నలభై రెండేండ్ల నరేశ్ నౌటియాల్ ఒకప్పుడు రోజుకూలీ. ఆ పరిస్థితి నుంచి అతను బయటపడతాడని, ఎంతోమంది నిరుద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తాడని ఎవరూ అనుకోలేదు. కానీ తమ గ్రామ రైతులకు సహకార మార్కెట్ సదుపాయం కల్పించి స్థానికులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రకృతి సౌందర్యంతో అలరారే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లా నవగావ్.. నరేశ్ నౌటియాల్ పుట్టిన ఊరు. అతనిది రైతు కుటుంబం. చిన్నవయసులోనే ఇంటి పనులు, పొలం పనుల్లో తనూ ఓ చేయి వేసేవాడు. అయితే, నవగావ్లో వ్యవసాయం సంప్రదాయ పద్ధతుల్లో సాగుతుంది. దీంతో పంటల దిగుబడి చాలా తక్కువగా ఉండటంతో అందరిలానే నరేశ్ కుటుంబం కూడా ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేది.
వాళ్లు పండించిన వాణిజ్య పంటలకు సరైన ధర కూడా దొరికేది కాదు. తమ తలరాతలో మార్పు చదువుతోనే సాధ్యమవుతుందని నరేశ్ చిన్నతనంలోనే తెలుసుకున్నాడు. అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చదువు ఆపలేదు. ఓవైపు కూలీ పనులు చేస్తూనే మరోవైపు ట్యూషన్ ఫీజులు కట్టుకున్నాడు. అలా డిగ్రీ పూర్తిచేశాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. “2002లో ఓ ఎన్జీవోలో నాకు ఉద్యోగం దొరికింది. విరామం, విసుగూ లేకుండా అంకితభావంతో పనిచేశాను. 2009లో ఆ ఉద్యోగం వదిలిపెట్టాను. ఆ ఏడేండ్లలో నా జీతం దాదాపుగా మారలేదు. అలాంటి పరిస్థితులనూ నేను సానుకూల దృష్టితోనే చూశాను.
ఉత్తరాఖండ్ కొండప్రాంతాల పేద, మధ్య తరగతి రైతులు పొలం మొదలుకుని మార్కెట్ వరకు ఎక్కడికి వెళ్లినా అవకాశాలు దొరక్కపోవడాన్ని అప్పుడే అర్థం చేసుకున్నాను” అంటాడు నరేశ్. ఎన్జీవోలో పని చేస్తున్నప్పుడే నరేశ్ మార్కెట్ లోతుపాతులను ఆకళింపు చేసుకున్నాడు. దళారుల దోపిడి నుంచి రైతులకు విముక్తి ప్రసాదించాల్సిన అవసరం ఉందని తెలుసుకున్నాడు. ‘రుద్ర ఆగ్రో స్వాయత్ సహకారితా’ పేరుతో దాదాపు మూడువేల మంది రైతులను అనుసంధానం చేశాడు. వారి ఉత్పత్తులను నేరుగా నరేశ్ స్థాపించిన సహకార సంస్థకే అమ్ముతున్నారు. సరైన ధర లభించడంతో సంతృప్తిగా ఉంటున్నారు.
ఇలా పదిహేనేండ్ల నుంచి నరేశ్ రైతులతో సహకార వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పారదర్శకంగా వ్యవహరిస్తూ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్నాడు. దీంతో నవగావ్ రైతులను దళారులు దోచుకు తినే అధ్యాయానికి తెరపడింది. తమ ప్రాంతంలోని రవాయ్ లోయలో పండే ఎర్రవడ్లు, కాయధాన్యాలు, రాజ్మా, కూరగాయలు, వివిధ రకాలైన పండ్ల అమ్మకాల ద్వారా నరేశ్ ఏడాదికి దాదాపు 20 లక్షల రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. తన నాయకత్వ నైపుణ్యాలతో స్థానికులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. డిగ్రీలు చదివినా ఉద్యోగం రాలేదని నిరాశలో కూరుకుపోయే యువతరానికి మార్గదర్శకులు నరేశ్ లాంటివాళ్లే.