కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఒకప్పుడు ఎన్నో చెరువుల నుంచి నీళ్లు అందేవి. నగరం సాంకేతికంగా ఎదుగుతున్న కొద్దీ నీటి వనరులన్నీ ఒక్కొక్కటిగా మాయమవుతూ వచ్చాయి. కొన్ని నివాస ప్రాంతాలుగా, మరికొన్ని చెత్తకుప్పలుగా మారిపోయాయి. కోటికి పైగా జనాభా ఉన్న నగరంలో ప్రజల తాగునీటి అవసరాలు తీరాలంటే ఇప్పుడు మిగిలిన చెరువులనైనా కాపాడుకోవాల్సి ఉంది. బెంగళూరు నగర దుస్థితిని తలుచుకుని నీటి వనరుల సంరక్షణకు మెకానికల్ ఇంజినీర్ ఆనంద్ మల్లిగవాడ్ నడుం బిగించాడు. ఈ ‘చెరువుల మనిషి’ జలాశయాలే భూమికి ఊపిరితిత్తులు అంటాడు.
చెరువులను సంరక్షించుకునే క్రమంలో మన పెద్దలు అనుసరించిన విధానాలను అధ్యయనం చేశాడు. రుతుపవనాలతో నిండిన చెరువులు భూగర్భ జలాలు పెంపొందడానికి దోహదపడతాయని గుర్తించాడు. ఒకప్పుడు బెంగళూరులో దాదాపు రెండువేల చెరువులు ఉండేవి. ఇప్పుడు ఐదొందలు కూడా మిగల్లేదు. అపార్ట్మెంట్లు వాటిని మింగేశాయి. కాలువలను కాంక్రీట్తో నింపేశారు. దీంతో కొద్దిపాటి వర్షాలకే వరదలు వెల్లువెత్తుతున్నాయి. నీళ్లన్నీ వృథాగా వెళ్లిపోతున్నాయి. భవిష్యత్ అవసరాలకు నిల్వ చేసుకునే ప్రసక్తే లేదు.
బెంగళూరులో సగం జనాభా బోరుబావుల నీటిపైనే ఆధారపడి బతుకుతున్నది. వీటిలో నీళ్లు సరిపోకపోవడంతో చాలామంది ట్యాంకర్లలో తెప్పించుకుంటున్నారు. దీనికితోడు ఒక్కోసారి వర్షాభావం తలెత్తుతుంది. ఉన్న నీటివనరుల్లో కాలుష్యం పెరిగిపోయింది. వాతావరణ మార్పులు భయపెడుతున్నాయి. దీంతో నగరంలోని 180 పురాతనమైన చెరువులను పరిశీలించాడు ఆనంద్. తాను పనిచేస్తున్న కంపెనీని ఒప్పించి 1,20,000 డాలర్లు సహాయంగా పొందాడు. వీటితో 36 ఎకరాల కైలాసనహళ్లి చెరువుకు 2017లో మళ్లీ జీవంపోశాడు. దీనికోసం భారీ అంచనాలకు పోకుండా మట్టి, చెట్లు, కాలువలు అనే సూత్రాన్ని అనుసరించాడు.
పునరుద్ధరణ కోసం చెరువులో మిగిలిపోయిన నీళ్లను ఖాళీ చేయిస్తాడు. ఆ తర్వాత పూడిక, కలుపు తీసేస్తాడు. కట్టలను బలోపేతం చేయడం, కాలువలను తీర్చిదిద్దడం, స్థానిక వృక్షాలను నాటడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాడు. అలా ఇప్పటివరకు 80 చెరువులకు మళ్లీ జీవం పోశాడు. ఈ కార్యక్రమాన్ని ఇతర రాష్ర్టాలకూ విస్తరించాడు. మళ్లీ జలకళ సంతరించుకున్న చెరువులు ఎంతోమంది నీటి అవసరాలను తీరుస్తున్నాయని ఆనందంగా చెబుతాడు ఆనంద్. కానీ, ఆయన పని అంత సులభంగా సాగిపోవడం లేదు. ఒక్కోసారి కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి బెదిరింపులు వస్తుంటాయి. ఓ ముఠా దాడిచేసింది కూడా. అయినా వెనక్కి తగ్గలేదు తను. ‘జలకళ సంతరించుకున్న చెరువులు నాకు కొత్తశక్తిని ఇస్తాయి. ఇంతకుమించి ఇంకేం కావాలి?’ అంటాడు ఆనంద్.