సాంకేతికత.. మార్పు సంకేతం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది.నాలుగు ఉద్యోగాలు పోయినా, నలభైమందికి కొత్తగా ఉపాధి లభిస్తుంది. జీవితాలు మెరుగుపడతాయి. ఆ ఆలోచనలు మరిన్ని కొత్త ఆలోచనలకు స్ఫూర్తినిస్తాయి.
ఏటా డిసెంబర్లో అంతర్జాతీయ ఆంగ్ల పత్రిక ‘టైమ్’ ఆ ఏడాది సమాజాన్ని అపారంగా ప్రభావితం చేసిన ఆవిష్కరణల జాబితాను ప్రకటిస్తుంది. ఈసారి కూడా తాజా సంచికలో రెండొందల ఆవిష్కరణలను పరిచయం చేసింది. వీటిలో మన రోజువారీ జీవితాన్ని, పనిని, ఆలోచనలను మెరుగుపరిచేవే ఎక్కువ. త్వరలో 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న సందర్భంగా.. అందులోంచి ఓ ఇరవైనాలుగు ఆవిష్కరణల సంక్షిప్త పరిచయం.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏసర్ ‘ఈబీఐ’ పేరుతో మొట్టమొదటి ఎలక్ట్రిక్ సైకిల్ను అభివృద్ధి చేసింది. ఈ రెండు చక్రాల బండి ప్రత్యేకతలు అనేకం. మనం ఎక్కడైనా నిలిపి వెళ్తే దానంతట అదే లాక్ చేసుకుంటుంది. ఒకవేళ దొంగతనం జరిగినా.. దీనికి అనుసంధానంగా ఉండే జీపీఎస్ వ్యవస్థ ఇట్టే పట్టేస్తుంది. సైకిల్ ఎక్కడుందో తెలుసుకోవడం చిటికెలో పని. గ్రీజుతో కూడిన చైన్కు బదులుగా కార్బన్ బెల్ట్ వాడారు. దీని బ్యాటరీ స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్ చార్జర్గానూ పనికొస్తుంది. ప్రత్యేకంగా అమర్చిన సెన్సర్లు మనం పెడల్ తొక్కే బలాన్ని, వెళ్తున్న ప్రాంతం ఎత్తును అర్థం చేసుకుంటాయి. సాఫీగా సాగిపోవడానికి దానంతట అదే శక్తిని సర్దుబాటు చేసుకుంటుంది. గేర్లు లేకపోవడం ఓ ప్రత్యేకత.
వైద్యపరమైన, నైతికమైన పరిమితుల కారణంగా.. తల్లి గర్భంలో పిండం రూపొందుతున్న తొలివారాల్లో దాని అభివృద్ధి క్రమం గురించి కచ్చితంగా తెలుసుకోలేం. ఈ సవాలును అధిగమించడానికి.. ఇజ్రాయెల్కు చెందిన వైజ్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ జీవశాస్త్రవేత్త జాకబ్ హన్నా బృందం.. పిండం తొలిదశకు సంబంధించిన నైవ్ మూలకణాలను సేకరించి వాటిని ప్రత్యేకమైన రసాయనాలతో శుద్ధిచేసింది. వాటిని పిండాల్లో కనిపించే నాలుగు రకాల కణాలుగా మార్చింది. వీటిలో ఒక కణం వెంటనే మానవ పిండంగా రూపాన్ని సంతరించుకుందట. దాన్ని పరిశోధకులు 14 రోజులపాటు ఎదిగేందుకు వీలు కల్పించారు. ఈ ప్రక్రియ సంతాన సఫలత, గర్భం నిలవకపోవడం తదితర విషయాల గురించి తగినంత సమాచారం ఇచ్చిందట. ఇలాంటి పరిశోధన చేయడం ఇదే మొదటిసారి.
గృహాలంకరణలో ఎల్ఈడీ పట్టీ లైట్లు విడదీయరాని భాగమైపోయాయి. కానీ జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) రూపొందించిన సింక్ డైనమిక్ ఎఫెక్ట్స్ నియాన్ షేప్ స్మార్ట్ లైట్లు మాత్రం వీటికి భిన్నమైనవి. ఈ నియాన్ రోప్ లైట్లలో మైక్రోఫోన్లు అమర్చారు. దీంతో సంగీతానికి అనుగుణంగా ఈ లైట్లు స్పందిస్తాయి. దీనివల్ల లైట్ షో.. మరింత సందడిగా మారుతుంది. గదుల అలంకరణలో జీవం ఉట్టిపడుతుంది.
