహుమతులు ఇవ్వడం మొదలైంది. మరి కొన్నేళ్లకు నిమజ్జనాన్ని ఘనంగా చేయడం మొదలుపెట్టారు. ఓ ట్రాక్టర్లో విగ్రహాన్ని ఉంచి, ప్రధానవీధుల్లో ఊరేగించి.. పెద్ద చెరువులో నిమజ్జనం చేసేవారు. ప్రతి ఇంటి ముందూ ఆడవాళ్లు మంగళ హారతులు ఇచ్చేవారు, కొబ్బరి కాయలు కొట్టేవారు.
ఇంకొన్నాళ్లకు భద్రాచలం సీతారామ కల్యాణం సందర్భంగా వచ్చే ఉషశ్రీ గారి ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రభావంతో.. వినాయక ఊరేగింపులోనూ ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయించాలని కొందరికి కోరిక కలిగింది. మా ఊరి గ్రామపంచాయతీ ఆఫీసులో కారోబార్గా పనిచేసే శంకర్ ముందుకొచ్చాడు. అయితే ట్రాక్టర్లోనే కూర్చొని వ్యాఖ్యానం చేయాలంటే.. అందుకు కావాల్సిన బ్యాటరీ, మైక్సెట్ కనెక్షన్ లాంటి సాంకేతిక పరికరాలు అప్పుడులేవు. దాంతో, ఆయన గుడిలోనే ఉండి.. అప్పుడు రథం ఎక్కడుందో లెక్కలు వేసి ఊహించి, ఆ అంచనా ప్రకారమే వ్యాఖ్యానం చెప్పేవాడు. కొన్నాళ్లకు అది రసాభాసగా మారింది.
శంకర్ వ్యాఖ్యానం మరికాస్త రసపట్టులోకి వచ్చి.. “ఆహా! ఎంత వైభవమయ్యా గణనాథా! ముగ్గులు వేసేవాళ్లు వేస్తున్నారు. పాటలు పాడేవాళ్లు పాడుతున్నారు. మంగళహారతులు ఇచ్చేవాళ్లు ఇస్తున్నారు. కొబ్బరి కాయలు కొట్టేవాళ్లు కొడుతున్నారు. కోలాటాలు వేసేవాళ్లు వేస్తున్నారు. సాము గరిడీలు చేసేవాళ్లు చేస్తున్నారు. అంతా.. వేళాకోళంగా ఉంది!” అనేవాడు. ఒకసారంటే ఏదో పొరపాటు అనుకుంటాం.. కానీ, ప్రతిసారీ అలాగే చెప్పేవాడు. మేం ఇంటిదగ్గరి నుంచి విని.. “అయ్యో! ఎవరన్న పొయ్యి చెప్తే బాగుండు. ‘కోలాహలం’ అనడానికి బదులు ‘వేళాకోళం’ అంటున్నాడు!” అనుకునేవాళ్లం. అలా దిగ్విజయంగా కొన్నాళ్లు వ్యాఖ్యానించాక.. మరెందుకనో ఆపేశాడాయన. మరికొన్నాళ్లకు వాళ్ల కుటుంబం సిటీకి వెళ్లిపోయింది. ఆ తరువాత గల్లీగల్లీకి వినాయకుళ్లూ, చందాలూ, డీజేలూ, డ్యాన్సులూ, ఇంకా అనేకం పెరిగినా.. చవితి పండుగ వచ్చినప్పుడల్లా శంకర్ వ్యాఖ్యానం, కోలాహలం – వేళాకోళం గుర్తొచ్చి నవ్వొస్తుంది.
– నెల్లుట్ల రమాదేవి ( Nellutla Ramadevi ), రచయిత్రి
Ramaayanam | సంగీత జ్ఞానం (గాత్రం)
Ramaayanam | చెంబులకొద్దీ నీళ్లు ముంచి ఇస్తుంటే.. బడికి పోయినా బాగుండె అని అనిపించింది!