Rahim Saheb | ఆయనే మరికొంత కాలం జీవించి ఉంటే.. ఆయన వారసత్వమే పుణికిపుచ్చుకొని ఉంటే.. ఆయనిచ్చిన స్ఫూర్తి సడలకపోయి ఉంటే.. భారత సాకర్ ముఖచిత్రం ఇలా ఉండేది కాదేమో! ‘ఫిఫా’లో దిగ్గజ జట్టుగా మన్ననలు పొందేదేమో! గ్రౌండ్లో మన హైదరాబాదీ రహీమ్సాబ్ మెరిపించిన మెరుపుల్ని అజయ్ దేవగణ్ ‘మైదాన్’ చిత్రంలో చూడబోతున్నాం. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే ఫుట్బాల్ ప్రపంచంలో భారత్కంటూ ఓ పేజీని లిఖించి.. యూరప్, ఆఫ్రికాలకు తామేమీ తీసిపోమని నిరూపించిన భారత సాకర్ నవాబ్.. సయ్యద్ అబ్దుల్ రహీమ్. మనం మరచిన మన హైదరాబాదీ దిగ్గజ కోచ్! 60 ఏండ్ల కింద ఆయన శిక్షణలో భారత జట్టు సాధించిన విజయాలే.. నేటికీ రికార్డులుగా కొనసాగుతున్నాయి. రహీమ్ అద్భుత శిక్షణకు తార్కాణంగా నిలుస్తున్నాయి.
క్రికెట్ మేనియాలో భారత్లో మరుగునపడ్డ ఫుట్బాల్కు రహీమ్ కోచ్గా వ్యవహరించిన కాలం (1950-63) స్వర్ణయుగమే! వినూత్న పద్ధతులు.. యువరక్తం మేళవించి, భారత ఫుట్బాల్ జట్టును సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లారు రహీమ్ సాబ్. 17 ఆగస్ట్ 1909లో హైదరాబాద్లో జన్మించారు రహీమ్. చిన్నప్పటి నుంచే ఫుట్ బాల్ను ప్రాణంకన్నా మిన్నగా ఇష్టపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువు తర్వాత కొన్నాళ్లు టీచర్గా పనిచేశారు. 1950లో హైదరాబాద్ పోలీస్ సాకర్ జట్టుకు కోచ్గా బాధ్యతలు చేపట్టారు. మెరికల్లాంటి ఆటగాళ్లను తయారు చేసి.. జట్టుకు అద్భుత విజయాలను అందించారు. ఇదే సమయంలో భారత జట్టుకూ కోచ్గా వ్యవహరించారు. మరణించేంత వరకూ అదే పదవిలో కొనసాగారు. ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలే కాదు, 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో సెమీస్ బెర్త్.. భారత ఫుట్బాల్ చరిత్రలో మరువలేని ఘట్టాలు. ఇదంతా రహీమ్ కఠోర శిక్షణలో రాటుదేలిన జట్లతోనే సాధ్యమైంది.
మైదానంలో ఆటగాళ్లకోసం విభిన్న వ్యూహాలు రచించేవారు రహీమ్. ఆ కాలంలో దిగ్గజ జట్లు అనుసరించే ‘డ్రిబ్లింగ్’ పద్ధతిని పక్కనపెట్టి.. ‘వన్ టచ్’ శైలిని తీసుకొచ్చారు మన హైదరాబాదీ కోచ్. అంటే, బంతిని ఆటగాళ్ల వద్ద ఎక్కువ సేపు ఉంచుకోకుండా.. చకచకా ఇతర ప్లేయర్లకు పాస్లు ఇవ్వడం ‘వన్ టచ్’ ప్రత్యేకత. సంప్రదాయక 2 – 3 – 5 ఫార్మాట్ను పక్కనపెట్టి, 4 – 2 – 4 కాంబినేషన్ను తీసుకువచ్చారు. ఈ నిర్ణయం.. భారత ఫుట్బాల్లో విప్లవాత్మక మార్పు. ఇదే పద్ధతిని అనుసరించి 1958, 1962 వరల్డ్ కప్లలో బ్రెజిల్ జట్టు విశ్వవిజేతగా నిలవడం విశేషం!
ఎవరి ఒత్తిడినీ లెక్కచేయక, అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంలో రహీమ్ దిట్ట. 1952 ఒలింపిక్స్ పరాజయం అనంతరం జట్టు కూర్పును అమాంతం మార్చేశారు. యువరక్తాన్ని మేళవించి.. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో సంచలనం సృష్టించారు. క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు విఖ్యాత మెల్బోర్న్ మైదానంలో ఆతిథ్య ఆస్ట్రేలియాపై 4 – 2 తేడాతో జయభేరి మోగించడం.. భారత ఫుట్బాల్ చరిత్రలో ఇప్పటికీ రికార్డే!
పీకే బెనర్జీ, పీటర్ తంగరాజ్, జర్నైల్ సింగ్, అరుణ్ ఘోష్, కెంపయ్య లాంటి తురుపు ముక్కలు రహీమ్ శిక్షణలోనే రాటుదేలారు. ‘రహీమ్ టీమ్’గా 1962
ఆసియాకప్లో బరిలోకి దిగిన వీరంతా.. తమ గురువుకు ఆఖరి బహుమానంగా, పసిడి పతకాన్ని సమర్పించుకున్నారు. లక్షమంది ప్రేక్షక సందోహం ప్రత్యర్థి దక్షిణ కొరియాకే మద్దతిస్తున్నా.. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు జయకేతనం ఎగరవేసింది.
భారత ఆధునిక ఫుట్బాల్ నిర్మాత.. దేశంలో ఆటను కొత్తపుంతలు తొక్కించిన రహీమ్ను భారత ప్రభుత్వమూ విస్మరించింది. ఫలితంగా ఆయన ఘనతకు తగిన గుర్తింపు దక్కలేదు. ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఏటా అత్యుత్తమ కోచ్కు ఇచ్చే అవార్డును ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ పేరిటే ప్రదానం చేస్తుండటం విశేషం! సాకర్కే జీవితాన్ని ధారబోసిన రహీమ్.. క్యాన్సర్తో జూన్ 11, 1963న మృతిచెందారు. దిగ్గజ కోచ్ రహీమ్ జీవితంలోని ఎత్తుపల్లాలు.. కోచ్గా ఆయన ప్రస్థానం.. సాధించిన విజయాల ఆధారంగా బాలీవుడ్లో సినిమా రూపొందుతున్నది. అజయ్ దేవగణ్ హీరోగా నిర్మితమైన ‘మైదాన్’ చిత్రం.. విడుదలకు సిద్ధమైంది.
-మట్టపల్లి రమేష్