సినిమా తీయడానికి ఉపయోగించే అత్యాధునిక కెమెరా ఖరీదు లక్ష డాలర్ల (సుమారు కోటి రూపాయలు)కు పైగానే ఉంటుంది. దీనికి భిన్నంగా ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు గారెత్ ఎడ్వర్డ్స్ ఇటీవల విడుదల చేసిన సై-ఫై ఎపిక్ చిత్రం ‘ద క్రియేటర్’ను ప్రధానంగా సోనీ ఎఫ్ఎక్స్3 కెమెరాతో తీశాడు. దీని ఖరీదు 4,000 డాలర్ల లోపే. అయితేనేం, హై ఎండ్ కెమెరాకు నాణ్యతలో దీటుగా నిలుస్తుంది. ప్రేక్షకులు కూడా ఈ తేడాను పసిగట్టలేరు. ఎఫ్ఎక్స్3 కెమెరా తేలికగా, చేతిలో ఇమిడిపోయేలా ఉంటుంది. ఇక దీని శక్తి అంతా కాంతిని గ్రహించడంలోనే ఉంటుంది. ఈ లక్షణం కారణంగానే ఎడ్వర్డ్స్ రాత్రి వేళల్లో కూడా అదనపు వెలుతురు అవసరం లేకుండానే ‘ద క్రియేటర్’ చిత్రాన్ని మలచాడు. ‘ఇక మీరు వెన్నెలలో కూడా సినిమా తీయగలరు’ అని ఎఫ్ఎక్స్3 గురించి ఎడ్వర్డ్స్ కితాబిచ్చాడు.
కొవిడ్ తర్వాత ఆఫీసు పని ఇంటినుంచే రిమోట్గా జరుగుతున్నది. ఈ క్రమంలో మనం వాడే కంప్యూటర్ కూడా మార్పులు చేసుకుంటున్నది. లెనోవో యోగా బుక్ 9ఐ అలాంటి చేర్పులతో వచ్చిందే. దీని తయారీకి మూలం ఓ కాఫీ షాప్ కావడం గమనార్హం. మాట్లాడుకోవడానికి కాఫీ దుకాణానికి వచ్చినవాళ్లు తమ ల్యాప్టాప్లను రకరకాల భంగిమల్లో వాడాల్సి వచ్చేది. కీబోర్డ్ చిన్నగా ఉండటంతో ఆ పని ఇబ్బందిగా ఉండేదని ‘యోగా బుక్’ రూపశిల్పుల్లో ఒకరైన బ్రయాన్ లియోనార్డ్ అంటారు. ఇక 13.3 అంగుళాల కొలతతో రెండు తెరలు కలిగిన లెనోవో యోగా బుక్ను నాలుగు రకాలుగా వాడుకోవచ్చు. సంప్రదాయ పర్సనల్ కంప్యూటర్, ట్యాబ్, టెంట్ పొజిషన్, నిల్చున్నట్టుగా… ఇలా నాలుగు రకాలుగా సర్దుబాటు చేసుకోవచ్చు. పైగా ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఓఎల్ఈడీ రెండు తెరల ల్యాప్టాప్ కావడం విశేషం. ఒంటి చేత్తో రెండు తెరల మీద యాప్స్ను వాడుకో
గలగడం దీని ప్రత్యేకత.
