ఒకమారు విశ్వనాథ సత్యనారాయణగారు విశాఖపట్టణం వచ్చారు. అప్పుడే కొత్తగా ప్లీడరీ ప్రాక్టీసు పెట్టిన మిత్రుడు కాళూరి నరసింగరావు తన ఇంటికి విశ్వనాథవారిని భోజనానికి పిలిచాడు. కాళూరికీ నాకూ ఆరాధ్యదైవమైన విశ్వనాథని చూడడం అదే మొదటిసారి అనుకుంటాను. భోజనానంతరం సినీమాల ప్రస్తావన వచ్చింది. “ఈ బయస్కోపులంటే నాకు ఇష్టంలేదు” అని సత్యనారాయణగారు మమ్మల్ని చాలా నిరుత్సాహపరిచారు. చలనచిత్రాలలో కూడా కళ ఉండవచ్చునని ఎలా వారికి నచ్చచెప్పాలో నాకు తోచడంలేదు. గడుసువాడు కాబట్టి కాళూరి, “సత్యనారాయణగారూ, మీరు చూసేది బయస్కోపు కాదు, BIAS స్కోపు” అన్నాడు.
తర్వాత చాలాకాలానికి లండన్లో గాంధీగారిని చార్లీచాప్లిన్ చూసినప్పుడు చలనచిత్రాలను తూలనాడుతూ గాంధీగారు మాట్లాడబోతే, చాప్లిన్ కాస్త గట్టిగానే ఇచ్చుకున్నాడు. తానే ప్రపంచ ప్రసిద్ధుడయిన వ్యక్తి అయినట్లుగా గాంధీగారు చాప్లిన్ పేరే వినలేదనీ, అసలు సినీమా ఎలా ఉంటుందో తన కనవసరమనీ, అయినా ఈ యంత్ర నాగరికత అంటేనే తనకు పరమ అసహ్యమనీ ఆ అంగవస్త్రధారి మాట్లాడితే… చాప్లిన్ తనకు కూడా ప్రపంచపు మారుమూలల్లో సహా కాస్త పేరుందనీ, ప్రపంచ ప్రజలందర్నీ ఏకం చెయ్యగల ఒకే భాష మూకీ చిత్రం మాట్లాడుతుందనీ, ఇంతకీ గాంధీగారు మెచ్చుకొనే రాట్నం కూడా ఒక యంత్రమే అనీ, మనం తిట్టవలసింది యంత్రాలనికాక వాటిని సాటి మానవుణ్ని దోచుకునే సాధనాలుగా ఉపయోగించే మానవుల్నే అనీ, ఇలా యెడాపెడా వాయించాడు. ఈ కమ్యూనిస్టుతో వాదించి లాభం లేదనుకున్నాడో యేమో అక్కడితో గాంధీగారు మౌనంలోకి నిష్క్రమించారు.
మానవ సమాజాన్ని ఎంతో ప్రభావితం చెయ్యగల సినీమా ఇప్పటికీ నాకు సరదాగానే మిగిలింది. కాకపోతే నాకూ నా వాళ్ళకీ కూడూ గుడ్డా పెట్టే సాధనంగా పనికొస్తోంది. నాకున్న ఇన్ని సంవత్సరాల సినీమా అనుభవంతోనూ లవలేశమైనా సామాజిక ప్రయోజనం సాధించలేకపోయాను. ఏమో, ఇకమీద సాధిస్తానేమో. అంతవరకున్నవి సినీమా సరదాలు మాత్రమే.
– మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) ఆత్మకథ ‘అనంతం’ నుంచి