ఇప్పుడంటే జిమ్లకూ గట్రా వెళ్తున్నారు. తాత, ముత్తాతల కాలంలో ఇవేవీ లేవు. పొద్దున్నే లేచి పొలానికి వెళ్తే.. మళ్లీ సాయంత్రానికి ఇంటికి చేరుకునేది. చెమట చిందించనిదే
పంట వచ్చేది కాదు. కాబట్టే, రైతు రాటు తేలిన దేహంతో దృఢంగా ఉండేవాడు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. కేరళకు చెందిన సతీశ్ కూడా కసరత్తు కోసం జిమ్ములు వదిలేసి, పొలంబాట పట్టాడు. ‘ఆగ్రోజిమ్’కు తిరుగులేదని నిరూపిస్తున్నాడు.
పొలానికెళ్తే పలుగూ, పారా పట్టుకొని ఏదో ఒక పని చేయాలనిపిస్తుంది. అదొక మానసిక ఆనందం. శారీరక సంతృప్తి. మన పొలంలో, మన కష్టంతో పండించగా వచ్చిన ప్రతిఫలాన్ని మన భార్యా పిల్లలలో కలసి తింటున్నప్పుడు కలిగే సంతృప్తి కోట్లు సంపాదించినా రాదనిపిస్తుంది. అందుకేనేమో, కేరళలోని అలప్పుజాకు చెందిన సతీశ్ తన తాతముత్తాతల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పొలంలోకి దిగాడు. తన వ్యవసాయ క్షేత్రాన్నే వ్యాయామ శాలగా మార్చుకుని, అక్కడే చెమటోడుస్తున్నాడు. రసాయనమయమైన భూమికి సేంద్రియ సేద్యం ద్వారా కొత్త జీవం పోస్తున్నాడు.
ఉదయం ఐదింటికే
రుతువు ఏదైనా సతీశ్ దినచర్య మారదు. ఉదయం ఐదింటికే నిద్రలేచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రోజిమ్కు వెళ్తాడు. దగ్గర్లోని చెరువు నుంచి నీరు బిందెల్లో మోసుకొచ్చి మొక్కలకు పోస్తాడు. ఆ తర్వాత పలుగు, పారతో తన వ్యవసాయ క్షేత్రాన్ని అందంగా తీర్చిదిద్దుతాడు. దీనివల్ల గతంలో కంటే తన శరీర దారుఢ్యం పెరిగిందనీ, గుండె, శ్వాస సంబంధ వ్యాధులు దరిదాపుల్లోకి కూడా రాలేదని సగర్వంగా చెబుతున్నాడు. ‘రోజూ ఏదో ఒకపని చేస్తూ ఉంటాను. ప్రస్తుతం నా క్షేత్రంలో టమాట, వంకాయలు, బెండకాయలు, బీన్స్, బొబ్బర్లు, దుంపలు, దోస, గుమ్మడి, ఆకుకూరలు, ఎర్రబచ్చలి, పొట్లకాయలతో పాటు సుగంధ మొక్కలు, పూల మొక్కలు, బొప్పాయి, అరటి, మామిడి వంటివి పండిస్తున్నాను. ఆగ్రోజిమ్కు వెళ్లగానే స్వర్గంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. దాదాపు 90 శాతం ప్రభుత్వ అధికారులు జీవనశైలి లోపాల కారణంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్లో ఆ బాధలు పడకూడదనే ఇప్పటినుంచీ ఆరోగ్య ప్రణాళిక అమలు చేస్తున్నాను. సేద్యాన్ని అందుకు మార్గంగా ఎంచుకొన్నాను’ అంటున్నాడు సతీశ్.
స్ఫూర్తినిచ్చిన ఆగ్రోజిమ్..
సతీశ్ ‘ఆగ్రోజిమ్’ స్థానికులలో ఎంతో స్ఫూర్తిని నింపింది. బాల్యం నుంచే సేంద్రియ వ్యవసాయాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో తన క్షేత్రానికి బడి పిల్లలను ఆహ్వానిస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు విత్తు నాటడం, మొక్కలకు నీరు పెట్టడం, కూరగాయలు పండించడం వంటి నైపుణ్యాలు బోధిస్తాడు.ఆయన భార్య రేష్మి, ముగ్గురు పిల్లలు తనకు వ్యవసాయ పనుల్లో సాయం చేస్తుంటారు. సతీశ్ స్ఫూర్తితో పరిసర గ్రామాల్లో అనేకమంది సేంద్రియ వ్యవసాయాన్ని జీవన విధానంగా మార్చుకున్నారు. మొత్తానికి ఆరోగ్యం + వ్యవసాయం = ఆత్మసంతృప్తి అనే కాన్సెప్ట్తో దూసుకెళ్తున్నాడు సతీశ్. తిరుగులేదు. ఆయన దారి.. రహదారి!
పొలంలో కసరత్తు
సతీశ్ ఉన్నత విద్యావంతుడు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సీనియర్ అసిస్టెంట్. స్వగ్రామంలో ఆయనకు ఎకరం భూమి ఉంది. పొలాన్ని దున్నడం నుంచి పంట ఇంటికి చేర్చే వరకూ ఎటువంటి యంత్రాలనూ ఉపయోగించడు. పలుగు, పార, కొడవలి, గొడ్డలి.. ఇవే అతడి ఆయుధాలు. ఆ వ్యవసాయ క్షేత్రం పేరు ‘ఆగ్రోజిమ్’. గతంలో జిమ్లకు వెళ్లి చెమట చిందించిన సతీశ్కు, ఆ కసరత్తు వల్ల సమయం వృథా కావడం మినహా ఎలాంటి లాభం లేదని అర్థమైంది. దీంతో సహజమైన ఫిట్నెస్ కోసం పొలంలో కష్టపడటం మొదలు పెట్టాడు. అలా ఎకరం పొలంలో వివిధ రకాల కూరగాయలను సేంద్రియ పద్ధతిలో పండించసాగాడు. దీనివల్ల జిమ్ల అవసరం లేకుండా పోయింది. సొంత పొలంలో కష్టపడుతున్నాననే ఆత్మసంతృప్తీ లభిస్తున్నది. సేంద్రియ కూరగాయలు తింటున్నామన్న సంతృప్తి.. కూడా దొరికింది.