ఏ పనైనా చెయ్యాలని అనుకున్నప్పుడు.. తగిన సంసిద్ధత ఉండాల్సిందే. కాబట్టే, ‘కడిగిన మొకం తయారుగుంటే.. కనవడ్డదల్లా నోట్లె ఎయ్యొచ్చు’ అంటారు పెద్దలు. మనం సిద్ధంగా లేకపోతే.. ఆ అవకాశం మరొకర్ని వరిస్తుంది. ఆ ప్రయత్నంలో క్రమశిక్షణ కూడా అవసరం. ఇక ఉదయాన్నే లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, ముఖం కడుక్కొని తయారుగా ఉంటే.. అవకాశం రాగానే ఆకలి తీర్చుకోవచ్చు.
ఎవ్వరూ పాచినోటితో తినరు. ఒకవేళ తిన్నా.. ఒంటబట్టదు. అనారోగ్యకరం కూడా! ముఖం కడుక్కొని ఉంటే మాత్రం.. ఒకచోట కాకపోతే మరోచోట తినొచ్చు. సంసిద్ధంగా ఉంటేనే ఏ పనైనా చేయగలం. కొన్ని ప్రాంతాల్లో ‘కడిగిన మొకం తయారుగుంటే.. కలిగి ఉందల్లా నోట్లె ఎయ్యొచ్చు’ అనీ, మరికొన్ని చోట్ల ‘కడిగిన మొకం తయారుగుంటే.. కాలికి తగిలిందల్లా నోట్లె ఎయ్యొచ్చు’ అనీ అంటారు.