Maha Shivaratri | శివరాత్రి ప్రతినెలా వస్తుంది. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని ‘మాస శివరాత్రి’ అంటారు. సంవత్సరంలో పదకొండో నెల అయిన మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాత్రం ‘మహాశివరాత్రి’గా వ్యవహరిస్తారు. ఇందుకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి. ఒకటి.. అప్పటివరకు ఒక రూపమే లేని మహాదేవుడు లింగరూపం ధరించి బ్రహ్మవిష్ణువుల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రి. రెండు.. లింగరూపంలో నిర్గుణపరబ్రహ్మగా ఉన్న పరబ్రహ్మ పార్వతీదేవిని కల్యాణం చేసుకుని సగుణంగా దర్శనమిచ్చింది మహాశివరాత్రి రోజునే. మూడు.. దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మధిస్తుంటే మొదట హాలాహలం పుట్టింది. దానిని శివుడు తాగి లోకాలకు మేలుచేసింది మహాశివరాత్రి నాడు. అందుకే, ఈ రోజున ఆయనను పూజించడం ఆచారం.
కొండల మధ్య నిలబడి ‘కో’యని అరిస్తే.. ఎటువైపు నుంచో ఏమో మరి.. మళ్లీ మనకు ‘కో’యని బదులు వినిపిస్తుంది. ఇంతకీ.. ఆ బదులిచ్చిందెవరు?!
… ‘రుద్రుడు’ అంటే శబ్దరూపుడైన శివుడు. ఆ మహాదేవుడు నిరంతరం శబ్దిస్తూ ఈ సృష్టియందే వసించి ఉన్నాడంటుంది వేదం. అదిగో ఆయన చేస్తున్న శబ్దమే ఈ విశ్వంలో మొదటి స్పందన. చివురాకులు మెక్కిన కోయిల ‘కూ’ అంటే మనం ‘కూ’యని రెచ్చగొడితే… ఆగకుండా ‘కుకూ’లతో బదులిస్తూనే ఉంటుంది. అటువంటి ఆసక్తిని దానికి కలిగించినదెవరు?!
.. ‘శక్తిని చూడనిదే ఆయన స్పందించడు’ అన్నారు ఆదిశంకరులు. కేవలం కాంతి స్వరూపిణిలోని శక్తి కేంద్రకం నుంచి తన శబ్ద స్పందనల ద్వారా… ఈ సృష్టికి జీవశక్తిని, ప్రాణశక్తిని విస్తరిస్తున్నవాడే శివుడు. ఒక వాక్కు మననుంచి వెలువడుతుంది. ప్రాథమిక స్థాయిలో అదొక శబ్దమే. ఆ శబ్దం మనసు ద్వారా ప్రయాణిస్తూ ఒక అర్థాన్ని తాకగలిగితే జ్ఞానమనే వెలుగు మన అంతరంగంలోనే దర్శనమిస్తుంది. ‘వాగర్థా వివసంపృక్తౌ’ అని కాళిదాసు చెప్పినట్లు.. మన వాక్కు సరైన అర్థం దిశగా దూసుకెళ్లాలి. పరమాణువంతగా ఉండి, మన కంటికి ప్రస్తుతం కనిపించకుండా ఉన్న కాంతి వలయాన్ని విస్తరించాలి. దాంతోనే మనకు చీకట్లు తొలగిపోవాలి. అయితే, పురాణకాలంలో ఒకసారి అటువంటి వెలుగు ఏమాత్రమూ లేకుండా పోయింది. గాఢాంధకారం అలుముకుంది. అందువల్లనే తమకంటే ఉన్నతుడైన శివుడిని దర్శించలేకపోయారు బ్రహ్మ విష్ణువులు. తమలో తాము తగాదా పడ్డారు. వారి సమస్య పరిష్కారానికి ఆద్యంతాలు లేని అగ్నిలింగమై… శివుడు వారిమధ్య ఆవిర్భవించాడు. అలా లింగోద్భవం జరిగిన రోజునే ‘మహాశివరాత్రి’ అంటారు.
