భారతదేశానికి ప్రతీక మువ్వన్నెల జెండా. పంద్రాగస్టు రాగానే.. ఊరూ వాడా మూడు రంగుల జెండాలతో కళకళలాడతాయి. ప్రతి పంద్రాగస్టూ ప్రత్యేకమే అయినా వజ్రోత్సవ వేళ గుండెనిండా జెండాను నింపుకొనేలా.. త్రివర్ణంలో మనమూ మెరిసిపోయేలా .. ‘దేశభక్తి ఫ్యాషన్’ కొత్త ప్రేరణనిస్తున్నది. జాతి పట్ల గౌరవాన్ని చాటుకోవడానికి ఇదొక అవకాశం కూడా.
సృష్టిలో ఎన్నో రంగులు… వాటి కలబోతగా మరెన్నో వర్ణాలు.. ఒకవన్నెకు మరో వన్నె తోడయితే జోడీ పర్ఫెక్ట్! ఎరుపు రంగుకు ఆకుపచ్చ, నీలానికి గులాబీ, పసుపు రంగుకు ముదురు కుంకుమ వన్నె… జంట రంగులుగా ప్రసిద్ధి పొందాయి. కానీ ఓ మూడు వర్ణాలు జత కలిస్తే మాత్రం భారతీయుల కళ్లు ఆరాధనతో మెరుస్తాయి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా.. ఆ వర్ణాల వరుస కనిపించగానే పాత స్నేహితుణ్ని చూసినంతగా గుండెలు ఉప్పొంగుతాయి. క్రికెట్ మ్యాచులైనా..
ఒలింపిక్స్ క్రీడలైనా.. మువ్వన్నెల్ని ముఖం మీద అచ్చేసుకుని ఆనందించే అభిమానులెందరో. త్రివర్ణ పతాకాన్ని గాల్లో రెపరెపలాడిస్తూ మురిసిపోయే దేశాభిమానులెందరో. ఆ మూడు రంగులూ మన ఒంటి మీద ఉన్నాయంటే.. ‘ఐ లవ్ ఇండియా’ అనే సందేశాన్ని ప్రపంచానికి పంపినట్టే. కనుకనే ఫ్యాషన్ రంగమూ ఆ మువ్వన్నెల్ని అక్కున చేర్చుకుంది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణాల మేళవింపుతో దుస్తులు, అలంకరణలు తయారు చేస్తున్నది. మహిళల కోసం దుపట్టాలు, చుడీదార్లు, చీరలు.. ఈ తరహాలో రూపొందుతున్నాయి. ఇక జువెలరీలోనూ మువ్వన్నెల ముద్ర కనిపిస్తున్నది.
ఇవే రంగుల్లో గాజులు, గొలుసులు, బుట్టలు, దుద్దులు, ఉంగరాలతో పాటు క్లిప్పులు, హెయిర్ బ్యాండ్లు కూడా తయారవు తున్నాయి. అబ్బాయిల కోసం టీషర్టులు, కుర్తాపైజమాలు, ధోతీ సెట్లూ సిద్ధం అవుతున్నాయి. ఇవి కాకుండా.. అందరూ ధరించేలా రిస్ట్ బ్యాండ్లు, టోపీలను కూడా త్రివర్ణాల్లో రూపొందిస్తున్నారు. ఈ పంద్రాగస్టుకు మీకు నచ్చిన మువ్వన్నెల ఫ్యాషన్ను ఎంచుకోండి. జెండాలా తల ఎగరేస్తూ .. వీధుల్లో నడవండి. ఎదురైన వారికంతా ‘జైహింద్’ అంటూ అభివాదం చేయండి.