చంద్రహాసం
రచన: చంద్రప్రతాప్ కంతేటి
పేజీలు: 173, వెల: రూ.150
ప్రతులకు: 93900 85292, 80081 43507
చంద్రహాసమో, సూర్యహాసమో ముందు మనకు వస్తుంది మందహాసం. ఆ వెనక అవుతుందది అట్టహాసం. ‘ఇంతకన్నా, చచ్చి సురలోకాన ఉన్న మా తాతయ్య నయం, నేరుగా తిట్టేవాడు. తిడుతున్నాడని అర్థమై చచ్చేది వినబడనంత దూరం పారిపోయేవాళ్లం. కానీ ఇక్కడ అలా కాదు… ఈయనెక్కడ దొరికాడురా బాబూ! తెగ జోకులేస్తున్నాడని నవ్వుకుంటూ నుంచుంటే, ఉండుండి ఠక్కున మెదళ్లో మేకులు దిగ్గొట్టేస్తాడు ఈ రచయిత ఆక్యుపంచర్ చికిత్స టైపులో!’ ఇదండీ ఈ ‘నవ్వుల పువ్వుల చంద్రహాసం’ కథ! నలభై అయిదు వెన్నెల కిరణాలు ఉన్నాయి ఈ సంపుటిలో. మూఢాచారాలు, మితిమీరిన చాదస్తాలు మొదలుకొని, రాజకీయాలలోని అరాచకీయాలు, టీవీ సీరియల్స్ మీద జరిగే రియల్ జగడాలు, చుట్టాలై వచ్చి దయ్యాలై, ధైర్యం పేరుతో భయపెట్టి చంపే అసందర్భ ప్రలాపుల విన్యాసాలూ, ప్రజల వద్దకే పాలన టైపులో, అస్మదీయుల అస్తవ్యస్త రచనల దాడులకు గురై, సదరు రాతలను అచ్చొత్తలేక మానుకోలేక, ‘తలరాత’ను నిందించుకునే పత్రికా సంపాదకుల పాట్లూ, ఇంకా ఇలా ఎన్నో సమాజ వ్యాప్తంగా ఉన్న సమకాలీన రుగ్మతలనీ, జాడ్యాలని సున్నితంగా ఎత్తిచూపుతూ, ఝాడించాల్సిందంతా ఝాడించేసి ‘ఎబ్బే, నేనేమన్నానండీ! ఊరికే, నవ్వులాటకి చెప్పానంతే!’ అనేసి తప్పుకొనే గడసరి చంద్రప్రతాప్. రచయితగా, సంపాద కుడిగా ఎంతో అనుభవం ఉన్న చంద్రప్రతాప్ ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ముగించాలో స్పష్టంగా తెలిసిన వ్యక్తి. కాబట్టి, ప్రతి పదంలోనూ హాస్యవ్యంగ్యాలు తొణికిసలాడాయి. హాస్య ప్రియులంతా చదవాల్సిన పుస్తకం ఇది.
కాశీయాత్ర దిక్సూచి
ముక్తి క్షేత్రం
రచన: రమా శాండిల్య
పేజీలు: 120, వెల: రూ.150
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్,కాచిగూడ.
జన్మాంతర యోగం ఉంటే గానీ, కాశీలో అడుగుపెట్టలేం. ఇలా అనుకోగానే అలా వారణాసికి అందరూ వెళ్లలేరు. కాలం కలిసొచ్చి కాశీలో అడుగుపెట్టినా.. ఆ పవిత్ర క్షేత్రాన్ని దర్శించడానికి రోజులు సరిపోవు. వారాలు చాలవు. నెలలు గడిచినా.. వాడవాడలూ కలియ తిరిగినా.. గుళ్లన్నీ చుట్టేసినా.. ఇంకా అంతుచిక్కని అద్భుతమేదో కాశికాపురిలో దాగుంది అనిపిస్తుంది. ఆ అద్భుతాలను ఏర్చికూర్చి ‘ముక్తిక్షేత్రం’ పుస్తకంగా అందించారు రచయిత్రి రమా శాండిల్య. వ్యక్తిగత అనుభవాలతో మొదలుపెట్టి, అడుగడుగున తనకు కలిగిన అనుభూతులను రంగరించి ట్రావెల్ గైడ్గా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు. కాశీలోని ఆలయాలు, గంగా తీరంలోని ఘాట్లు, పర్యాటక స్థలాల వివరాలన్నీ ఇందులో పొందుపరిచారు. వివిధ ఘాట్లకు ఆ పేరు ఎలా వచ్చింది, వాటి ప్రాశస్త్యాన్ని కూడా తెలియజేశారు. ద్వాదశాదిత్యులు, నవదుర్గల ఆలయాల ప్రాధాన్యాన్ని వివరించారు. ‘పంచకోసి’ ప్రాధాన్యాన్ని తాత్విక వ్యాసంగా అందించారు. అడుగడుగునా నిగూఢత్వాన్ని పొదుగుకున్న కాశీపురి వైభవాన్ని రూఢిగా పాఠకులకు అందించారు. వారణాసి యాత్రికులకు ఈ పుస్తకం దిక్సూచిగా ఉపయోగపడుతుంది.
బుక్ షెల్ఫ్
కోటిలింగాల
రచన: బసవరాజు ,నరేందర్ రావు
పేజీలు: 46, వెల: అమూల్యం
ఫోన్: 99085 16549
పోతరాజు (కథలు)
రచన: వై. సత్యనారాయణ
పేజీలు: 104; వెల: రూ. 100
ప్రతులకు: పాలపిట్ట బుక్స్
ఫోన్: 98487 87284
జన విలాపం (కరోనాలో కవిత్వం)
రచన: దేవులపల్లి
శ్యామ్ సుందర్ రావు
పేజీలు: 100; వెల: రూ. 100
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 90004 13413
రష్యా విప్లవంలో రైతాంగం
సేకరణ: కొండూరి వీరయ్య
పేజీలు: 72, వెల: రూ. 80
ఫోన్: 94900 99378, ప్రధాన పుస్తక కేంద్రాలు.
పద్య సఫారీ, పలుకు కచేరి
రచన: రామ్ డొక్కా, ఫణి డొక్కా
పేజీలు: 95, వెల: రూ. 200
ప్రతులకు: rdokka@gmail.com
ఎన్నెలమ్మ కతలు
రచన: లక్ష్మీ రాయవరపు
పేజీలు: 191, వెల: రూ. 150 ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 80963 10140
– పి.వి.ఆర్. శివకుమార్, 95949 96990