ఆకాశమే లింగమై, భూమి దానికి వేదికై (పానవట్టమై) నిలిచింది. ఆ వేదిక శక్తి స్వరూపం. వేదికమీద ఉన్న పిండమే శివుడు. ఈ సకల ప్రపంచం మహాప్రళయంలో శివలింగమందే లయమై, తిరిగి అక్కడినుంచే మళ్లీ ఆవిర్భవిస్తున్నది. అక్కడే దేవతలందరూ కొలువుదీరి ఉంటారు. అందుకే శివుడిని మాత్రమే కాకుండా వినాయకుడిని, గౌరిని, విష్ణువును, నరసింహుడిని… ఇలా ఏ దేవతనైనా లింగరూపంలో ఆరాధించవచ్చు. లింగమనే శబ్దానికి చిహ్నమని అర్థం. లింగంలో ఆకారం కానీ, రూపం కానీ ఉండదు. కానీ శివుడు కేవలం లింగరూపి కాడు. ఆయనకు సకల, నిష్కళ, సకలనిష్కళ అనే మూడు రూపాలున్నాయి. ఈశాన మంత్రం ఆయనకు కిరీటం. తత్పురుష మంత్రం ముఖం. అఘోర మంత్రం హృదయం. వామదేవ మంత్రం గుహ్యభాగం. సద్యోజాత మంత్రం పాదాలు. ఆయన మంత్రమయుడు. ఆయన నిరాకార రూపం లింగంగా, సాకారరూపం పరమేశ్వరునిగా పురాణాలు చెప్పాయి. మన ఎదురుగా ఉన్న లింగానికి ఏ అవయవాలూ లేకపోయినా… అయిదు ముఖాలు, పది చేతులు, శుద్ధస్ఫటిక వర్ణంతో ప్రకాశిస్తూ సర్వాభరణాలు, చిత్రవస్ర్తాలు ధరించినవానిగా పరమేశ్వరుణ్ని ధ్యానం చేయాలి. ఇందులో ఓంకారాన్ని ముఖంగా, వా, య అనే అక్షరాల్ని రెండు చేతులుగా, శి అనే అక్షరాన్ని నడుముగా, నమః అనే అక్షరాల్ని పాదాలుగా భావించి పంచాక్షరిని జపించాలంటుంది లింగపురాణం.
అకారం పరమేశ్వరుని శిరస్సు. ఆకారం లలాటం. ఇకారం కుడి కన్ను. ఈకారం ఎడమకన్ను. ఉకారం కుడి చెవి. ఊకారం ఎడమ చెవి. ఋకారం కుడి చెక్కిలి. ౠకారం ఎడమ చెక్కిలి, అలు, అలూలు రెండు ముక్కు పుటాలు. ఏకారం పై పెదవి. ఐకారం ఈశ్వరుని కింది పెదవి. ఓకారం పై పళ్ల వరుస. దేవదేవుడైన శివునికి అం, అః అనేవి దవడలు. కవర్గలోని అయిదు అక్షరాలు అయిదు కుడిచేతులు కాగా, చవర్గలోని అయిదు అక్షరాలు అయిదు ఎడమ చేతులయ్యాయి. టవర్గలో అయిదు, తవర్గలో అయిదు వెరసి పది అక్షరాలు పాదాల వేళ్లు. పకారం ఉదరం కాగా, ఫకారం కుడి పార్శ్వం. బకారం ఎడమ పార్శ్వంకాగా, భకారం భుజం. యోగీశ్వరుడు, మహాదేవుడు అయిన శంభుడికి హృదయం మకారం. సర్వవ్యాపకుడైన శివునికి యకారం మొదలుకుని సకారం వరకు గల ఏడు అక్షరాలు ఏడు ధాతువులు (మజ్జా మాంసాదులు). హకారం నాభి, క్షకారం ఘ్రాణేంద్రియం అని శివమహాపురాణం చెబుతున్నది.
