మారుతి భారతీయుల ఇష్టదైవం. హనుమాన్ చాలీసా చదువుకోనిదే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనివారు ఎంతోమంది. ఏటా హనుమద్ వ్రతాలు చేపట్టేవారి సంఖ్యా తక్కువేం కాదు. బిగ్-బి అమితాబ్ బచ్చన్ అల్లుడు నందా కూడా హనుమాన్ భక్త మండలి సభ్యుడే. ‘పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు’ అని అన్నమయ్య వర్ణించినట్టు.. అంతెత్తు మారుతి విగ్రహాలను
నలుమూలలా ప్రతిష్ఠించాలన్నది నందా సంకల్పం.
వ్యాపారవేత్త నిఖిల్ నందాకు హనుమంతుడంటే మహాభక్తి. ఆ శరణాగతితోనే సిమ్లాలోని జాఖూ మందిర్లో అత్యంత ఎత్తయిన మారుతి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద దేవతా విగ్రహంగా ఈ మారుతి మూర్తి కీర్తి గడించింది.త్వరలోనే ఇలాంటివి మరికొన్ని ప్రతిష్ఠిస్తానని చెబుతున్నాడు నందా. ఇంతకీ, ఎవరీ నందా అంటారా? సాక్షాత్తు, బిగ్-బి అమితాబ్ బచ్చన్ అల్లుడే..నిఖిల్ నందా. పుట్టింది హరియాణాలోని పానిపట్లో అయినా.. ఢిల్లీలో వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఇదంతా తన ఇష్టదైవం అనుగ్రహమేనని చెబుతుంటాడు. ‘నా జీవితంలో ప్రతి గెలుపు, ప్రతి సంతోషం హనుమంతుడి ప్రసాదమే. ఆయన ఆశీస్సులు లేకపోతే మా టూత్బ్రష్ల కంపెనీ ముందంజలో ఉండేదే కాదు. కొండంత విజయాన్ని ఇచ్చిన దేవుడికి అంతేస్థాయిలో ధన్యవాదాలు చెప్పాలన్నది నా కల. ఆ క్రమంలో సిమ్లాలోని జాఖూ మందిర్లో 108 అడుగుల హనుమాన్ విగ్రహం నిర్మించాను. నిర్మాణం పూర్తయ్యేందుకు దాదాపు రెండేండ్లు పట్టింది. నా అర్ధాంగి శ్వేతా బచ్చన్ సోదరుడు అభిషేక్ బచ్చన్ ఇంతదూరం వచ్చి ఆవిష్కరించారు’ అని వివరించారు నిఖిల్ నందా.
అచ్చం అలాగే..
జాఖూలో నిర్మించిన హనుమాన్ విగ్రహం ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లోనూ చోటు సంపాదించుకుంది. ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటైన అత్యంత ఎత్తయిన విగ్రహంగా రికార్డు సాధించింది. జాఖూ మందిర్లోని విగ్రహాన్ని పోలిన మరో రెండు విగ్రహాలను.. ఒకటి గుజరాత్లోని మార్బీలో, మరొకటి తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మించనున్నట్లు నందా చెప్పాడు. జాఖూలోని విగ్రహాన్ని నరేశ్ కుమార్ అనే కళాకారుడు రూపొందించాడు. మొత్తం 1500 టన్నుల కాంక్రీట్, ఇనుము, రాళ్లతో తయారు చేశాడు. విగ్రహం స్థిరంగా ఉండేందుకు 178 అడుగుల లోతుతో పునాది వేశారు. జాఖూ మందిరాన్నే ఎంచుకోవడానికి కారణం ఉందంటాడు నందా. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోవడంతో.. హనుమ సంజీవని పర్వతాన్ని వెతుక్కుంటూ బయల్దేరతాడు. ఎంతకీ ఆ పర్వతపు ఆనవాళ్లు దొరకవు. తిరిగితిరిగి అలసిపోతాడు. ఆ సమయంలో మారుతి విశ్రాంతి తీసుకున్న చోటు ఇదేనంటున్నాయి స్థానిక ఐతిహ్యాలు.