బెంగళూరు : గవర్నర్లు, సీఎంలు, మంత్రుల దర్జా వల్ల సామాన్యులు ఎంతలా ఇబ్బందిపడుతున్నారో చెప్పే ఘటన ఇది. వాళ్లు రోడ్ల మీద వెళ్తుంటే ట్రాఫిక్ను గంటల తరబడి ఆపేయడం వల్ల సామాన్య జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెంగుళూరులోని ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డులో ఆదివారం గవర్నర్ వస్తున్నారని ట్రాఫిక్ను అరగంటకు పైనే ఆపేశారు. దీంతో ఓ వ్యక్తి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ గవర్నర్ కాన్వాయ్ వెళ్లే రోడ్డుపై బైఠాయించాడు.
ఆ వ్యక్తి గర్భవతి అయిన తన భార్యను అత్యవసర చికిత్స కోసం దవాఖానకి తీసుకెళ్తున్నాడు. గవర్నర్ కోసం ట్రాఫిక్ ఆపేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగాడు. దీంతో చేసేది లేక పోలీసులు వాహనాలను ఒక వైపు నుంచి వెళ్లనిచ్చారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు వీఐపీ హోదాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.