లింగాలలో సహజ లింగాలు, మానుష లింగాలని రెండువిధాలు. సహజ లింగాలు మళ్లీ అయిదు రకాలున్నాయి. సహజంగా వెలిసినవి స్వయంభువాలు. దేవతా ప్రతిష్ఠలు దైవికాలు. రుషులు ప్రతిష్ఠించినవి ఆర్షములు. అండాకృతి కలిగినవి గాణాపత్యములు. నర్మదానదిలో లభించేవి బాణములు. మనుషులు రూపొందించినవి మానుష లింగాలు. ఇవిమాత్రమే కాకుండా సమలింగం, వర్ధమానలింగం, శైవాధిక లింగం, స్వస్తిక లింగం, సర్వతోభద్ర లింగం, సార్వదేశిక లింగం, ధారాలింగం, ముఖలింగం వంటి అనేక లింగాలున్నాయి. లింగాలెన్ని రకాలుగా ఉన్నా భావలింగానికి సాటిలేదు. అది యోగుల హృదయాలలో ఉంటుంది. బాహ్యమైన శివలింగార్చన ఎంతటి ఫలాన్నిస్తుందో మానసిక శివలింగార్చన కూడా అంతే ఫలాన్నిస్తుంది. ఉపాసకుడు తన హృదయంలో అగ్నిమండలాన్ని దానిమీద సూర్యమండలాన్ని, దానిపైన చంద్రమండలాన్ని, ఈ మూడు మండలాలకు పైన ప్రకృతి పరమేశ్వరులు అర్ధనారీశ్వరులుగా కొలువై ఉన్నట్లు భావించాలి. మనసులోనే షోడశోపచారాలు చేయాలి. ఈ విధంగా చేసేవారు భస్మాన్ని, రుద్రాక్షల్ని తప్పనిసరిగా ధరించాలి.
లింగధారణ గొప్ప శుభఫలితాలను ఇస్తుంది. ఎవరెవరు ఏ లింగాలను ధరించారో ‘పండితారాధ్య చరిత్ర’ గొప్పగా వర్ణించింది. ఇంద్రనీలమణితో చేసిన లింగాన్ని ధరించినందువల్లనే విష్ణువుకు విష్ణుత్వం వచ్చింది. బ్రహ్మత్వ సాధనకు చంద్రకాంత లింగాన్ని బ్రహ్మ ధరించాడు. మణిమయ లింగాన్ని ఇంద్రుడు, కాంచన లింగాన్ని కుబేరుడు ధరించి అర్చించారు. వెండి లింగాన్ని విశ్వేదేవతలు, నారకూట లింగాన్ని వాయువు, కాంస్య లింగాన్ని ధరించిన వసువులు అభీష్టసిద్ధులు పొందారు. అశ్వినీదేవతలు పార్థివార్చనలు చేశారు. వరుణదేవుడు స్ఫటికలింగాన్ని, అగ్ని దేవుడు అన్నమయ లింగాన్ని ధరించారు. దారులింగాన్ని నైరుతి, తామ్రలింగాన్ని సూర్యుడు ధరించారు. ముత్యపు లింగానికి చంద్రుడు మొక్కాడు. పగడ లింగాన్ని నాగజాతి పట్టుకుంది. కృష్ణలింగాన్ని రాక్షసులు, సీసలింగాన్ని పిశాచగణాలు, గుహ్యులు మూడులోహాలతో చేసిన లింగాన్ని, మాతృకలు సర్వలోహాలతో చేసిన లింగాలను ధరించారు. లక్ష్మీదేవి వృక్షలింగాన్ని పూజిస్తే, సరస్వతి గరికతో శివుణ్ని ఆరాధించింది. పార్వతి ఇష్టలింగాన్ని సేవించింది. రుషులు మృణ్మయమైన పార్థివ లింగాన్ని అర్చించారు. పరమేశ్వరుని క్షణకాలంలో పూజించాలంటే అప్పటికప్పుడు దొరికే ద్రవ్యాలతో లింగాన్ని తయారుచేసి పూజించి మరల దాన్ని విడిచిపెట్టవచ్చు.