శారీరక లోపాలు ఉన్నవాళ్లకు పళ్లు తోముకోవడం, నోరు శుభ్రం చేసుకోవడం కొంత కష్టమైన పనే. అంతేకాదు, దంతక్షయం 88 శాతం మందికి తీవ్ర సమస్యగా పరిణమించింది. 20 ఏండ్లకు పైగా దంత సంరక్షణ పరిశ్రమలో పని చేస్తున్న స్టీఫెన్ ముల్లర్ ఈ విషయాన్ని గుర్తించారు. పరిష్కారం కోసం తీవ్రంగా ఆలోచించారు. ఆయన స్విట్జర్లాండ్కు చెందిన దంతాల ఆరోగ్య సంబంధమైన కంపెనీ క్యూరా ప్రాక్స్లో మేనేజింగ్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో వైబ్రేటింగ్ బ్రష్లు దొరుకుతున్నాయి. కానీ, వీటివల్ల నోరు మూలమూలలా శుభ్రం చేసుకోవడం సాధ్యం కావడం లేదు. దీన్ని సవరించేందుకు క్యూరాప్రాక్స్ కొత్తగా సాంబా రొబోటిక్ టూత్బ్రష్ను తీసుకొచ్చింది. ఆంగ్లాక్షరం ‘యు’ ఆకారంలో ఉండే ఈ బ్రష్లో మొత్తం 12,900 మెత్తటి బ్రిసిల్స్ ఉంటాయి. ఇవి దంతాల మూలల్లోకి వెళ్లి నోటిని శుభ్రం చేస్తాయి. అలా నోటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి..
బ్యాటరీతో నడిచే షిఫ్ట్ రొబోటిక్ మూన్ వాకర్స్ మిమ్మల్ని మరింత వేగంగా, ఇంకొంత సులువుగా నగరమంతా తిప్పేస్తాయి. అలా అని ఇదేం స్కేటింగ్ కాదు. మన అవసరానికి అనుగుణంగా వేగాన్ని మార్చుకునేందుకు వీలున్న వాకర్లు. వీటిలోని సెన్సర్లు కృత్రిమమేధతో పనిచేస్తాయి. మెట్లు ఎక్కేటప్పుడు ఈ బూట్ల చక్రాలు వాటికవే లాక్ అయిపోతాయి. వీటి పనితనాన్ని అమెరికాలోని పిట్స్బర్గ్, బాల్టిమోర్, న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల్లో పరీక్షించారు. సాధారణ నడక కంటే 250 శాతం వేగంగా.. అంటే, గంటకు 7 మైళ్ల (సుమారుగా 11 కిలోమీటర్లు) స్పీడులో ప్రయాణించవచ్చు. అదీ ఏ మాత్రం అలసట లేకుండానే.
పిల్లలకు కూడా స్మార్ట్ఫోన్ హస్తభూషణం అయిపోయింది. ఇక తల్లిదండ్రులేమో తమ పిల్లలు ఏమైపోతారో అని భయపడుతూ ఉంటారు. టీనేజీ పిల్లలు, నవ యువత కోసం బార్క్ టెక్నాలజీస్ సంస్థ ఓ పరిష్కారంతో ముందుకొచ్చింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్తో పనిచేసే ఈ స్మార్ట్ఫోన్లు తల్లిదండ్రుల నిఘాలో ఉంటాయి. ఇందులోని అల్గారిథం పిల్లల ఫోన్లకు వచ్చే సామాజిక మాధ్యమాల పోస్టులు, ఇతర అవాంఛనీయమైన అంశాలను పర్యవేక్షిస్తుంది. మిగిలిన వాటిలా కాకుండా ‘మా సాఫ్ట్వేర్ పిల్లల ఫోన్లలోనే ఉన్నందువల్ల తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండొచ్చు’ అని భరోసా ఇస్తారు బార్క్ టెక్నాలజీస్ చీఫ్ పేరెంట్ అధికారి
టైటానియా జోర్డాన్.
