కరోనా మూడో వేవ్ వచ్చేలా ఉంది. మొదటి వేవ్ నుంచే అంతా ఫిట్నెస్, రోగ నిరోధక శక్తి మీద దృష్టిపెట్టారు. ఒకవేళ, ఇంకో లాక్డౌన్ ప్రకటిస్తే, మళ్లీ ఇంట్లోనే జిమ్ చేయాల్సిన పరిస్థితి. ‘గురువులేని విద్య గుడ్డిదే’ అన్నట్లు ట్రైనర్ లేకుండా ఎలాంటి ఫీట్లు చేసినా రిస్కే. ఒంటినొప్పులు తప్పవు. ఆ బాధల నుంచి విముక్తుల్ని చేయడానికి వచ్చేసింది.. ‘స్మార్ట్ మిర్రర్’. మన హైదరాబాద్ యువకుడు డిజైన్ చేసిన ‘పోర్టల్ స్మార్ట్ మిర్రర్’తో ఇంటిల్లిపాదికీ జిమ్ ట్రైనర్, ఫ్యామిలీ డాక్టర్ దొరికినట్టే.
డబ్బున్నవాళ్లు పర్సనల్ జిమ్ ట్రైనర్ను పెట్టుకుంటారు. వేలకు వేలు ధారపోసి ట్రైనర్ల పర్యవేక్షణలో ఫిట్నెస్ పెంచుకుంటారు. మరి, సాధారణ ప్రజలకు ఎవరు దిక్కు? ఒకవేళ కరోనా మూడోవేవ్ దెబ్బకి మళ్లీ లాక్డౌన్ ప్రకటిస్తే.. ఫిట్నెస్ పరిస్థితి ఏమిటి? తినే ఆహారాన్ని, జిమ్ శిక్షణను ఎవరు పర్యవేక్షించాలి?.. ఈ సమస్యలకు సమాధానమే హైదరాబాదీ స్టార్టప్ Portl. ఇంద్రనీల్ గుప్తా, విశాల్ అనే జిగిరీ దోస్తులకు వచ్చిన ఆలోచనే.. స్మార్ట్ మిర్రర్. ఈ అద్దం కనుక మీ ఇంట్లో ఉంటే తినే తిండి, చేసే జిమ్.. నిత్యం సమీక్షించుకోవచ్చు. మనల్ని మనం మెరుగుపరుచుకోవచ్చు.
43 అంగుళాల పోర్టల్.. స్మార్ట్ మిర్రర్ స్క్రీన్ను కలిగి ఉంటుంది. దీనికంటూ ప్రత్యేకమైన స్థలం అవసరం లేదు. గోడకు తగిలించుకోవచ్చు. లేదంటే, నేలపై నిలబెట్టొచ్చు. చూడ్డానికి అద్దంలాగే ఉన్నా ఇందులో బయో సెన్సర్లు ఉంటాయి. మీ వర్కవుట్ను క్షణ్నంగా పరిశీలించే హెచ్డీ కెమెరా ఉంటుంది. బ్లూటూత్, వైఫై సాయంతో ఈ హైటెక్ పరికరం మీ శరీర కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఉదాహరణకు మీరు డంబెల్స్ను సరైన పద్ధతిలో పట్టుకోకపోతే వెంటనే హెచ్చరిస్తుంది. ఎలా పట్టుకోవాలో సూచిస్తుంది. ఏ కసరత్తు అయినా సరే.. లోటుపాట్లు చెప్పేస్తుంది. ఎలా చేయాలో చూపిస్తుంది కూడా. అందుబాటులో ఉన్న పరికరాలను ఎలా ఉపయోగించాలన్నదీ చెబుతుంది. వ్యాయామం వల్ల కలిగే నొప్పిని తగ్గించుకునేందుకు ఎలాంటి చిట్కాలు అనుసరించాలో సూచిస్తుంది.
ఈ స్మార్ట్ మిర్రర్ వ్యాయామానికి ముందే.. ఈసీజీ, రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్, శరీర ఉష్ణోగ్రత, శ్వాసకోశ, హృదయ స్పందన వంటివాటిని భిన్న కొలమానాలతో ట్రాక్ చేస్తుంది. వీటికోసం ప్రత్యేకంగా కెమెరాతో పాటు ఏడు సెన్సర్లు ఉంటాయి. ఇవి వ్యాయామం చేసే వ్యక్తి ఆరోగ్యాన్ని పర్యవేక్షించి.. ఎంతవరకు చేయాలో, ఎప్పుడు ఆపాలో కూడా చెప్పేస్తాయి. ఈ మిర్రర్ నుంచే వ్యక్తిగత శిక్షణ తరగతులకు హాజరుకావచ్చు. పోషకాహారం, ధ్యానం, యోగా శిక్షణలో పాల్గొనవచ్చు. ఇంద్రనీల్ గుప్తాకు సెన్సర్లపై ఇంత పట్టు ఉండటానికి కారణం.. లండన్లో ఆపిల్ కంపెనీలో సెన్సర్లు, హార్డ్వేర్ విభాగంలో పనిచేయడమే. అందుకే బయో సెన్సర్లతోనే తన పని సగం పూర్తయిందని అంటున్నాడు. ఈ స్మార్ట్ మిర్రర్లోని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మిమ్మల్ని నిలువెల్లా తనిఖీ చేసి, మెరుగైన సమాచారం అందిస్తుంది. ఈ కాన్సెప్ట్ను ఆలోచించడానికే తన బృందానికి ఆరు నెలల సమయం పట్టిందని చెబుతున్నాడు గుప్తా. 35 ఏండ్లు
పైబడిన వారికి ఈ స్మార్ట్ మిర్రర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు చంద్రనీల్, విశాల్. దీని రెండు వెర్షన్లను మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఒకటి అధునాతన బయో సెన్సర్లు కలిగిన మిర్రర్. మరొకటి నార్మల్ స్మార్ట్ మిర్రర్. పోర్టల్ స్మార్ట్ మిర్రర్ ధర 75 వేల నుంచి 80 వేల మధ్య ఉంటుందని చెబుతున్నాడు ఇంద్రనీల్. ఇప్పటికే 150 మంది ఆర్డర్ ఇచ్చారని, ముందుగా వారికి డెలివరీ చేయనున్నామని తెలిపారు.