Gajarayuni Gutta | చుట్టూ కొండలు.. వాటి నడుమ ప్రత్యేకతను సంతరించుకున్న గజరాయుని గుట్ట. ఏటవాలు గుట్టపై ఏ మూల చూసినా ఓ రాతి గుహ. చిన్నచిన్న గుహల్లో కాలానికి అందని చరిత్ర దాగి ఉంది. ప్రాచీన నాగరికతకు సంబంధించిన విచిత్రాలు నేటికీ ఇక్కడ దర్శనమిస్తాయి. మహబూబ్నగర్ ( Mahaboobnagar ) జిల్లా మూసాపేట మండలం నందిపేట ( Nandipet ) సమీపంలోని గజరాయుని గుట్ట విశేషాలివి..
గత చరిత్రంతా సిరాతో రాసిందే! ఎవరికీ అంతుపట్టని నాగరికతను తెలియజేసేవి విచిత్ర చిత్తరువులే! అలాంటి చిత్రమే గజరాయుని గుట్ట ఎంత పురాతనమైనదో లోకానికి చాటి
చెబుతున్నది. ఈ గుట్టపై 12 గుహలున్నాయి. చూసేందుకు చిన్నవే అయినా.. ఇవన్నీ ప్రత్యేకతను సంతరించుకున్నవే. మూడు అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ గుహలు సుమారు 2,500 ఏండ్ల పురాతనమైనవని చెబుతున్నారు పరిశోధకులు. బృహత్ శిలాయుగం నాటివని విశ్లేషిస్తున్నారు.
రాతి పలకలతో కప్పి ఉన్న ఈ గుహల్లో యోగులు, మునులు తపస్సు చేసేవారని స్థానికుల విశ్వాసం. అందుకు తగ్గట్టుగానే గుట్టపై ఈ గుహల మధ్యలో భారీ నంది విగ్రహం ఉండేదట. అయితే, గుప్తనిధుల తవ్వకాల కోసం దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ నంది విగ్రహం వల్లనే ఈ ప్రాంతానికి నందిపేట అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. నంది విగ్రహం ధ్వంసమైన ప్రదేశంలో ఐదు దశాబ్దాల కిందట గ్రామస్తులు శివాలయం నిర్మించారు. ప్రతి సోమ, శనివారాల్లో భక్తులు ఈ ఆలయానికి వచ్చి పూజలు, భజనలు నిర్వహిస్తుంటారు. ఏటా ఆషాఢమాసం తొలి ఏకాదశి నాడు వరదపాశం పేరుతో గ్రామస్తులంతా గుట్టపై ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
గుట్ట కింది భాగాన తూర్పుదిశలో ఉన్న గుహలో రాతిగుండుపై పులిబొమ్మ గీసి ఉంది. ఈ చిత్రం ఆధారంగా గజరాయుని గుహలు అతి పురాతనమైనవిగా చరిత్రకారులు నిర్ధారించారు. అయితే ఈ బొమ్మ వెనుక స్థానికంగా ఆసక్తికరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. వేల ఏండ్ల కిందట ఓ గర్భిణి గుహ ప్రాంతంలో ప్రసవించిందట. అదే సమయంలో ఒక పులి వారిపై దాడి చేసిందట. బిడ్డను కాపాడుకోవడానికి ఆ తల్లి వీరోచితంగా పోరాడి పులిని చంపిందట. ఆ పులి రక్తంతోనే గుహ గోడపై పులిబొమ్మను గీసిందని గ్రామస్తులు వివరిస్తారు. ఇప్పటికీ పులి బొమ్మ అస్పష్టంగా కనిపిస్తుంటుంది. గుప్తనిధుల కోసం నంది విగ్రహాన్ని మట్టుపెట్టిన దుండగులు గుహలను సైతం వదల్లేదు. చాలావాటిని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో తొమ్మిది గుహలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మూడు గుహలు మాత్రం ఆనాటి ఆనవాళ్లతో బృహత్ శిలాయుగానికి మౌన సాక్ష్యాలుగా నిలిచాయి.
ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుట్టను కాపాడుకునేందుకు నందిపేట గ్రామస్తులు నడుం బిగించారు. గుట్టపైకి వెళ్లేందుకు రోడ్డు వేసుకున్నారు. విద్యుత్ సౌకర్యం ఏర్పాటు
చేశారు. సుమారు దశాబ్దం కిందట అందరూ చందాలు పోగుచేసుకొని శివలింగం, నంది విగ్రహాలను పునఃప్రతిష్ఠించారు. గుట్టపై గుడి చెంతనే ఉన్న చిన్న కోనేరులో
ఏ కాలంలో అయినా నీళ్లు ఉంటాయి. శివరాత్రి సమయంలో వందల సంఖ్యలో శివస్వాములు గుట్టపైకి చేరుకొని భజనలు చేస్తుంటారు. శిలాయుగపు చిరునామాగా నిలిచిన గజరాయుని గుట్ట గుహలు వారాంతపు విహారకేంద్రంగా పర్యాటకులను అలరిస్తున్నాయి.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇలాంటి రాతి చిత్రాలు చాలానే ఉన్నాయి. నేను ఇప్పటి వరకు రెండిటిని కనుగొన్నాను. ఒకటి ప్రస్తుత వనపర్తి జిల్లా కొత్తకోట నుంచి వేంకటేశ్వరస్వామి గుడి మార్గంలో ఉంది. ఇక్కడి శ్మశాన వాటిక సమీపంలో ఉన్న పెద్దగుండుకు ఉత్తర భాగంలో త్రిశూలాకృతిలో మూడు బొమ్మలు ఉన్నాయి. ఇవి 3వేల ఏండ్ల పురాతనమైనవి. ఇదే కాకుండా మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండ ప్రాంతంలోనూ ఇలాంటి చిత్రం ఉంది. ఆ రాతిచిత్రం కూడా అతి పురాతనమైనదే.
– ద్యావనపల్లి సత్యనారాయణ, చరిత్ర పరిశీలకుడు
✍ జన్ను నవీన్ కుమార్
“Kottankulangara Devi Temple | ఈ ఆలయంలో పురుషులకు నో ఎంట్రీ.. చీర కట్టుకుంటే మాత్రం రానిస్తారు”