రోజూ కొన్ని లక్షల మంది మధుమేహ రోగులు ఇంజెక్షన్ రూపంలో ఇన్సులిన్ తీసుకుంటారు. అయితే వీరికి డోసేజీ విషయంలో కచ్చితత్వం ఉండదు. పైగా సరిగ్గా సరైన మోతాదు అంటే కష్టం కూడా. కొంచెం అటూ ఇటుగా ఉంటుంది. బీటా బయోనిక్స్ సహ-వ్యవస్థాపకుడు ఎడ్ డామియానోకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఆయన కొడుకు డయాబెటిస్ పేషెంట్. సరైన సమయంలో, సరైన మోతాదులో ఇన్సులిన్ ఇవ్వడం డామియానోకు కష్టంగా ఉండేది. దీని స్ఫూర్తిగా 20 ఏండ్లపాటు శ్రమించి ఐలెట్ పేరుతో క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉండే ఓ పరికరాన్ని తయారుచేశాడు. దీన్ని రోగి శరీరానికి అమర్చి ఉన్న ట్యూబ్కు అనుసంధానం చేస్తారు. ఇది ప్రతి ఐదు నిమిషాలకు ఓసారి రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పరిశీలిస్తుంది. అవసరమైనప్పుడు తగిన మోతాదులో ఇన్సులిన్ను సూక్ష్మమైన డోసుల రూపంలో విడుదల చేస్తుంది. దీనికి గత మే నెలలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఆమోదం కూడా లభించింది. ఇటీవల మెడికేర్ అండ్ మెడికెయిడ్ అనుమతులు కూడా లభించాయి.
ప్రతి ముగ్గురిలో ఒక మహిళ తన జీవితకాలంలో ఏదో ఓ సందర్భంలో లైంగిక హింసను ఎదుర్కొంటుంది. షీస్ బర్డీ సంస్థ ఆ సవాలుకు జవాబు వెదికింది. ఈ కంపెనీ కీ చెయిన్ పరిమాణంలో వ్యక్తిగత భద్రత అలారం జోడించిన బర్డీ ప్లస్ను రూపొందించింది. దీనికి ఓ చిన్నపాటి బటన్ ఉంటుంది. నొక్కితే చాలు సైరన్ మోగుతుంది. అలా విపత్కర పరిస్థితుల్లో సాయం అందుకోవచ్చు.
జెలర్ఫీల్డ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో), సహ వ్యవస్థాపకుడు కార్నీలియస్ స్మిత్కు భారీ లక్ష్యాలే ఉన్నాయి. వాటిలో ‘భూమ్మీద ప్రతి ఒక్కరికీ పూర్తిగా రీసైకిల్ చేయగలిగే 3డీ ప్రింటెడ్ షూస్ అందించాలి’ అనేది ఒకటి. కొనుగోలు దారులు తమ పాదం సైజును స్మార్ట్ఫోన్తో స్కాన్ చేసి జెలర్ఫీల్డ్ సంస్థకు పంపితే చాలు. దీని ఆధారంగా మన పాదాల సైజును బేరీజు వేసి.. షూస్ తయారు చేసిస్తారు. ప్రస్తుతం వీరిదగ్గర 200 3డీ ప్రింటర్స్ ఉన్నాయి. ఈ షూస్ థర్మోప్లాస్టిక్ పాలియూర్థేన్ అనే మెటీరియల్తో తయారవుతాయి. దీని రీసైక్లింగ్ సులువు. మన అవసరం తీరిపోయాక ఆ పాత షూస్ను జెలర్ఫీల్డ్కు తిరిగి పంపించాలి. వాటిని మళ్లీ కొత్తవాటిగా రూపొందిస్తారు.
వర్షాకాలంలో జాగింగ్కో, ఆఫీసుకో బయల్దేరుతున్నప్పుడు.. చినుకులబారిన పడకుండా ఉండటానికి రెయిన్ కోట్ (జాకెట్) ఓ పరిష్కారం. అయితే, వీటివల్ల గాలి ఆడదు. విపరీతంగా చెమట పడుతుంది. ఈ ఇబ్బందిని నివారించడానికి స్పోర్ట్స్ యాక్సెసరీస్ సంస్థ నైకి ఓ కొత్త తరహా జాకెట్ను అందుబాటులోకి తెచ్చింది. వానలో, జాగింగ్ సమయంలో శరీరం చెమట పట్టగానే దీనిలోని చిన్నచిన్న వెంట్స్ వెంటనే గుర్తిస్తాయి. వాటంతట అవే తెరుచుకుంటాయి. శరీరం చల్లబడగానే మూసుకుపోతాయి. జాకెట్ ఫ్యాబ్రిక్లో మీ ఒంటి తేమకు అనుగుణంగా ప్రతిస్పందించే ఫిల్మ్ ఉండటమే దీనికి కారణం. మన శరీరం పరిసరాలకు అనుగుణంగా ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసుకున్నట్టుగానే ఇదీ వ్యవహరిస్తుంది. ప్రస్తుతం స్త్రీల కోసం ఈ జాకెట్లు మార్కెట్లోకి వచ్చాయి. త్వరలోనే పురుషుల వేరియంట్లు కూడా దొరుకుతాయి.
