Kunapuli | జానపద కళారూపాల్లో ‘పటం కథలు’ ప్రత్యేకమైనవి. ఇవి తెలంగాణలో మాత్రమే దర్శనమిస్తాయి. నూలు వస్త్రంపై నకాశి చిత్రాల ద్వారా కుల పురాణాలను చెప్పే కళారూపాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒకటి.. కూనపులి.
కూనపులివారు పద్మశాలి కులస్థులను ఆశ్రయించి, వారి కులదైవమైన మార్కండేయ పురాణం, పద్మపురాణం, భావనా రుషి పురాణం.. ఇతర కథలు చెబుతారు. నకాశి కళాకారులు చిత్రించిన పటం ద్వారా కూనపులివారు కథాగమనాన్ని వివరిస్తారు. ఈ కళాకారులను వరప్రసాదులు, పడిగె రాజులు, పులిజెండా వాళ్లు (పడిగె అంటే ‘జెండా కలిగినవారు’ అనే అర్థంలో ఉపయోగిస్తారు) అని కూడా పిలుస్తారు. పురాణాలు, కథల గురించి ఎలాంటి రాత ప్రతులుగానీ, తాళపత్రాలుగానీ అందుబాటులో లేనప్పటికీ తరతరాలుగా మౌఖికంగానే కథాగానం చేస్తున్నారు.
పులిజెండాను మోసుకుని తమకు వారసత్వంగా వచ్చిన కట్టడి గ్రామాలకు వెళ్తారు కూనపులివారు. ఆయా గ్రామాలకు చేరుకొని పద్మశాలి కులపెద్దను కలిసి, తమ రాకకు కారణాన్ని తెలియజేస్తారు. కులపెద్ద గ్రామంలో మిగతా పద్మశాలి కులస్థులను సంప్రదించి కళాకారులకు ఇవ్వాల్సిన పారితోషికం గురించి చర్చి స్తాడు. ప్రదర్శనకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తాడు. పటం ద్వారా కథ చెప్పడానికి ఐదుగురు కళాకారులు అవసరం. ప్రధాన కథకుడు నుదుట నిలువు నామాలు పెట్టుకొని కాళ్లకు గజ్జెలు, నడుముకు ఎర్రటి కండువా ధరిస్తాడు. కుడి చేతిలో కర్ర, ఎడమ చేతిలో చిడతలను పట్టుకొని కథాగానం చేస్తాడు. కథలో ప్రధాన పాత్రలను పోషిస్తూ వినోదం, విషాదం, యుద్ధంలాంటి సన్నివేశాల్లో తగిన హావభావాలను ప్రదర్శిస్తూ, కథను రక్తి కట్టిస్తాడు. మధ్యలో చతురోక్తులు, సామెతలతో హాస్యాన్నీ పండిస్తాడు. ఇతనికి సహాయకులుగా ఇద్దరు వంతలు ఉంటారు. బృందంలో మిగతా ఇద్దరిలో ఒకరు తబలా, మరొకరు హార్మోనియం వాయిస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రధాన కథకుడు విశ్రాంతి తీసుకుంటే కథకు అంతరాయం కలుగకుండా వంతగాళ్లు పిట్టకథలు, హాస్యపు పొడుపు కథలు చెబుతూ, పాటలు పాడుతూ ప్రేక్షకులను ఆనందపరుస్తారు. మార్కండేయ పురాణం చెప్పేటప్పుడు ప్రత్యేకమైన వాద్యాలను ఉపయోగిస్తారు. ఈ పురాణాన్ని రెండు రోజులు చెబుతారు. రెండో రోజు బలి కార్యక్రమం నిర్వహించి పద్మశాలి ఇండ్ల మీద బలి చల్లి దీవిస్తారు.
పద్మశాలి కులపురాణాన్ని కీర్తిస్తూ, సంస్కృతిని పరిరక్షిస్తూ వస్తున్న కూనపులి కళ అంతరించిపోయే దశకు చేరింది. తెలంగాణ వ్యాప్తంగా కూనపులి కులస్థుల జనాభా దాదాపు 60 వేల వరకు ఉన్నప్పటికీ, ఈ కళను ప్రదర్శించే కళాకారుడు ఒక్కరే మిగిలారు. రాష్ట్రంలోనే ఏకైక కూనపులి కళాకారుడు వరంగల్ జిల్లా శాయంపేట మండల కేంద్రానికి చెందిన పురాణం రమేశ్. ప్రస్తుతం కథ చెప్పడానికి అవసరమైన పటం కూడా తనవద్ద లేదని, ప్రస్తుతకాలంలో కూనపులి కథను చెప్పించుకొనే వారే కరువయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చేతులమీదుగా ఉత్తమ కళాకారుడిగా లక్ష రూపాయల రివార్డును అందుకున్నారు పురాణం రమేశ్. భాషా సాంసృతిక శాఖ ప్రముఖ కళాకారుడు ఏలె లక్ష్మణ్ దర్శకత్వంలో ‘పటం కథలు’ అనే డాక్యుమెంటరీని రూపొందించారు.
కూనపులి పుట్టుకకు సంబంధించి మూడు గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పద్మశాలీ పురాణం ప్రకారం భావనా రుషి రాక్షసులతో ఘోరయుద్ధం చేస్తుంటే ఆయన చెమట నుంచి కూనపులివాడు జన్మించాడని, పులిజెండాను తన కులం గుర్తుగా ధరించడం వల్ల ఆయన వారసులు కూనపులివారు అయ్యారని ఒక కథనం. దేవాంగ మహర్షిమూలంగానే కూనపులి వారు ఉద్భవించారని దేవాంగ పురాణం చెబుతున్నది. భృగుసంతతి మహాప్రబంధంలోనూ, మార్కండేయ విలాసంలోనూ, శ్రీ భావనా రుషి పురాణంలోనూ, మార్కండేయ ఉపాఖ్యానాల్లోనూ కూనపులి వంశ ప్రస్తావన కనిపిస్తుంది. కూనపులివారు కథాగానం చేసే మార్కండేయ పురాణానికి, శిష్ట సాహిత్యంలో క్రీ.శ. 1511-1568 మధ్య కాలానికి చెందినట్లుగా భావిస్తున్న ఎల్లకర నృసింహ కవి రచించిన మార్కండేయ పురాణానికీ పోలికలున్నాయి.
– అరవింద్ ఆర్య, 7997 270 270
కాటికి తోడుగా వచ్చే కాటికాపరుల గురించి ఈ విషయాలు తెలుసా!
ఈ యుద్ధ కళ తెలిసి చేతిలో కర్ర ఉంటే.. ఐదారుగురు తోడున్నట్టే
Burra katha | బుర్ర కథకు ఆ పేరెలా వచ్చింది? అసలు ఫస్ట్ ఇవి ఎలా రూపొందాయి?
Raj Gonds | రాజ్ గోండుల చరిత్రను కాపాడటంలో ప్రధానపాత్ర పోషించేది వీళ్లే..
Khajuraho | కొత్త దంపతులకు హనీమూన్ డెస్టినేషన్.. ఈ శిల్పనగరి
హైదరాబాద్లో ఎన్ని బ్యాండ్లు ఉన్నా అరబ్బీ మార్ఫా బ్యాండ్కే ఎందుకంత క్రేజ్?