గాంధీజీ చరిత్రను బాగా అధ్యయనం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఆయన కేవలం స్వాతంత్య్ర సముపార్జనకు దోహదం చేశారని మాత్రమే చాలామంది భావన. అది సరికాదు. అహింసా పోరాటం, స్వాతంత్య్ర సాధన బాపూజీకి తాను నిర్వహించదల్చిన కొండంత లక్ష్యంలో గోరంత భాగాలే. సమాజోద్ధరణకు, వ్యక్తి ఉన్నతికి అహరహం కృషి చేశారాయన. దేశ నవ నిర్మాణం వైపు ఆలోచించారు. అదే సమయంలో సగటు భారతీయుడి వ్యక్తిత్వం బహుముఖీనంగా విస్తరించడానికి ప్రణాళికలు రచించారు. బాపూజీని పాశ్చాత్యులు అర్థం చేసుకున్నట్టు భారతీయులు అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. సగటు మనిషి వ్యక్తిత్వ వికాసం వైపు ఆయన వేసిన అడుగులు చాలామంది గుర్తించనే లేదు. ఆయనది ఒక రాష్ర్టానికో, ఒక దేశానికో, ఒక మతానికో లేదా ఒక కులానికో పరిమితమైన లక్ష్యం కాదు. విశ్వ మానవుడి లక్ష్యం. ప్రకృతి వనరులు సమృద్ధిగా ఉన్న మనదేశంలో అందరికీ పని ఉండాలంటే, అందరి కడుపులు నిండాలంటే యాంత్రీకరణకు కొద్దిగా దూరంగా ఉండాలని భావించారు. అంతేతప్ప యాంత్రీకరణకు ఆయన పూర్తి వ్యతిరేకం కాదు. ఇవాళ ఆర్బిట్రేషన్ సెంటర్లు కావాలని ప్రధాన న్యాయమూర్తి ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో, ఈ విషయాన్ని గాంధీ వందేళ్ల క్రితమే చెప్పిన సంగతి మనం మర్చిపోకూడదు. దీన్నిబట్టి ఆయన ఎంత దీర్ఘదర్శి అనేది అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే కాటా చంద్రహాస్ రచన ‘మహాత్మా గాంధీ – సమగ్ర జీవిత కథ’ చదవాల్సిందే! ఇందులోని అక్షరాక్షరంలో గాంధీజీ ఆత్మ ప్రతిబింబించడం రచయిత ప్రతిభకు నిదర్శనం!
మహాత్మా గాంధీ – సమగ్ర జీవిత కథ
కాటా చంద్రహాస్
పేజీలు 514; వెల : రూ. 299/-
ప్రతులకు: CLS పబ్లిషర్స్ LLP,
రోడ్ నం. 7, బంజారా హిల్స్
ఫోన్: 91 63039 93642, 80084 49678