ఏ పనైనా ఆచితూచి.. ఎంత చెయ్యాలో అంతే చెయ్యాలి. తొందరపడి దర్పాన్ని ప్రదర్శిస్తే.. ఎలాంటి ఉపయోగమూ ఉండదని సున్నితంగా హెచ్చరిస్తారు జానపదులు. ఇలాంటి అర్థాన్ని ఇచ్చే సామెత ‘ఊరికి చేసిన ఉపకారం.. శవానికి చేసిన సింగారం ఒక్కటే’. ఊరికోసం ఎంత మేలు చేసినా అది లెక్కలోకి రాదు. శవాన్ని ఎంత అందంగా అలంకరించినా ఉపయోగం ఉండదు. ఎలాంటి హోదా, అధికారం లేకపోయినా కొందరు ఊరికి చాలా ఉపకారం చేస్తుంటారు.
అయినా వారి కష్టానికి ఎలాంటి గుర్తింపూ ఉండదు. ఇక మనిషి బతికున్నప్పుడు సరిగ్గా చూసుకోని బిడ్డలు.. చనిపోయాక మాత్రం అయినవారి శవాలను నలుగురి మెప్పుకోసం అందంగా అలంకరిస్తుంటారు. మనిషి బతికి నప్పుడు లేని అలంకరణ చనిపోయాక మాత్రం ఎందుకు? ఎవరికి ఉపయోగం? అందుకే తల్లి దండ్రులు కళ్లముందు ఉన్నప్పుడే కంటికి రెప్పలా కాపాడుకోవాలి.