ఇసుక, బియ్యం, అన్నం, నదీ మృత్తిక, ఆవుపేడ, గంధం, దర్భ, పుష్పం, బియ్యపు పిండి, రుద్రాక్ష మొదలైన వాటిని క్షణిక లింగాలుగా చేసి పూజించవచ్చు. లింగధారణ చేసి నిత్యపూజా విధులతో సంతుష్టి పరచలేని వారికోసం శివుడు సులభోపాయం చెప్పాడు. నిత్యం భస్మధారణ చేసిన శివభక్తులకు ఆ భస్మంలో ఎన్ని ధూళికణాలు ఉంటాయో… అన్ని శివలింగాలను పూజించి, ధరించిన ఫలితం లభిస్తుంది. ఇటువంటి నియమాలతో మహాశివరాత్రి నాడు శివుణ్ని పూజించాలి. ఇదంతా భక్తిమార్గం. భక్తితోపాటుగా మన సంప్రదాయంలో యోగ, విచారణ మార్గాలు కూడా ఉన్నాయి. భక్తిపరులకు, యోగ మార్గగాములకు కూడా ఆత్మవిచారణ ఉంటుంది. కానీ విచారణ మార్గంలో భక్తి, యోగం రెండూ అవసరం లేదు. కేవలం మనసును, బుద్ధిని ఏకాగ్రం చేసి తత్త్వవిచారణ చేస్తూ పోవడమే. ‘ఏ మార్గంలో అయినా సరే, నాదైన తత్త్వాన్ని తెలుసుకున్న జ్ఞానులే నాకు నిజంగా ప్రియమైనవారు’ అన్నాడు కదా భగవంతుడు. కనుక ఆత్మ విచారణ మార్గంలో శివతత్త్వాన్ని గురించి కొంచెం చింతన చేద్దాం.
ఒకే శివుడు తనను బహువిధాలుగా విభజించుకుంటూ మహాసృష్టిగా విస్తరిస్తున్నాడు. ప్రతి కణంలోనూ, ప్రతి అణువులోనూ తానే నిండి జీవం పోస్తున్నాడు. చివరకు తానే అంతా ఉపసంహరించి తనలోనే దాచుకుంటున్నాడు. అదే శివలింగం. పెద్దలు శివలింగాన్ని త్రిమూర్తి స్వరూపంగా చెబుతారు. చతురస్రంగా నేలపై ఉండేది బ్రహ్మభాగం. ఎనిమిది పలకలుగా ఉండేది విష్ణుస్వరూపం. కాగా పైన ఉన్నది శివశక్త్యాత్మకమైన లింగం. ఆ లింగం నుంచే అనుగ్రహమనే అయిదో కృత్యం రూపంలో శివుడు మళ్లీ సృష్టికి ప్రాణం పోస్తాడు అని పురాణ వచనం. శివలింగ తత్త్వాన్ని ఎంత పెంచి చూసినా, ఎంతెంత పైపైకి వెళ్లినా ఇంకా అదే దర్శనమిస్తుంది. ఎందుకంటే అంతటా ఉన్నది అదొక్కటే. అసలింతకీ ఎంతపైకి ఉందో చూద్దామని ప్రాణ స్వరూపమైన హంసనెక్కి బయలుదేరాడు బ్రహ్మ. ఆయనే స్వయాన బ్రహ్మ కనుక ఒక్కొక్క బ్రహ్మాండాన్నీ దాటి వెళ్లాడు. ఆ జ్యోతిస్ఫాటిక లింగం నిప్పులు ఎగజిమ్ముతూ సర్వానికీ కాంతిప్రదాతగా మరింత పైపైకి కనిపిస్తూనే ఉంది.
