Panchangam | తెలంగాణా ఆవిర్భావ చక్రం ప్రకారంగా తేదీ 01-05-2024 నుంచి చంద్రలగ్నాత్తు ఏకాదశ స్థానములోకి గురువు ప్రవేశించడం మంచిది. అష్టమ శని సమస్యలు కలిగిస్తాడు. ఆవిర్భావ లగ్నరీత్యా శని ప్రభావం ప్రతికూలంగా ఉన్నది. పాలన గాడి తప్పుతుంది. ప్రజల అభీష్టాలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం అవుతుంది. పాలక పక్షంలో సఖ్యత లోపిస్తుంది. వర్షారంభంలో కుజ, శనుల కలయిక ఉండటం వల్ల.. విధాన పరమైన నిర్ణయాలు వికటించే ప్రమాదం ఉంది. ప్రచార ఆర్భాటాలే తప్ప.. ప్రజా సంక్షేమంపై పాలకులకు శ్రద్ధ తగ్గుతుంది. గురువు అనుగ్రహంతో.. అందరినీ కలుపుకొని పోవడం వల్ల పరిస్థితి కొంత చక్కబడొచ్చు. సకాలంలో వర్షాలు ముఖం చాటేయడంతో సాగు మందకొడిగా సాగుతుంది. దిగుబడి తగ్గుతుంది.
శ్రీ క్రోధి నామ సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి సోమవారం తేదీ 8-4-2024 రాత్రి 11-51 గంటలకు పాడ్యమి ప్రవేశిస్తున్నది. సంవత్సర ఆరంభం ధనుస్సు లగ్నంలో సంభవించినది. లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉండి లగ్నాన్ని వీక్షించడం శుభప్రదం. ఉభయ కేంద్రాధిపతి అయిన బుధుడు లగ్నాధిపతితో పంచమ స్థానంలో కలిసి ఉండటం మంచిది. వాణిజ్యపరంగా దేశం అభివృద్ధి చెందుతుంది. ఆర్థికస్థితి స్థిరంగా ఉంటుంది. తృతీయంలో కుజ, శనుల కలయిక, చతుర్థంలో రాహు, షష్ఠమ, అష్టమాధిపతులు కలిసి ఉండటం కొంత అస్థిరతను సూచిస్తుంది. దేశాన్ని కొన్ని సమస్యలు పీడిస్తాయి. పంచమ వ్యయాధిపతి శనితో కలిసి ఉండటం వల్ల రుణ భారం పెరుగుతుంది. కొన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ఏడాది మధ్యలో దేశంలో జ్వరాలు, ఈతి బాధలు ప్రబలే అవకాశాలు ఉన్నాయి.
శ్రీ క్రోధి నామ సంవత్సరం శుక్ల పంచమి శనివారం తేదీ 13-04-2024 రాత్రి 9-04 గంటలకు వృశ్చిక లగ్న సమయంలో రవి మేష రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జగల్లగ్నాధిపతి చతుర్థ కేంద్రంలో శనితో కలిసి ఉన్నాడు. ధన చతుర్థాధిపతి పంచమంలో రాజ్యాధిపతితో కూడి ఉన్నాడు. తృతీయ-చతర్థాధిపతి లగ్నాధిపతితో కలిసి స్వక్షేత్రంలో స్థితి పొందాడు. షష్ఠమ వ్యయాధిపతి రాహువుతో పంచమంలో, భాగ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు. ఈ సంవత్సరం మధ్యమం అని చెప్పాలి. ప్రజా రవాణాలో ఇబ్బందులు ఉంటాయి. ఇరుగు పొరుగు దేశాలతో సమస్యలు తలెత్తవచ్చు. వాణిజ్యం విస్తరిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వరదలు, ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటాయి.
ఈ సంవత్సరం తేదీ 23-04-2024 నుంచి 1-06-2024 వరకు రాహువు, కుజుల కలయిక వలన కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి ఛాయలు అలుముకుంటాయి. పంటలకు నష్టం వాటిల్లుతుంది. పాలకుల మధ్య కలహాలు పెరుగుతాయి.