కలుషితమైన నీళ్లు తాగడం వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా పదిలక్షల మందికి పైగానే మరణిస్తున్నారు. ముఖ్యంగా కల్లోల ప్రాంతాల్లో, వరదలు, భూకంపాలు లాంటి ప్రకృతి విపత్తులు సంభవించే ప్రాంతాల్లో కలుషిత జలం కారణంగా చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. దీన్ని నివారించడానికి లైఫ్స్ట్రా సంస్థ నడుం బిగించింది. నీళ్లలోని బ్యాక్టీరియా, వైరస్, ఇతర పరాన్నజీవులను సమూలంగా నాశనం చేసే ఓ పరికరాన్ని రూపొందించింది. సుమారు 16 పౌండ్ల బరువుండే ఈ యంత్రాన్ని ఇండ్లలో నీటి సరఫరా వ్యవస్థకు అమర్చుకోవాలి. ఇందులోని హాలో ఫైబర్ ఫిల్టర్లు గంటకు 160 లీటర్ల నీటిని వడపోస్తాయి. 20 నానోమీటర్ల కంటే పెద్దవైన కణాలను ఈ ఫిల్టర్లు అడ్డుకుంటాయి. ‘శరణార్థి శిబిరాలు, వరదలు, కార్చిచ్చులు ఎక్కువగా ఉన్నచోట నీళ్లను తేలికగా శుద్ధి చేసే పరికరాన్ని తయారు చేయాలనుకున్నాం. అనుకున్నట్టు విజయం సాధించాం’ అంటాడు లైఫ్స్ట్రా చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ టారా లుండీ.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2020లో ఆంత్రప్రెన్యూర్ల కోసం ఓ కార్యక్రమం నిర్వహించింది. ఆ శిబిరానికి హాజరైన ఎర్ల్ కోల్, బ్రయాన్ యెన్నీ ఓ కొత్తరకం మిశ్రమ లోహం (అలాయ్) నిటినాల్ గురించి తెలుసుకున్నారు. చంద్రుడి మీద, అంగారకుడి మీద రోవర్లు తిరగడానికి నాసా ఈ లోహంతో తయారైన చక్రాలనే ఉపయోగించింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని కోల్, యెన్నీ గాలి అవసరం లేని సైకిల్ చక్రాలను అభివృద్ధిచేశారు. ఇద్దరూ కలిసి స్మార్ట్ టైర్ కోను స్థాపించారు. దీనికి కోల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో). యెన్నీ ముఖ్య సాంకేతిక అధికారి (సీటీవో). ఈ చక్రం తయారీలో ఉపయోగించిన ప్రధాన లోహం పేరు.. నిటినాల్. వచ్చే సంవత్సరం అందుబాటులోకి రానున్న ఈ చక్రం.. మార్కెట్ను గిరగిరా తిప్పడం ఖాయం. ‘ఎప్పటికీ పంక్చర్ కాదు. మీ సైకిల్ జీవితకాలమంతా తిరుగుతూనే ఉంటుంది’ అంటాడు కోల్. అయితే, చక్రం బయటి భాగంలో ఉండే రబ్బర్ తొడుగును మాత్రం అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి.
ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకున్న వారికి నడక నరకప్రాయం. కృత్రిమపాదాలు అందుబాటులో ఉన్నా వాటితో మెట్లెక్కడం అసాధ్యం. అచ్చంగా కాలినే పోలిన కృత్రిమపాదాలు ఇప్పటివరకు సైన్స్ కాల్పనిక రచనలు, సినిమాల్లో మాత్రమే కనిపిస్తాయి. అయితే, అమెరికాలోని ఉటా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఓ మంచి కృత్రిమ పాదాన్ని సాకారం చేశారు. అసిస్టెంట్ సర్ టోమసో లెంజీ బృందం అచ్చం సహజమైన కాలును పోలి ఉండే బయోనిక్ కృత్రిమ పాదాన్ని అభివృద్ధి చేసింది. దీనితో నడవడంతోపాటు మెట్లు కూడా సులువుగా ఎక్కేయవచ్చు. ఈ బయోనిక్ పాదం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదానికి ఎదురుచూస్తున్నది. లెంజీ బృందం ఒట్టోబాక్ అనే కృత్రిమ అవయవాల సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ‘ఈ పాదాల సాయంతో మరింత మంది వీల్చెయిర్ల నుంచి లేచి నడుస్తారు. సులభంగా
మెట్లెక్కుతారు’ అని భరోసా ఇస్తాడు లెంజీ.
డ్రైవర్ల అవసరం లేని వాహనాలు సాకారం అవుతున్నాయి. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అనుబంధ సంస్థ జూక్స్ ఈ దిశగా ఓ ముందడుగు వేసింది. డ్రైవర్తో పనిలేని స్వయం చోదక వాహనాన్ని అభివృద్ధి చేసింది. డ్రైవర్ అవసరం లేదు కాబట్టి, స్టీరింగ్ వీల్, డ్రైవర్ సీటు లాంటివి లేకుండానే తిరుగుతుంది. అమెరికాలోని లాస్ వెగాస్, ఫోస్టర్ సిటీ నగరాల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ తరహా వాహనాన్ని జూక్స్ ఉద్యోగులను కూర్చోబెట్టి పరీక్షించారు. రోడ్ల మీద ఎదురయ్యే అన్ని రకాల పరిస్థితులను ఈ వెహికిల్ తట్టుకోగలదు. ఎక్కడైనా గందరగోళం తలెత్తితే.. మనుషుల సాయం తీసుకుంటుంది. సమీప భవిష్యత్తులో ఈ స్వయం చోదక వాహన
సౌకర్యాన్ని లాస్వెగాస్, శాన్ఫ్రాన్సిస్కో నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జూక్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
డాక్టర్ పాల్ క్లేటన్ అనే వైద్యుడు 62 ఏండ్ల మహిళకు కార్టిలేజ్ పునర్నిర్మాణం కోసం స్వల్పస్థాయి లేజర్ చికిత్స చేస్తున్నారు. ఆ సమయంలో ఆమె కాలి చర్మం నవ యవ్వనంగా కనిపించింది. ఇదే ఆయనకు చేతిలోపట్టే లేజర్ గన్ తయారీకి ప్రేరణను ఇచ్చింది. ఈ లేజర్ గన్ను ఇంట్లోనే చర్మ సమస్యల చికిత్సకు ఉపయోగించుకోవచ్చు. రోజుకు ఓ పావుగంట దీన్ని ఉపయోగిస్తే ముఖం మీదున్న మచ్చలు, ఎర్రటి మొటిమలు (రోజాసియా), ముడతలు మటుమాయం అయిపోతాయి. ఈ లేజర్ గన్ను లైమా సంస్థ మార్కెట్లోకి తీసుకువచ్చింది. “500 మిల్లీవాట్ల లేజర్ మీ చర్మం మరింత కొలాజెన్ను ఉత్పత్తిచేసేలా చూస్తుంది” అంటారు లైమా వ్యవస్థాపకుడు లూసీ గాఫ్. ఈ లేజర్ గన్ మెడికల్ గ్రేడ్ ప్లాస్టిక్ తొడుగులో ఇమిడి ఉంటుంది. ఇంట్లో వాడుకునేందుకు వీలుగా ఉండే ఈ పరికరానికి అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిష్ర్టేషన్ ఆమోదం లభించింది.