జ్వలాయ నమః జ్వలలింగాయ నమః, ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః, పరమాయ నమః పరమలింగాయ నమః…. అని తదేకంగా ధ్యానిస్తూ కిందికి వస్తున్నది మొగలిపువ్వు. ‘ఓ సుమమా! ఈ మహాతేజో లింగానికి అగ్రభాగమేదో నీకు తెలుసా?’ అని బ్రహ్మదేవుడు అడిగాడు. ‘అయ్యా! నేను అక్కడినుంచే వస్తున్నాను. విషయ వాసనలకు ప్రతీక నేను. నన్ను విసర్జించి శివుడు పైకెదిగాడు. నేను జారిపడుతూ.. చూస్తుండగానే ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అయితే ఇది ఎప్పుడో యుగాల కిందటి మాట. ఈపాటికి ఈ స్తంభం ఎంత పైకి ఎదిగిందో చెప్పలేను’ అన్నది పుష్పం. బ్రహ్మ శాంతించాడు. విస్తరించిన కొద్దీ శివతత్త్వానికి అంతులేదు. అంతటా అదే ఉంది అనుకున్నాడు బ్రహ్మ. విస్తరించడం కాదు లోలోపలికి దిగిచూస్తే సుసూక్ష్మంగా దర్శిస్తే ఏం కనిపిస్తుందని వెతికిన విష్ణువు అలిసిపోయాడు. పరమాణు స్థాయిలో కూడా లింగమే దర్శనమిచ్చింది. నిష్కళమైన అగ్నిస్తంభం నుంచి బ్రహ్మకు, విష్ణువుకు సంపూర్ణ మూర్తిమత్వంతో శివుడు దర్శనమిచ్చాడు. సకలతా నిష్కళతా నాకు మాత్రమే చెల్లుతాయి.
నా లింగ రూపానికి, మూర్తికి ఏ విధమైన భేదం లేదు అని సెలవిచ్చాడు. వారిపట్ల ప్రసన్నుడయ్యాడు. ..ఇది పురాణతత్త్వం. కాగా యోగ సాధకులు అనుసరించే మార్గం కూడా ఉంది. మనిషిలో అహంకారం నశించాలంటే, మనసులో శివలింగాన్ని ప్రతిష్ఠించుకోవాలని పెద్దలు చెబుతారు. అందుకోసం ప్రాణాయామం చేయాలి. మనలో ప్రాణశక్తి నిరంతరం ఖర్చయిపోతూ ఉంటుంది. అటువంటి ప్రాణశక్తిని వెన్నుపాములోకి మళ్లించగలిగితే అక్కడ ప్రాణకాంతి స్తంభం ప్రతిష్ఠితమవుతుంది. శివరాత్రినాడు బ్రహ్మ హంసగా, విష్ణువు వరాహంగా మారి జ్యోతిర్లింగానికి తుదిమొదలు కనుక్కోవడానికి బయలుదేరారు. యోగశాస్త్రం ప్రాణాన్ని హంస అని చెప్పింది. వరాహమంటే కూడా ప్రాణమే. హంస పైకి పోయే ప్రాణం అయితే వరాహం కిందికి పోయే అపానం. ఆ రెండూ వ్యతిరేక దిశల్లో ప్రయాణం చేస్తూ ప్రాణకాంతి స్తంభమనే శివలింగాన్ని మనలో స్థాపించగలవు. సర్వభూతాలూ నిద్రపోయేవేళ, ప్రాణశక్తిని ఇంద్రియాల ద్వారా వ్యర్థం చేసుకొనే వేళ యోగి మెలకువగా ఉంటాడు. ధ్యానయోగంతో మహాశివ యోగీశ్వరుణ్ని అనుకరిస్తారు.
