శబ్దం (కథలు)
రచన: యం. రమేష్ కుమార్
పేజీలు: 152
వెల: రూ. 150
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
ప్రతులకు: ఫోన్: 85588 99478
కథా వస్తువులో, కథ చెప్పే విధానంలో కొత్తదనాన్ని ప్రదర్శిస్తూ మాన్యం రమేష్ కుమార్ వెలువరించిన కథా సంకలనం ‘శబ్దం’. వయసుతోపాటే వినికిడి శక్తి క్షీణించిపోయిన ఓ పెద్దమనిషి తన కోడలిని అపార్థం చేసుకుంటాడు. చివరికి తన చెవుడు చికిత్సకు ఆమెనే నగలు అమ్మి డబ్బు సర్దుబాటు చేసిందని తెలుసుకుని, తనకు వినికిడి శక్తి అవసరం లేదనే నిర్ణయానికి వచ్చే ఇతివృత్తంతో ‘శబ్దం’ కథ సాగుతుంది. చీమలను చూసిన కథకుడు వాటితో, వాటిలా మారిపోయి సంభాషిస్తూ ఆసక్తికరంగా సాగే ‘చీమ’, భార్యాభర్తల మధ్య అపోహలతో విడాకుల దాకా వెళ్లి, మళ్లీ మంచి మనసుతో ఒకరినొకరు అర్థం చేసుకోవాలనే సందేశాన్ని ఇచ్చే ‘అతడు ఆమె, ఇతడు ఈమె’, నలభీమపాకం చేసే వంటల మామయ్యకు నచ్చిన వంటకం ఏదో అన్వేషించే ‘మావయ్యకు నచ్చిన భోజనం’, చెట్టు మట్టి మనిషి అనుబంధాన్ని ఆవిష్కరించే ‘అతను బాదం చెట్టు’, ‘పొగడపూల చెట్టు’ కథలు రచయిత సృజనాత్మక శక్తికి నిదర్శనంగా నిలుస్తాయి. ఇక మనం మాత్రమే బుద్ధిజీవులం అనుకుని, ప్రపంచ సంక్షేమం నెపంతో భూమిని, తోటి జీవరాశిని విధ్వంసానికి గురిచేస్తున్నాం. మరి ఒకవేళ మనకంటే ఎన్నోరెట్ల బుద్ధిజీవులైన గ్రహాంతరవాసులు మనల్ని కూడా వినాశనం చేయాలనుకుంటే ఎలా ఉంటుందనే నేపథ్యంతో సాగిన సైన్సు కాల్పనిక కథ ‘బుద్ధిజీవులు’ సహా ‘శబ్దం’ సంకలనంలోని ప్రతి కథా పాఠకుల్ని ఆపకుండా చదివించే సామర్థ్యం ఉన్నదే.
– చింతలపల్లి హర్షవర్ధన్