తెలుగు సాహిత్యంలోని ఆధునిక ప్రక్రియల్లో నవల ముఖ్య మైనది. ఒకప్పుడు సుదీర్ఘమైన నవలలను పాఠకులు ఎంతో ఇష్టంగా చదివేవాళ్లు. ఇప్పుడు జీవితంలో వేగం పెరిగి పోయింది. ఇలాంటి సమయంలో పెద్దపెద్దవీ, ఎప్పుడో వెలు వడినవీ అయిన పుస్తకాలను చదవడం కొంచెం కష్టమైన పనే. మరికొన్ని ప్రసిద్ధిచెందిన రచనల పేర్లు, వాటిలోని కథా మనకు తెలియకపోవచ్చు. కొన్నిటిలోని ఇతివృత్తం సినిమాల్లో వచ్చి ఉండవచ్చు. అలాంటి 20 నవలలను పరిచయం చేస్తూ ఎమ్బీయస్ ప్రసాద్ తాజాగా ‘నవలా పరామర్శ’ పేరుతో ఓ సంకలనం వెలువరించారు. ఇందులో తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో పేరున్న నవలల పరిచయం ఉంది. తెలుగు ఆదికావ్యం రచనకు ఆదికవి నన్నయకు ప్రేరణ గురించి పాలంకి సత్య ‘యుగాది’ పరిచయంలో వివరించారు.
అడవి బాపిరాజు రచనల్లో ప్రసిద్ధి చెందిన ‘గోన గన్నారెడ్డి’, యండమూరి సైన్స్ ఫిక్షన్ ‘యుగాంతం’, రాజు పేద సినిమాకు మూలమైన ఫ్రెంచి నవల ‘ద ప్రిన్స్ అండ్ ద పాపర్’, ఫ్రెంచి విప్లవ కాలానికి సంబంధించిన చార్లెస్ డికెన్స్ ఆంగ్ల రచన ‘ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్’, ప్రపంచాన్ని 80 రోజుల్లో చుట్టేసిన సాహసికుడి కథ ‘ఎరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 డేస్’, చలం సంచలన రచన ‘మైదానం’ తదితర నవలలను ఈ పుస్తకం పరిచయం చేస్తుంది. అసలు నవలలు చదవాలనుకునే వాళ్లకు, అన్ని పుస్తకాలు చదవలేం పరిచయం మాత్రమే చాలనుకునేవాళ్లకూ ఈ ‘నవలా పరామర్శ’ సూక్ష్మంలో మోక్షం.
రచన: ఎమ్బీయస్ ప్రసాద్
పేజీలు: 270, ధర: రూ. 150
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 90004 13413
ఈ పుస్తకం డాక్టర్ సచిన్ మర్దా హృదయావిష్కరణ. ఆంకాల జిస్ట్గా అతని ఆత్మశోధన. రోబోటిక్ సర్జన్గా ఆ నిపుణుడి గుండె చప్పుడు. క్యాన్సర్ కణాన్ని కట్టడిచేయడం తెలిసిన వైద్య వ్యూహకర్త మర్దా. చిన్నపాటి క్యూబికల్కో, ఓ మోస్తరు ఆపరేషన్ థియేటర్కో పరిమితం కాని విశాల ప్రపంచం ఆయనది. ఆ విస్తారమైన అనుభవం పుస్తకంలోని ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది. ఇదొక వైద్య కథనాల సమాహారం. ఎలాగైనా బతికితీరాలనే రోగి ఆరాటానికి, ఆరునూరైనా బతికించి తీరాలనే వైద్యుడి చిత్తశుద్ధి తోడైనప్పుడు అద్భుతాలు జరుగుతాయి.
అలాంటి అనుభవాలే ఇవన్నీ. ఏమాత్రం కాల్పనికత లేకపోయినా, ఊపిరి బిగబట్టుకుని చదువుతాం. ప్రతి రోగిలో ఓ యోధుడినో, యోధురాలినో చూస్తాం. రెండో విభాగంలో క్యాన్సర్కు సంబంధించిన ప్రాథమిక అంశాలను ఇచ్చారు. మూడో విభాగంలో ప్రత్యామ్నాయ చికిత్సల్ని పరిచయం చేశారు. నాలుగో విభాగం ‘భావోద్వేగ ఆరోగ్యం’ గురించి చర్చించింది. చివరి అధ్యాయంలో క్యాన్సర్ చికిత్సలో ఉపకరించే ఆర్థిక అంశాలను ఇవ్వడం బావుంది. ఆంగ్ల రచనకు అనువాదం సరళంగా సాగింది.
రచన: డాక్టర్ సచిన్ మర్దా, రచన మంకాని
అనువాదం: రచన ముడుంబై
పేజీలు: 230; వెల: రూ. 1749
ప్రతులకు: www.gurucoolpublishing.com