పరమశివుని త్రిశూలం త్రిగుణాలకు సంకేతం. తమోరజో గుణాలను వంచి దారికి తీసుకురావాలి. అదే సత్త్వగుణం స్వతఃసిద్ధంగా సూటిగా కొనదేలి ఉంటుంది. ఈ సంకేతార్థాన్ని చెప్పడానికే శివుడు త్రిశూలం ధరించాడు. ఆయన డమరుకం సమస్త శాస్ర్తాలకూ పుట్టుకనిచ్చింది. కైలాసంలో అందరికీ మూడు కన్నులు ఉంటాయని, వైకుంఠంలో ప్రతి ఒక్కరికీ నాలుగు చేతులు ఉంటాయని పురాణాలు చెబుతాయి. శివత్వం లేదా విష్ణుత్వం సాధించడానికి ఇవి సంకేతాలు. మూడోకన్ను కనుబొమల మధ్య స్థానమైన భ్రుకుటి వద్ద ఉంటుంది. మనసులోని ఊహలన్నింటినీ యోగులు ఆ వేదికపై దర్శిస్తారు. కనులు మూసుకుంటే క్షణకాలం కనిపించి మాయమైపోయే దృశ్యాన్ని ఒడిసిపట్టి నిత్య దర్శనీయం చేసుకోవడమే సాధన.
శివుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడని పురాణవేత్తలు చెబుతారు. నవనిధులకూ అధిపతి అయిన కుబేరుడు ఆయనకు ప్రియస్నేహితుడు. శివాలయాలన్నిటిలో గర్భాలయానికి పైన మహాలక్ష్మీదేవి ప్రతిమ ఉంటుంది. సంపదలన్నీ ఆయననే ఆశ్రయించుకుని ఉన్నా శివుడు విరాగి కావడం లీల. శ్మశానంలో నివసించినా, బూడిద మైపూతగా పూసుకున్నా వైరాగ్య లక్షణాలు లేనివాడు నిజమైన జ్ఞాని కాలేడని చెప్పడమే పరమార్థం. భయపెట్టే పాములు ఒంటిపై తారట్లాడుతున్నా, ఎముకలు కొరికే చలిలో కూర్చున్నా ఏకాగ్రత సడలనివ్వని తపస్వి భంగిమలో శివుడు కనిపిస్తాడు. కర్తవ్యదీక్షా పరాయణుడు ఆటంకాలకు, ప్రమాదాలకు భయపడకుండా ఆయనలా ఏకాగ్రతతో లక్ష్యంవైపు అడుగులేయాలి.
ఈ సమస్త సృష్టిలో శివుడు కానిదేదీ లేదు. ఆయన శాశ్వతుడు. సనాతనుడు – నవయువకుడు కూడా ఆయనే. ఆయన పురుషుడే కాదు… స్త్రీ కూడా. సృష్టిలోని ప్రతి ద్వంద్వాన్ని ఆక్రమించుకుని ఆయన ద్వంద్వాతీతుడు అయ్యాడు. అనులోమ, విలోమ స్థాయీభేదాలను మాత్రమే కాదు… సానుకూల, వ్యతిరేకాలలో సైతం ఆయనే ఉన్నాడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఎందుకంటే ఆయనే పాలకుడు కనుక. జన్మనిచ్చేది ఆయనే.. జన్మించేది ఆయనే. మృత్యువూ ఆయనే. మృత్యుంజయుడూ ఆయనే. కాలాత్మకుడు, కాలాంతకుడూ కూడా ఆయనే. జీవేశ్వరుడు, మహేశ్వరుడు ఒకడే. శివుడు మానవుణ్ని పంచభూతాలతోనే నిర్మించాడు. సూర్యుడనే చైతన్యం, చంద్రుడనే ఆనందం ఇచ్చాడు. జీవునిగా మనిషి లోపల వెలుగొందుతున్నాడు. అందుకే ఎవరూ శివుడంటే… నువ్వూ నేనే కదా!
