పండగలప్పుడు చాలామంది కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొంటారు. నిరుపేదలకు అంత స్తోమత ఉండదు. ఉన్నవాటితోనే వెళ్లదీయాల్సిన పరిస్థితి. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నివాసి గగన్ బిహారీ పైటాల్, ఆయన భార్య అన్నపూర్ణ మాత్రం పండగ ఆనందాన్ని పదిమందికీ పంచాలని అనుకున్నారు. ఆ దిశగా కృషి చేస్తున్నారు కూడా. గగన్ తపాలా శాఖలో ఉద్యోగం చేసి రిటైరయ్యాడు. జగన్నాథ రథయాత్ర, దసరా, దీపావళి లాంటి పండగలు, వేడుకలకు కొన్నిరోజులు ముందుగానే గగన్ దంపతులు బట్టలు, బూట్లు, బొమ్మలు, వంటపాత్రలు సేకరిస్తారు. పండగ సమయంలో అవసరమైనవారికి పంచుతారు. ఒడిశాలో గిరిజన జనాభా ఎక్కువ. వీళ్లు బయటి ప్రపంచంతో అంతగా కలవరు. పేదరికం, నిరక్షరాస్యత కూడా ఎక్కువే. అందుకే గగన్ దంపతులు అట్టడుగు సమాజానికి ఉపయోగపడే పని చేయాలని నిర్ణయించుకున్నారు.
‘పండగలు, ఉత్సవాల సందర్భంగా ప్రజలు స్వగ్రామాలకు తరలివస్తారు. మేం అక్కడ స్టాల్స్ ఏర్పాటుచేస్తాం. నిరుపేదలు వీటిలోంచి తమకు నచ్చినవాటిని తీసుకుపోవచ్చు’ అంటాడు గగన్. గిరిజన బాలలకు బొమ్మలు, బట్టలు ఇవ్వడానికి ఆయన అడవులు, కొండప్రాంతాల్లో పర్యటిస్తాడు. పండగలకు నెల రోజుల ముందే స్థానిక కాలనీలు, అపార్ట్మెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు సందర్శిస్తాడు. వాళ్లు ఉపయోగించని వస్తువులను విరాళంగా ఇవ్వమని అడుగుతాడు. అలా సేకరించిన వస్తువులను వ్యాన్లో భువనేశ్వర్లోని తన ఇంటికి తరలిస్తాడు. వీటిని దాచడానికి తమ చిన్న ఇంట్లోని ఓ గదిని గోదాములా వాడుకుంటున్నాడు. బట్టలను ఇతరులకు ఇవ్వడానికి ముందు అన్నపూర్ణ వాటిని శుభ్రంగా ఉతుకుతుంది. ఏవైనా చిరుగులు ఉంటే కుడుతుంది.
ఇస్త్రీ చేసి పంపకానికి సిద్ధంగా ఉంచుతుంది. ‘మాకు వచ్చే వస్తువులలో మంచివి ఉంటాయి, పాడైనవీ ఉంటాయి. పాత వాటికి మేం మరమ్మతులు చేస్తాం. వాటిని అందుకుంటున్నప్పుడు పేదల కండ్లలో ఓ విధమైన ఆనందం తళుక్కుమంటుంది” అంటూ తమ సేవ గురించి సంతృప్తిగా చెబుతాడు గగన్. ఉద్యోగంలో ఉన్నప్పుడు గగన్ తనకు తారసపడే అనాథల్ని తీసుకెళ్లి ఇంట్లో భోజనం పెట్టేవాడు. అలా ఓరోజు గగన్కు భువనేశ్వర్లోని వాణీ విహార్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఓ అభాగ్యురాలు ఎదురుపడింది. ఆమెకు భోజనం ఇప్పించాడు. కానీ, ఆమె చీర కావాలని కోరింది. దాంతో తన తల్లి చీర తీసుకొచ్చి ఇచ్చాడు. గగన్ సేవాభావానికి స్ఫూర్తి ఈ సంఘటనే. ఈ మహాకార్యంలో గగన్ దంపతులతోపాటు కొడుకు మృత్యుంజయ్, కోడలు అనితా నాయక్ భాగం అవుతారు.