నిమ్మ, బత్తాయి, నారింజ పండ్ల నుంచి పూర్తిగా రసం తీయడం కొంత కష్టమైన పనే. దీన్ని దృష్టిలో ఉంచుకుని నిమ్మ జాతి పండ్లనుంచి మొత్తంగా రసం పిండటానికి ప్రముఖ కిచెన్ వేర్ సంస్థ డ్రీమ్ఫార్మ్ సరికొత్త డిజైన్తో ‘ఫ్లూసర్’ను తీసుకువచ్చింది. నిమ్మజాతి పండ్లను ఇందులో సగం చేసి ఉంచాలి. పండు లోపలినుంచి, బయటినుంచి ఒత్తిడి పడటంతో మామూలు స్కీజర్లతో పోలిస్తే రసం ఎక్కువగా తీసుకోవచ్చు. దీని హ్యాండిల్స్ పొడుగ్గా ఉంటాయి. దీంతో చేతుల బలం కూడా ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. పైగా గింజలను వేరుచేసి, రసాన్ని మాత్రమే పాత్రలోకి పంపుతుందీ ఫ్లూసర్. దీన్ని సులువుగా శుభ్రం చేసుకోవచ్చు కూడా.
వృద్ధుల నడకకు చేతికర్ర అత్యవసరం. ఎంత ఊతకర్ర ఉన్నా.. బాత్రూమ్లోనో, మరో చోట ప్రమాదవశాత్తు కిందపడిపోయి దెబ్బలు తగిలించుకుంటూనే ఉన్నారు. దవాఖానలకు లక్షలకు లక్షలు చెల్లించుకుంటూనే ఉన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా కెన్ గో సంస్థ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే స్మార్ట్ ఊతకర్రలను పెద్దల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరికరం కిందపడుతున్నప్పుడు హెచ్చరిస్తుంది. దీనికి జీపీఎస్ అనుసంధానం, ఫ్లాష్లైట్, ఎమర్జెన్సీ కాలింగ్ లాంటి సదుపాయాలూ ఉన్నాయి. “చాలామంది పెద్దలు కొత్త సాంకేతికతకు అంత సులువుగా అలవాటు పడిపోరు. అందుకే వారు తప్పనిసరిగా ఉపయోగించే పరికరాల్లోనే టెక్నాలజీని చొప్పించాలని నిర్ణయించుకున్నాం” అంటారు కెన్ వ్యవస్థాపకుడు, సీఈవో అహ్మద్ అల్ఘాజీ.
ఎంకే – వీ ట్రాక్టర్ ప్రపంచంలోనే పూర్తిగా విద్యుత్తో నడిచే తొలి ట్రాక్టర్. పైగా ఇది ఆటోమేటిక్గా.. తనంతట తానే నడుస్తుంది. డ్రైవర్ అవసరం ఉండదు. అలా రైతుల జీవితాలను మరింత సులువు చేస్తుంది. పైగా సురక్షితమైనది. పర్యావరణ కాలుష్యం కూడా ఉండదు కాబట్టి, సుస్థిరమైంది, మరింత లాభదాయకమైంది. దీన్ని మోనార్క్ ట్రాక్టర్ కంపెనీ అభివృద్ధి చేసింది. కాలిఫోర్నియాలో ఈ విద్యుత్ ట్రాక్టర్ను విజయవంతంగా పరీక్షించి చూశారు. దీనివల్ల కోతలు, దుక్కి దున్నడం, కలుపుతీయడంలో ఒక ఏడాదికి కేవలం ఇంధనం రూపంలోనే 79,000 డాలర్లు ఆదా అవుతాయట. కూలీల ఖర్చులు తగ్గడంతో మరో 1,20,000 డాలర్లు మిగులుతాయట. ‘ట్రాక్టర్ వాడకాన్ని సులభతరం చేయడం, రైతుల పని భారాన్ని తగ్గించడం’ తమ లక్ష్యమని ఆ సంస్థ సహ-వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి ప్రవీణ్ పెన్మెత్స పేర్కొన్నారు.