లింగమనే శబ్దానికి చిహ్నమని అర్థం. లింగంలో ఆకారం కానీ, రూపం కానీ ఉండదు. కానీ శివుడు కేవలం లింగరూపి కాడు. ఆయనకు సకల, నిష్కళ, సకలనిష్కళ అనే మూడు రూపాలున్నాయి. ఈశాన మంత్రం ఆయనకు కిరీటం. తత్పురుష మంత్రం ముఖం. అఘోర మంత్రం హృదయం. వామదేవ మంత్రం గుహ్యభాగం. సద్యోజాత మంత్రం పాదాలు. శివుడు మంత్రమయుడు.
ఈ సమస్త సృష్టి శివపార్వతుల శృంగారంలోనుంచి వచ్చిందే అంటాయి పురాణాలు. అది దివ్య ప్రణయం. కనుకనే దానినుంచి జీవజాతులు మాత్రమే కాకుండా లోకాల మొదలు లోహాదుల వరకు అన్నీ పుట్టాయి. పురాణ గాథలలోని ప్రణయ సంకేతాన్ని అర్థం చేసుకోవడానికి మనం మన విజ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా… సరిగ్గా వినియోగించుకోవడం నేర్చుకోవాలి. “మహాదేవుని నాట్యవిన్యాసమే సృష్టి ప్రారంభానికి, మనుగడకు, విచ్ఛేదనానికి కూడా కారణం. సృష్టిలోని ప్రతి పరమాణువూ ఆ నటరాజ నాట్యవిన్యాసానికి స్పందిస్తూ శక్తిని పొందుతున్నది” అంటాడు టావో ఆఫ్ ఫిజిక్స్ రచయిత ఫ్రిట్జ్ ఆఫ్ కాప్రా. అయిదు దశాబ్దాలకు పూర్వమే భౌతికశాస్త్ర సిద్ధాంతాల ఆలంబనగా మన ఆధ్యాత్మిక విజ్ఞాన మూలాల్ని పరిశోధించాడాయన. ఆయన తరువాత పాశ్చాత్య శాస్త్రవేత్తలలో ఇటువంటి ధోరణి మరింత పుంజుకుంది. అసలు మన బ్రహ్మాండమే శివలింగానికి ప్రతీక అని నవీన పరిశోధనలు కూడా రుజువు చేస్తున్నాయి. నాసా వారు ఒకసారి వేర్వేరు ప్రాంతాలనుంచి మన విశ్వాన్ని వీలైనంత వెనక్కు జూమ్ బ్యాక్ చేసుకుంటూ కొన్ని ఫొటోలు తీశారు. వారు అడ్డంగా విడుదల చేసిన ఈ ఫొటోను నిలువుగా తిప్పి చూస్తే ఇది బ్రహ్మాండ శివలింగం అని చెప్పడానికి సంశయం అక్కర్లేదు.
ఆశుతోషుడు అంటే స్వల్పవిషయాలకే సంతోషించే లక్షణం శివుడిని భక్తులకు దగ్గర చేసింది. చెంబెడు నీళ్లుపోస్తే, ఒక్క మారేడుదళం సమర్పిస్తే పొంగిపోతాడు. ఆయన ఉబ్బులింగడు. బోళాశంకరుడు. వరాలు కురిపించి మోసపోయాడని భస్మాసుర వృత్తాంతం వంటివి తెలియచేస్తాయి. వేదంలోని నమకం మాత్రం వరాలు కురిపించి మనల్ని మోహంలో బందీలను చేస్తాడని చెప్పింది. ఆ మోహాల సంకెళ్లు విడివడాలన్నా మళ్లీ ఆయనే దిక్కు. మనలోని చెడ్డ గుణాలను దొంగిలించేవాడు, సకల సద్గుణాలను ప్రసాదించే ప్రభువు ఆయనే అని వివరించింది నమకం. ఆయన అన్నీ ఇస్తాడు. కానీ మనకే ఆయననుంచి ఏం కోరుకోవాలో తెలియదు. మనం ఏం కోరుకోవాలో చమకం తెలియచేసింది.
– సమయ