ఇది వర్షకాలం. ఇది మా ప్రజలకు హర్షకాలం. మబ్బులు ఆకసంలో కమ్ముకుంటే నెమలికంటె ఎక్కువ ఆనందిస్తారు మా పల్లె జనులు. ఈ కాలం రైతులకే కాదు. దేశానికే ప్రాణం. ఉన్నవాడికీ లేనివాడికీ ఇంత కూడూ గుడ్డా పెట్టగలిగింది ఈ కాలమే. పల్లెల్లో హలం ఆడడానికీ, నగరాల్లో బేతాళుని లాంటి చక్రాలు తిరగడానికీ, ప్రభుయంత్రం సాగడానికీ అన్నిటికీ ఈ కాలమే ఆధారం.
ఆకాశం మబ్బులతో నిండుతుంది. సింహంలా, సముద్రంలా గర్జిస్తుంది. జనం అర్జునుణ్ణి తల్చుకుంటారు. ఆకాశం తళుక్కుమంటుంది. రైతుల, కూలీల గుండెల్లో ఆశాజ్యోతి మెరుస్తుంది. వర్షం ధారాపాతంగా కురుస్తుంది. ఆకలితో, దప్పితోనున్న భూమిని తడుపుతుంది. నేల పసిరిక కప్పుకుంటుంది. హలం భూమిని చీలుస్తుంది. విత్తులు విత్తుతుంది. ఏర్లు పొంగుతాయి. యవ్వనవతులై ప్రవహిస్తాయి. పొడుగైన తాటిచెట్టు నీడలా ఎవ్వరికీ పనికిరాకుండా పోయే నదులు అనేకం ఉన్నాయి. ఉప్పెన తెచ్చి దేశానికీ ప్రజలకు ముప్పు తెచ్చినప్పుడు విరాళాల పేరుతో కొందర్ని ఉద్ధరించే నదులు కొన్ని ఉండగా, అరటి చెట్టులా అన్నిటికీ ఉపయోగించే నదులు కొన్ని ఉన్నాయి.
వర్షం పడుతుంది. హర్షం పెరుగుతుంది. ఎండు డొక్కల్తో జంతువులూ, మనుషులూ కఱ్ఱ నాగళ్ళ సహితంగా అడవి చేర్తారు. ఊళ్ళు వదులుతారు. భూమాతను ఆడా, మగా భేదం లేకుండా కరువుతో యుద్ధం చేయడానికి నాగళ్ళూ, గొడ్డళ్ళూ, కొడవళ్ళూ పట్టుకొని పరుగెడతారు. తమ స్వేదంతో భూమిని తడుపుతారు. గింజలు చల్లుతారు. తర్వాత…? వర్షం మా దేశానికి అమృతం. ఆ అమృతం వర్షించే దేవుడు పర్జన్యుడు. ఆయన దయకై వేచి యుంటారు.
మానవుడు ప్రకృతిపై ప్రభుత్వం చలాయిస్తూ చంద్రమండలానికి ప్రయాణం ఔతున్న ఈ రోజుల్లో, సరిహద్దులు మలిగి లోకం ఏకం కావడానికి ప్రయత్నాలు జరుగుతున్న ఈ రోజుల్లో, మృత్యువుతో పోరాడి జయించడానికి ప్రణాళికలల్లుతున్న ఈ రోజుల్లో, మానవతను నాశనం చేసే ఈ మరణాయుధాలను మానవ కల్యాణానికి వినియోగించడానికి ఉద్యుక్తులౌతున్న ఈ రోజుల్లో, మా రైతులు, మా కూలీలు, మా భూస్వాములు, మా జమీందారులు, మా ప్రభుత్వం, మా మిల్లులు, అన్నీ పర్జన్యుని దయ మీద ఆధారపడాల్సిందే. ఇది వేదకాలం నుంచి వస్తున్న ఆధారం. ఇందులో నేటికీ మార్పులేదు. మార్పులేకుండా ఉంచడానికి ప్రయత్నించే మహామహులున్నారు.
– దాశరథి రంగాచార్య దేహదాసు లేఖలు నుంచి