మూత్ర పరీక్ష ద్వారా గర్భ ధారణను నిర్ణయించడం వేల సంవత్సరాల నాటి విధానం. అయితే, బయోటెక్ కంపెనీ సాలి గ్నాస్టిక్స్ లాలాజలం (ఉమ్మి) ఆధారంగా గర్భ నిర్ధారణ చేసే సాలిస్టిక్ అనే పరికరాన్ని అభివృద్ధి చేసింది. ప్రపంచంలో ఇదే మొదటిది. ఈ పరికరం లాలాజలంలో బీటా హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రాపిన్ హార్మోన్ను 10 నిమిషాల్లో, 95 శాతం కచ్చితత్వంతో పరీక్షిస్తుంది. గర్భ నిర్ధారణ చేసేది ఈ హార్మోన్ పరీక్షతోనే. ‘లాలాజలంలో నిగూఢ సమాచారం చాలానే ఉంది’ అంటారు సాలిగ్నాస్టిక్స్ సహవ్యవస్థాపకుడు, డిప్యూటీ సీఈవో, ముఖ్య వ్యాపార అభివృద్ధి అధికారి గయ్ క్రీఫ్. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం లభించాల్సి ఉంది. అయినప్పటికీ ఇది యునైటెడ్ కింగ్డమ్లో ఈ ఏడాదే అందుబాటులోకి వచ్చింది. మొదటి రెండు నెలల్లోనే 20,000 యూనిట్లకుపైగా అమ్ముడైంది.
మెటాకు చెందిన ఎం4టీ ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మాడల్ సాఫ్ట్వేర్ 100 భాషలను అర్థం చేసుకుంటుంది. అది మాటల రూపంలోనైనా, రాత రూపంలోనైనా. అంతేకాదు, ఇప్పటివరకూ ఉన్న ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్లలో కృత్రిమత్వం ఎక్కువ. పొరపాట్లకు ఆస్కారమూ అధికమే. ఎం4టీతో ఆ ఇబ్బంది లేదు. మెటా దీనిని అందరికీ అందుబాటులో ఉంచడం విశేషం. ఈ కోడ్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.
నవమాసాలు మోసి శిశువుకు జన్మనిచ్చాక తల్లి ఒక రకమైన కుంగుబాటుకు లోనవుతుంది. బాధ, భయం, అలసట ఆమెను ఆవరిస్తాయి. దీన్నే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. ఇది తల్లి, పిల్లల మధ్య బంధం ఏర్పడకుండా అడ్డుకుంటుంది. ఈ సమస్యకు విరుగుడుగా జురానొలోన్ లేదా జుర్జువే అనే మాత్ర అందుబాటులోకి వచ్చింది. దీనికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం కూడా లభించింది. శిశువు జన్మించిన తర్వాత 14 రోజులపాటు తల్లి ఈ మాత్రను రోజూ వేసుకోవాలి. సేజ్ థెరాపెటిక్స్ అండ్ బయోజెన్ తయారుచేసిన ఈ బిళ్ల మూడు రోజుల్లోనే తల్లి మూడ్ను మెరుగుపరుస్తుంది. తల్లీ బిడ్డల అనుబంధాన్ని బలోపేతం చేస్తుంది.
భారతదేశం, ఆఫ్రికా ఖండాల్లో ఏనుగులు, పులులు అంతరించే దశకు చేరుకోవడానికి ప్రధాన కారణం వేట. అభయారణ్యాల్లోనూ వన్యమృగాలను రక్షించుకోవడం కష్టంగా మారింది. మూగజీవాల్ని పరిరక్షించే దిశగా అమెరికాకు చెందిన పర్యావరణ సంస్థ రిజాల్వ్ ‘ట్రెయిల్గార్డ్ ఏఐ’ అనే పరికరాన్ని అభివృద్ధి చేసింది. దీనికి చిన్నచిన్న కెమెరాలు ఉంటాయి. దీనిసాయంతో అంతరించిపోతున్న జీవజాతుల కదలికల్ని, వేటగాళ్ల కుట్రల్ని పర్యవేక్షించడం సులభం అవుతుంది. ఇది సెల్ఫోన్, లాంగ్ రేంజ్ రేడియో సిగ్నల్స్ను ఉపయోగించుకుంటుంది. ఏ జంతువుకైనా అపాయం ఏర్పడితే 30 సెకండ్లలోనే సంబంధిత అధికారులకు సమాచారం చేరవేస్తుంది. ట్రెయిల్గార్డ్ ఏఐని జంతువులకే కాదు మనుషుల కోసమూ వాడుకోవచ్చు. తూర్పు ఆఫ్రికాలో ఇప్పటికే 30 మందికి పైగా వేటగాళ్ల ఆటకట్టించారు. పులులు ఎక్కువగా ఉండే మధ్య భారతదేశంలో వీటి వాడకానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.